గవర్నర్‌ను కలిసిన వైయస్ఆర్‌సీపీ ప్రతినిధిబృందం

వైయస్ జగన్ భద్రత విషయంలో ప్రభుత్వ కుట్రలపై ఫిర్యాదు

జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న జగన్‌కు కనీస భద్రత కల్పించడం లేదని వివరించిన నేతలు

అక్రమ కేసులతో కూటమి ప్రభుత్వ అరాచక పాలనను గవర్నర్‌ దృష్టికి తెచ్చిన నేతలు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్‌కు విజ్క్షప్తి

విజయవాడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలన, అప్రజాస్వామిక విధానాలు, కక్షసాధింపులో భాగంగా అక్రమ కేసుల బనాయింపు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కు భద్రత కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనంపై విజయవాడ రాజ్‌భవన్‌లో వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూసినె విరూపాక్షి, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైయస్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ తదితరులు గవర్నర్‌ను కలిసి, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై, ప్రభుత్వం చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆయనకు వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

 

అనంతరం రాజ్‌భవన్ బయట శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ...

చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చేస్తున్న అఘాయిత్యాలు, మాజీ సీఎం వైయస్ జగన్‌కు కల్పించాల్సిన భద్రతను విస్మరించడం, ఆయన పర్యటనల సందర్భంగా అక్రమ కేసులను బనాయిస్తున్న విధానాలపై గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. ఇవి అప్రజాస్వామికం, గతంలో ఎవరూ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు, కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న వైనంపై గవర్నర్‌కు వివరించాం. ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన వైయస్ జగన్ పర్యటన సందర్భంగా ఒక వాహనం ఢీ కొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ  దుర్ఘటనపై సాక్షాత్తు పల్నాడు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ ప్రమాదానికి వైయస్ జగన్‌కు చెందిన కాన్వాయి వాహనాలు కారణం కాదు, వేరే ప్రైవేటు వాహనం ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రమాదంలో సింగయ్య గాయపడటంతో పోలీసులే అతడిని ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత హటాత్తుగా పోలీసుల తీరు మారింది. ఈ సంఘటన వైయస్ జగన్ ప్రయాణించిన కారు ఢీకొనడం వల్లే జరిగిందటూ, ఎప్పుడూ చరిత్రలో జరగని విధంగా కారులో ప్రయాణిస్తున్న వారిపైన కూడా కేసులు నమోదు చేశారు. ఆ కారును కూడా సీజ్ చేసి తీసుకువెళ్ళారు. ఈ ప్రభుత్వం ఎటువంటి అరాచకంకు పాల్పడుతుందో దీని ద్వారా రాష్ట్రప్రజలందరికీ అర్థమవుతోంది. ఏదో ఒక విధంగా వైయస్ఆర్‌సీపీ నేతలను భయపెట్టాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఉంది. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని అడ్డుకోవాలని చూడటం వారి అవివేకం. వైయస్ జగన్ దేశంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడు, ఆయన పర్యటనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఆయన ఎక్కడకు వెళ్ళినా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారనే సమాచారం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లు ప్రభుత్వం వద్ద లేవా? ఎందకు దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయడం లేదని ప్రశ్నిస్తున్నాం. పైగా జరిగిన ప్రతి దానిని వక్రీకరిస్తూ మాపైనే ఎదురుదాడి చేస్తున్నారు. సత్తెనపల్లి సంఘటనపై మీకు మానవత్వం లేదా అని టీడీపీ నేతలు ప్రశ్నించడం చూస్తుంటే, ఇంతకంటే ఎదురుదాడి ఉంటుందా అనిపిస్తోంది. వైయస్ జగన్ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయి చుట్టూ వందల మంది ప్రజలు ఉన్నారు. ఆయనకు పోలీస్ భద్రత ఇచ్చామని చెబుతుంటే, అంత మంది ఆయన ప్రయాణిస్తున్న కారుకు అత్యంత సమీపంలోకి ఎలా వస్తున్నారు? సింగయ్య నిజంగానే వైయస్ జగన్ వాహనం కింద పడితే ఆ కారుకు ముందు ఉండాల్సిన పోలీస్ ఎస్కార్ట్‌ వాహనాలు, దానిలోని పోలీసులు, రోప్ పార్టీ ఎందుకు చూడలేదు? ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఏ సమాచారం ప్రకారం మొదట వివరాలను వెల్లడించారు? ఈ కుట్రనే గవర్నర్‌ గారి దృష్టికి తీసుకువచ్చామని బొత్స సత్యనారాయణ అన్నారు. 

డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తున్నారు

ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోంది. ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయలేక, ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో, వారి దృష్టి మళ్ళించేందుకు ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతోంది. ప్రజల తరుఫున బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం మాపైన ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు మేలు చేసేందుకు ఎప్పుడూ ముందుంటాం. స్వాతంత్రం వచ్చిన తరువాత ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ...

పవన్ కళ్యాణ్ ఎవడి నార తీస్తారు ... ఎవరి మక్కెలు ఇరగదీస్తారు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? పనికిమాలిన మాటలు మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే అందరి నార తీస్తారని గుర్తుంచుకోండి. హోంమంత్రి అనిత, ఒక ఎమ్మెల్యేగా జగన్‌కు భద్రత ఇచ్చామని చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారహితం. తెలివితక్కువ మాటలు వెనక్కి తీసుకోవాలి. జగన్ మోహన్ రెడ్డి కేవలం ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. గతంలో పర్యటనల సమయంలో చంద్రబాబు భద్రత కావాలని ఎందుకు అడిగారు? జడ్ ప్లస్ ఉన్న వ్యక్తికి భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

Back to Top