ఏలూరు: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వైయస్ఆర్సీపీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాశ్ విమర్శించారు. మంగళవారం ఏలూరులో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై అసత్య ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. కూటమి నేతలు లడ్డూ అంశంపై తప్పుడు ప్రచారం మానుకుని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు గుడిదీసి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి నూకపేయ్యి సుధీర్ బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నాల జాన్ గురునాథ్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నేరుసు చిరంజీవి, జిల్లా కార్యదర్శి కంచుమర్తి తులసి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు జుజ్జువరపు విజయనిర్మల, నగర దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు ఆగాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.