వైయస్ఆర్ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయం సాధించాలంటే జోన్, డివిజన్ కమిటీల పాత్ర కీలకమని వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడానికి ఆదివారం కడప నగరంలో వైయస్ఆర్సీపీ జోన్–డివిజన్ కమిటీల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాజంపేట పార్లమెంటరీ పరిశీలకులు కే. సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కమిటీలు పని చేయాలన్నారు. పార్టీ బలాన్ని గ్రామ స్థాయికి మరింత విస్తరించి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించేందుకు కార్యాచరణ రూపొందించడంపై నేతలు దృష్టి సారించాలన్నారు. మా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టమని టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హెచ్చరించారు. “కడప ఎమ్మెల్యేకి మళ్లీ చెబుతున్నా… రెండు వేల మందితో కాదు, అయిదు వేల మందితో వస్తా” అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, తగ్గేదే లేదు” అని ప్రకటించారు. అక్రమ కేసులు పెట్టి వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తే తాము కూడా తగిన తడాఖా చూపిస్తామని పేర్కొన్నారు.