తాడేపల్లి: పేదల ఇళ్ళకు గండి కొట్టే కుట్రల వెనుక టీడీపీ..చంద్రబాబుఉన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళ నిర్మాణ పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఓ మహా యజ్ఞంలా ముందుకు తీసుకువెళుతుంటే.. తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాటిని అడ్డుకునేందుకు న్యాయస్థానాల్లో తప్పుడు పిటిషన్లు వేయించి కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. హైకోర్టు సాక్షిగా టీడీపీ దుర్బుద్ధి ఏమిటో బయటపడిందన్నారు. తమ వికృత రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాలను వేదికలుగా వాడుకోవడం బాధాకరమన్నారు. ప్రజా క్షేత్రంలో జగన్ మోహన్ రెడ్డిగారితో తలపడలేక.. న్యాయ స్థానాలను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయం చేస్తుందని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో కేవలం 224 చ. అడుగుల్లో ఇళ్ళ నిర్మాణం చేపడితే.. శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం 340 చ. అడుగుల్లో పేదలకు ఇళ్ళ నిర్మాణం చేపడుతుందని తెలిపారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళు మనుషులు ఉండటానికి పనికిరావన్నారు. చంద్రబాబు హయాంలో పిచ్చుకలు, పావురాళ్ళ గూళ్ళులా నిర్మించిన ఇళ్ళలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయా.. లేక ఇప్పటి ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగతంగా నిర్మిస్తున్న ఇళ్ళల్లో ప్రమాదాలు జరుగుతాయా అని సజ్జల ప్రశ్నించారు. జాతీయ ప్రమాణాలకు మించి, నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) నిబంధనలు పాటిస్తూనే, వాటిలో నిర్దేశించిన దాని కంటే ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. దేశంలోని ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, అరుణాచల ప్రదేశ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, జార్ఖండ్, జమ్ము-కశ్మీర్ రాష్ట్రాలతో పోల్చుకున్నా.. ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఆ రాష్ట్రాలకంటే ఎక్కువగా 31.72 చ. మీటర్ల స్థలంలో ఇళ్ళ నిర్మాణం చేస్తుందని గణాంకాలతో సహా సజ్జల వివరింంచారు. పేదల ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రణాళిక ఏదైతే ఉందో.. 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి హైకోర్టు తీర్పు ద్వారా పెద్ద దెబ్బ తగిలింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం కంటే లక్షలాది పేద కుటుంబాల ఆశలు ఆవిరి అయ్యేట్లుగా, వారి కలలు సాకారం అవుతున్నాయనుకున్న సమయంలో, అసలు జరుగుతుందా లేదా? మళ్లీ ఖర్చు ఎంత అవుతుందో అనేలా పేదవర్గాల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఆ విధంగా పేదల సొంతింటి కలను టీడీపీ అడ్డుకుంటోంది. పేదల ఇళ్ళ నిర్మాణంపై అడ్డగోలు కారణాలు చూపి పిటిషన్లు వేసినవారు... తీరా, కోర్టుల్లో వేసిన పిటిషన్లతో తమకు సంబంధం లేదని, తాము అసలు పిటిషన్లు వేయలేదని ముందుకు రావడం చూస్తుంటే.. దాని వెనుక ఎవరున్నారు? దుష్ట పన్నాగాలతో కొద్దిమంది రాజకీయ శక్తులు తెర వెనక ఉండి వికృత క్రీడకు తెర తీశారని భావించాల్సి వస్తోంది. వీళ్ల రాజకీయాలకు న్యాయస్థానాలను వేదికలుగా వాడుకోవడం బాధాకరం. ఇటువంటి మనస్తత్వం కలిగిన రాజకీయ శక్తుల కోవలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కుట్ర వెనుక ఉన్నారని నమ్ముతున్నాం. తీర్పు వచ్చింది దానిపై అప్పీలుకు వెళుతున్నాం. కోర్టులో న్యాయమే గెలుస్తుంది. దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇల్లు అనేది అత్యంత మౌలిక అవసరం. రాష్ట్రంలో అయిదు కోట్ల మంది జనాభా ఉంటే వాళ్లలో 30లక్షల మంది ఇళ్లు లేనివాళ్లు ఉన్నారని వచ్చిన దరఖాస్తుల ద్వారా తేటతెల్లం అయింది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇంకా సొంత ఇళ్లు లేనివాళ్లు ఇన్ని లక్షల మంది ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారి హయాం తర్వాత.. ఇంత భారీ యజ్ఞాన్ని దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో గృహ నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు శరాఘాతంగా తగిలింది. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒక్కసారి ఇంత భారీ ఎత్తున పేదలకు పక్కా ఇళ్ళ నిర్మాణం చేస్తున్నప్పుడు, భవిష్యత్తులో ఇల్లు లేదని ఎవరూ చేయి ఎత్తకూడదని, గతంలోలా మాదిరిగా ఇంటి స్థలంగానీ, ఇల్లుగానీ డీ-పట్టా కాకుండా, యాజమాన్య హక్కులు ఇచ్చి, ఆ తర్వాత అమ్ముకోవడానికి, మార్టిగేజ్ చేయడానికి వీలుగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలు తెలుసుకుని, పేదలకు ఇళ్ళు ఇవ్వడమే కాకుండా, కాలమాన పరిస్థితులను బట్టి, వారి భవిష్యత్ ప్రణాళికలకు అనుకూలంగా, తమ ఆస్థిగా వాడుకోవడానికి వీలు కల్పిస్తూ అందులోనూ మహిళల పేరు మీదే ఇళ్ల పట్టాలు ఇచ్చాం. దానికి అనుగుణంగానే జీవోలు జారీ చేయడం జరిగింది. ఇంత భారీఎత్తున పేదల ఇళ్ళ నిర్మాణం చేపట్టడం వల్ల అవి కాలనీలుగా కాకుండా, 15వేల ప్రదేశాల్లో ఊళ్లకు ఊళ్లు ఏర్పడుతున్నాయని మీడియాలోనే కథనాలు వస్తున్నాయి. మోడ్రన్ విలేజ్ ఎలా ఉండాలో ఆ విధంగా తయారుచేసేలా ఒక యాంబిషియస్ ప్లాన్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు రూ.32వేల కోట్లు కేటాయించి, ఇప్పటికే దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చు చేశాం. గతంలో పేదలకు ఇళ్లు నిర్మిస్తే అక్కడ రోడ్లు ఉండవు, ఒకవేళ ఇళ్లు కట్టే సమయానికి వేసినా రోడ్లు పోవడం, ఊరిబ యట ఇళ్లు కడితే అక్కడ మౌలిక సదుపాయాలు లేక, నివాసయోగ్యంగా లేకపోవడం, పెట్టిన డబ్బు అంతా వృథాగా పోవడం, మరోవైపు అసాంఘిక శక్తులకు అడ్డగా మారడం.. ఇటువంటివన్నీ మీడియాలో వచ్చే వార్తలు చూస్తూనే ఉన్నాం. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు లబ్ధిదారులకు అన్ని విధాలా యోగ్యమైనవిగా ఉండే ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోంది. లక్షలాది మంది పేదల సొంతింటి కల సాకారం అయ్యే దశలో, ఎక్కడ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారికి మంచి పేరు వస్తుందనే దుగ్ధతో, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ పన్నిన కుట్రే ఇది. ఎవరి పేరుతోనే అఫిడవిట్లు ఉన్నవాటిని తెచ్చి వాటిని కోర్టులో వేసి, గృహ నిర్మాణాలు ఆపివేయించాలనే ప్రయత్నం చేశారు, దీన్ని టీడీపీ కుట్రగానే భావిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదు.. కాబట్టి న్యాయం నిలబడుతుంది. ఇవన్నీ తాత్కాలిక మబ్బులే. అయితే టీడీపీ, చంద్రబాబు దుర్భుద్ధిని బయటపెట్టడమే ఈ వివరణ. కోర్టు చెప్పినట్లు ఇంటి నిర్మాణానికి సెంటు, సెంటున్నర ఎలా సరిపోతాయనుకున్నారో.. నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) ప్రమాణాలను ఫాలో కావడం, దానికన్నా ఎక్కువే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దూరదృష్టితో జాతీయ ప్రమాణాలకు నిబంధనలకు అనుగుణంగా నివాసయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకుంది. గతంలో పేదల ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి.. ప్లింత్ ఏరియా తీసుకుంటే.. అప్పట్లో ఇందిరమ్మ ఇళ్లు 215 చదరపు అడుగులలో కడితే, చంద్రబాబు నాయుడు హయాంలో 224 చదరపు అడుగులలో నిర్మించారు. అయితే , ఇవాళ నవరత్నాల్లో భాగంగా పేదలకు నిర్మిస్తున్న ఇళ్లు వరండాతో కలుపుకుని 340 చదరపు అడుగులు. ఇవి కాకుండా సెట్బ్యాక్, సైడ్ సెట్బ్యాక్ ఇవ్వడం జరిగింది. - నేషనల్ బిల్డింగ్ స్క్రీమ్ ప్రకారం చూస్తే... మొత్తంగా 221.9 చ.అడుగులు సరిపోతుందంటే... ఏపీలో ఇస్తున్నది 225.81 చదరపు అడుగులు. మన రాష్ట్రంలో స్థలం ఎంత ఇస్తున్నామో చూస్తే.. 31.72 చ. మీటర్ల ఉంటే.. అదే ఇతర రాష్ట్రాల్లో... అరుణాచల్ ప్రదేశ్లో లో 25 చ. మీటర్లు, యూపీలో 27.1చ. మీటర్లు, ఉత్తరాఖండ్ లో 27చ. మీటర్లు, నాగాలాండ్ లో 27.17చ. మీటర్లు, ఒడిశాలో 28.07చ. మీటర్లు, తమిళనాడులో 28.25 చ. మీటర్లు, జార్ఖండ్ లో 28.42 చ. మీటర్లు, జమ్మూ- కశ్మీర్ లో 29.05 చ. మీటర్లు ఉన్నాయి. - స్థలం పరంగా చూసినా మిగతా రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో 31.72 చ. మీటర్ల మేరకు ఇస్తూ, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం. అదే ప్లింత్, కార్పెట్ ఏరియా చూసినా నేషనల్ గైడ్లైన్స్ను దాటి కడుతున్నాం. అయినా టీడీపీ కోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది. - దీనికన్నా మించి క్లాసిక్ ఎగ్జాంపుల్ గా టిడ్కో ఇళ్లును తీసుకోవచ్చు. 300 చదరపు అడుగులతో గ్రౌండ్ ప్లస్ త్రీతో టీడీపీ సర్కార్ ఇస్తే... మా ప్రభుత్వం ఓపెన్ ఏరియాతో 340 చదరపు అడుగులతో సొంత ఇల్లు ఇస్తున్నాం. ఏమైనా ఏక్సిడెంట్లు, పర్యావరణం ముప్పు వాటిల్లేది పిచ్చుక గూళ్లు, పావురాల గూడుల్లా ఉన్న టిడ్కో ఇళ్లల్లో జరగాలి కానీ, ఓపెన్ ఏరియాలో ఉన్న ఇండిపెండెంట్ ఇళ్లలో జరుగుతాయా? పర్యావరణానికి సంబంధించి చూసినా... ఇంత పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ తో, హెల్త్, ఎన్విరాన్మెంటల్, హౌసింగ్కు సంబంధించిన మూడు శాఖలు సమిష్టిగా కూర్చుని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాతే ఈ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని, కోర్టుల్లో కేసులు వేసి ప్రభుత్వాన్ని ప్రజల్లో పలుచన చేయాలని ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ... తమ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు మనుషులు ఉండటానికే పనికిరాకూడదు కదా? టీడీపీ హయాంలో కట్టిన ఇళ్ళల్లో.. నాలుగో అంతస్తులో పెద్దవాళ్లు ఉంటే, ఒక వేళ అగ్నిప్రమాదం జరిగితే ఎలా బయటకు వస్తారు? మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఎందుకు ఆలోచించలేదు? - ప్రజల ఆశీస్సులు పూర్తిగా ఉన్న మా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే చేస్తున్న అర్థంలేని ప్రయత్నాలు, దుర్భిద్ధితో కూడిన ప్రయత్నాలని భావిస్తున్నాం. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన చంద్రబాబు నాయుడు కోర్టులను అడ్డం పెట్టుకుని కొత్త కొత్త వాదనలు తెరమీదకు తెస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా తమకు అందుబాటులో ఉన్న వనరులను వాడుకుంటూ వీలైనంతవరకూ లబ్ధిదారులు సుఖంగా, ప్రశాంతంగా ఉండేలా, అంతకన్నా ముందు ఉండేదానికన్నా మెరుగైన జీవనం ఉండేలా ప్రయత్నిస్తుంది. చంద్రబాబు నాయుడు, టీడీపీ దుర్భుద్దితో చేసిన ఈ ప్రయత్నాన్ని గృహ లబ్ధిదారులు తీవ్రంగా నిరసించడమే కాకుండా అసహ్యించుకుంటారు. ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తారు. టీడీపీని ప్రజలు ఇప్పటికే చెత్తబుట్టలో వేశారు. అయినా వారి ఆలోచనలు మారడం లేదు. ప్రజలకు అనుకూలంగా ఏదైనా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తే దాన్ని అడ్గుకోవడానికి టీడీపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. - రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రుణాలు తెచ్చిన ప్రతి పైసా పేద ప్రజల అభ్యున్నతి కోసమే ఉపయోగించడం జరిగింది. పేద ప్రజలు ఎవరి మీద ఆధారపడకుండా భవిష్యత్లో తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రభుత్వం యత్నిస్తోంది. - చంద్రబాబు నాయుడులా ఎన్నికల ముందు, పసుపు-కుంకుమ పథకం ద్వారా పంచిపెట్టే ప్రయత్నం మేము చేయలేదు. ఈ కుట్రలను ప్రజలంతా గమనించాలి. మేధావులు, విజ్ఞులు కూడా ఖండించాలని కోరుతున్నాం. విలేకర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ... బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించినంత వరకూ ప్రజల తీర్పుమీద మాకు ఎలాంటి సందేహం లేదు. జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో చేపట్టిన మంచి పనులు ప్రజల్లోకి వెళ్లాయి. దానివల్ల మంచి ఫలితమే వస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా పోటీలో ఉంటే బాగుండేది. పోటీలో ఉన్న బీజేపీకి జనసేన మద్దతు ఇస్తోంది. బీజేపీ నేత సునీల్ థియేధర్ మాటలను చూస్తుంటే.. హిందువులకు రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతోందని, ఘోరాలు జరిగిపోతున్నాయని మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వానికి అన్ని మతాలు, కులాలు సమానమే. ఇక్కడ లేని వాటిని ఆపాదించాలని చూడటం, ముఖ్యమంత్రిగారిపై మతం ప్రాతిపదికపై వ్యతిరేకత తీసుకురావాలని చూస్తున్నారు. ఆ వ్యాఖ్యల ద్వారా వారి అత్యాశను, లేక సంకుచిత భావనను వెలిబుచ్చారు. చేతనైతే ముఖ్యమంత్రిగారు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో లోపాలు ఎత్తిచూపితే బాగుంటుంది కానీ, మత రాజకీయాలు చేయడం, అప్పులు గురించి మాట్లాడటం సరికాదు. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుల మీద మాట్లాడరెందుకు? ఎందుకు బీజేపీకి ఓటు వేయాలో ఆ పార్టీ వాళ్లను చెప్పమనండి. - జగన్ గారిమీద అపోహలు సృష్టించాలని, అసంబద్ధమైన ఆరోపణలు చేసి మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు. వాళ్లు ఎంతదిగజారి ఆరోపణలు చేసినా... ప్రజలు వాటిని తిప్పికొట్టి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ప్రజలు ఓటు వేయాలని కోరుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడింది. మరోవైపు బొగ్గు ధర విపరీతంగా పెరిగిపోయింది. అధిక ధరకు బొగ్గు కొనుగోలు చేయాల్సి వస్తోంది. బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. పీక్ అవర్స్లో గృహ వినియోగదారులు విద్యుత్ వాడకాన్ని నియంత్రించుకుంటే బాగుంటుందని కోరుతున్నాం. దీని ద్వారా చాలావరకూ విద్యుత్ సరఫరాపై ఒత్తిడి తగ్గుతుంది. బొగ్గు కొరత లేదని కేంద్రమంత్రి చెబుతున్నా.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. - ముఖ్యమంత్రిగారు బొగ్గు కొరతపై అప్రమత్తంగా ఉండటం వల్లే ప్రధానమంత్రిగారికి లేఖ రాశారు. దాన్నే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్నారు. పరిస్థితి చేయి దాటితే వేసవిలో ప్రభావం చాలా తీవ్రతరంగా ఉంటుంది. దాన్ని కొంతవరకూ తగ్గించుకోవాలంటే గృహ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకుంటే చాలావరకూ పరిస్థితిని అదుపులో పెట్టుకోవచ్చు. ఇందుకు మీడియా కూడా సహకరించాలి. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి కొంత ఆలస్యమవుతుంది. ఆ పరిస్థితిని ఉద్యోగ సంఘాలు కూడా అర్థం చేసుకుని సహకరిస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.