తాడేపల్లి : రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ రాష్ట్రానికి ప్రాణాధారమని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లేకుండా ఆ ప్రాంత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు. శ్రీశైలం నుంచి తెలంగాణ లిఫ్ట్ల ద్వారా రోజుకు 8 టీఎంసీల నీరు తరలిపోతుండగా ఏపీ ప్రభుత్వం అడ్డుకోలేకపోతోందని విమర్శించారు. గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రెస్మీట్లో వైయస్ జగన్ ఏమన్నారంటే.. 🔹 చంద్రబాబు స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు రహస్య ఒప్పందాలతో రాయలసీమకు అన్యాయం చేశారని చంద్రబాబుపై వైయస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, రాష్ట్ర పరిశ్రమల పురోగతి, ఆర్బీఐ నివేదిక, అప్పుల భారం, పన్నుల పేరిట ప్రజలపై మోపుతున్న భారాలు, ఆదాయ లీకేజీలు, అవినీతిపై విస్తృతంగా మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ – చంద్రబాబు ద్రోహం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఇన్సూరెన్స్ పాలసీ వంటిదని వైయస్ జగన్ తెలిపారు. ఏ మాత్రం నీటి వనరులు లేని ప్రాంతానికి ఈ ప్రాజెక్టు అత్యవసరమని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం వ్యాఖ్యలను చంద్రబాబు గానీ, ఆయన మంత్రులు గానీ ఖండించకపోవడం వెనుక రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడంలో చంద్రబాబు వెనుకాడడంలేదని విమర్శించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం నీటి మట్టాలు, గత 20 ఏళ్లలో కేవలం మూడు నాలుగు సార్లే నీరు రావడం వంటి గణాంకాలతో వాస్తవ పరిస్థితిని వివరించారు. తెలంగాణలో కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ వంటి లిఫ్ట్ ప్రాజెక్టుల ద్వారా రోజుకు సుమారు 8 టీఎంసీల నీరు తోడుకుంటున్న పరిస్థితిని గుర్తుచేశారు. వైయస్ఆర్సీపీ హయాంలో చేపట్టిన చర్యలు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీకి వెళ్లామని, ఫలితంగా జరిమానాలు విధించారని చెప్పారు. అదే సమయంలో రాయలసీమ కోసం 800 అడుగుల స్థాయి నుంచే రోజుకు 3 టీఎంసీల నీరు తోడేలా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ను చేపట్టి రూ.990 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ప్రాజెక్టు పూర్తయితే వైయస్ఆర్సీపీకి పేరు వస్తుందన్న భయంతోనే టీడీపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్కీమ్పై “చంద్రగ్రహణం” పడిందని వ్యాఖ్యానించారు. భోగాపురం ఎయిర్పోర్టు – క్రెడిట్ చోరీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన క్రెడిట్ను చంద్రబాబు దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారని వైయస్ జగన్ అన్నారు. మొదట 15 వేల ఎకరాలు, తర్వాత 5 వేల ఎకరాలు అంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని గుర్తు చేశారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్ష మేరకు 2,703 ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేపట్టామని తెలిపారు. 130 కోర్టు కేసులు పరిష్కరించి, 400 కుటుంబాలకు పునరావాసం కల్పించి, రూ.960 కోట్లతో భూసేకరణ పూర్తిచేసినట్టు చెప్పారు. అన్ని అనుమతులు తెచ్చి, 2023 మే 3న భూమి పూజ చేశామని, 2026 నాటికి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని ప్రకటించినట్టు గుర్తుచేశారు. అయినా ఇప్పుడు చంద్రబాబు “క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్” విధానంతో శ్రమలేకుండా పేరు కొట్టేయాలని చూస్తున్నారని విమర్శించారు. పరిశ్రమలపై ఆర్బీఐ నివేదిక – చంద్రబాబు అబద్ధాలు వైయస్ఆర్సీపీ హయాంలో పరిశ్రమలు వెళ్లిపోయాయన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని, దీనికి ఆర్బీఐ నివేదికే సాక్ష్యమని వైయస్ జగన్ తెలిపారు. 2019–24 మధ్య తయారీ రంగంలో గ్రాస్ వాల్యూ యాడెడ్, ఇండస్ట్రియల్ గ్రోత్లో దక్షిణ భారతంలో తొలి స్థానం, దేశంలో ఐదో స్థానం సాధించామని వివరించారు. 2014–19లో భారీ పరిశ్రమల పెట్టుబడులు రూ.50,708 కోట్లు మాత్రమే ఉంటే, వైయస్ఆర్సీపీహయాంలో కోవిడ్ ఉన్నా రూ.69,799 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. చంద్రబాబు హయాంలోనే సిమెంట్, స్టీల్ తదితర పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్లాయని ఆరోపించారు. పరిశ్రమల పేరుతో అవినీతి పెద్ద కంపెనీల పేరుతో వేల కోట్ల విలువైన భూములను బినామీలకు కట్టబెట్టడమే చంద్రబాబు విధానమని విమర్శించారు. విశాఖలో లూలూ కంపెనీకి వేల కోట్ల విలువైన భూమిని ఉచితంగా ఇవ్వడం, ఇతర గ్రూపులకు టెండర్లు లేకుండా భూముల కేటాయింపులు చేయడం ఘోర అవినీతి అని ఆరోపించారు. అప్పుల రాష్ట్రంగా ఏపీ – వాస్తవాలు రాష్ట్ర అప్పులపై కూడా వైయస్ జగన్ గణాంకాలతో సమాధానం ఇచ్చారు. 2014లో అప్పులు రూ.1.40 లక్షల కోట్లు కాగా, చంద్రబాబు హయాంలో 2019 నాటికి అవి రూ.3.90 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. వైయస్ఆర్సీపీ హయాంలో అప్పుల వృద్ధి రేటు తక్కువగా ఉందని, చేసిన అప్పుల్లో రూ.2.74 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే రూ.3 లక్షల కోట్లకుపైగా అప్పు చేసిందని, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతోందని విమర్శించారు. బాదుడే బాదుడు – దోపిడీ పాలన కరెంటు ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, నీటి ఛార్జీలు, రోడ్ సెస్, టోళ్ల పేరిట ప్రజలపై తీవ్ర భారం పడుతోందని వైయస్ జగన్ అన్నారు. ఇసుక, మట్టి, ఖనిజాల దోపిడీతో రాష్ట్ర ఆదాయం కుంగిపోతోందని, లంచాలు లేకుండా ఏ పని జరగని దుస్థితి నెలకొందని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఈ దశాబ్దంలోనే అతిపెద్ద స్కామ్ అని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టులో పిల్ దాఖలు చేశామని, కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని, దానిపై ఉద్యమాలు చేస్తామని, వైయస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రాగానే వాయువేగంతో ప్రాజెక్టును పూర్తి చేస్తామని వైయస్ జగన్ స్పష్టం చేశారు.