తాడేపల్లి: ఏపీకి అమరావతి రాజధాని కాదని వైయస్ఆర్సీపీ ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పడం లేదు. అమరావతి రాజధాని నిర్మాణం ముసుగులో చంద్రబాబు చేస్తున్న అవినీతిని మాత్రమే వైయస్ఆర్సీపీ వ్యతిరేకిస్తోంది. అమరావతిని చంద్రబాబు ఆదాయ వనరుగా మార్చేసుకుని, తానే రాజధానిని ఉద్ధరిస్తున్నట్టు కళ్లబొల్లి మాటలు చెబుతూ రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నాడు. రెండేళ్ల పాలనలో భారీగా అప్పులు చేయడం మినహా కళ్ల ముందు ఏ అభివృద్ధీ కనిపించడం లేదు. దాన్నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా నడిపాడు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్లాట్ల డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, కొన్ని ప్లాట్లు చెరువుల్లో ఉన్నాయి. అమరావతి పేరిట ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నాడు. 2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నాడు. 2029 వరకు ఆయనే అధికారంలో ఉంటారు. కానీ “ఎవరైనా మార్చేస్తారు” అనే ప్రచారం ఎందుకు చేస్తున్నారు? అంటే ఆయనపై ఆయనకే నమ్మకం లేదనే సంకేతం కాదా. అమరావతి కట్టలేరని వారు అంగీకరిస్తున్నట్టే కదా. అసెంబ్లీ తీర్మానాలు చేసి డ్రామాలు చేయడం ఎందుకు? కౌన్సిల్ను పక్కన పెట్టడం ఎందుకు? అవినీతి బయట పడుతుందనే భయమే కారణం. కూటమి ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం రాజధాని పేరిట సేకరించిన భూములు అభివృద్ధికే రూ.2 లక్షల కోట్లు కావాలి. అంత భారం భరించే శక్తి ఆంధ్రప్రదేశ్కి ఉందా? కొత్త భవనాలు కట్టకుండా, డిజైన్ల పేరుతో రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పాత టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవడం అనుమానాస్పదంగా ఉంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెబుతూ ఇప్పటికే రూ.47 వేల కోట్ల అప్పులు తీసుకున్నారు. భూములు అమ్మి డబ్బు తెస్తామని చెప్పిన వారు ఇప్పటివరకు ఎంత సంపాదించారో చెప్పాలి. స్పీకర్ స్ధానంలో ఉంటూ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. సభలో లేని వ్యక్తుల గురించి ఆయన మాట్లాడిన మాటలు చాలా అభ్యంతకరంగా ఉన్నాయి. దీన్ని ఎవరూ స్వాగతించరు. ● అమరావతిని పూర్తి చేయలేనని చేతులెత్తేశాడు - అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు అమరావతి రాజధానిగా ఉండబోదని ఎవరూ చెప్పడం లేదు. అలాంటప్పుడు చంద్రబాబు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి మరీ తీర్మాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేవలం డిజైన్ల పేరుతో రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పాత టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవడం అనుమానాస్పదంగా ఉంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూనే రూ.47వేల కోట్లు అప్పులు తెచ్చారు. కానీ పనులు చూస్తే కనీసం సరైన రోడ్డు కూడా లేదు. ఇవన్నీ చూస్తుంటే 2028 నాటికి అమరావతిని పూర్తి చేస్తామని ప్రజలకు చంద్రబాబు మాయమాటలు చెబుతున్నాడని తేలిపోయింది. రాజధాని నిర్మాణం ముసుగులో భారీగా అంచనాలు పెంచేసి దోచుకోవడం తప్పించి రెండేళ్లలో జరిగిన పనులు శూన్యం. అందుకే ప్రజల దృష్టిని మళ్లించడానికి అసెంబ్లీ పేరుతో సరికొత్త డ్రామాకి తెరదీశాడు. అమరావతి పేరుతో వైయస్ఆర్సీపీ మీద నిందలు మోపడానికే ఈ కథను నడిపించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ● అమరావతిపై చంద్రబాబు మొసలి కన్నీరు - మాజీ ఎంపీ మార్గాని భరత్: 2028 నాటికే రాజధాని పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు, మళ్లీ ఎవరైనా వచ్చి రాజధానిని మారుస్తారంటూ ప్రజల్లో లేనిపోని అనుమానాలు ఎందుకు రేకెత్తిస్తున్నారు? రాజధాని నిర్మాణం పూర్తయితే ఎవరైనా ఎందుకు మారుస్తారు? అమరావతిని కేవలం రాజకీయాల కోసం వాడుకోవడమే మీ లక్ష్యం. చిత్తశుద్ధి ఉంటే ముందు మీ 'హెరిటేజ్' కార్యాలయాన్ని, లోకేష్, పవన్ కళ్యాణ్ల నివాసాలను అమరావతికి మార్చండి. ఉదయం ఏపీలో ఉండి రాత్రికి హైదరాబాద్ వెళ్లే మీకు అమరావతిపై ప్రేమ ఎక్కడిది?" అని మార్గాని భరత్ నిలదీశారు. ● చదరపు అడుగుకు రూ. 11 వేల దోపిడీ - కే.కే. రాజు: రాజధాని నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.11వేల నుండి రూ.14 వేలుగా నిర్ణయించడం ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం. రూ. 9 వేల కోట్లు అప్పు తెచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. ఈ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే 'చట్టబద్ధత' పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారు. అమరావతి సెల్ఫ్ సస్టైన్ సిటీ అని చెప్పి, ఇప్పుడు అన్యాయంగా ప్రజాధనాన్ని ఎందుకు తగలేస్తున్నారు?" - దోపిడీయే బాబు లక్ష్యం... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే వైయస్ జగన్ గారి ఆకాంక్ష. అందుకే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదించాం. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రాయూనివర్సిటీలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో.. విశాఖపట్నం నగరం రాష్ట్రానికి ఇమేజ్ ని, ప్రయోజనాలను సమకూర్చగల నగరమని.. తాను చెప్పిన మాటలను చంద్రబాబు గుర్తుంచుకోవాలి. ఉత్తరాంధ్రాను, విశాఖను దేశానికే తలమానికంగా చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత ఏం చేశాడో అందరికీ తెలుసు. వైయస్.జగన్ హయాంలో ఇదే విశాఖను అభివృద్ధి చేయడంతో పాటు మూడు ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిర్ణయించారు. కానీ అమరావతి పేరు చంద్రబాబు కొత్త డ్రామాకు తెర లేపారు. రాజధానిగా అమరావతిని వైఎస్ జగన్ ఎన్నడు వ్యతిరేకించలేదు. అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి, దోపిడీని వ్యతిరేకించారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ జరుగుతోంది. భూములు ఇచ్చిన రైతులను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు కరకట్ట మీద తన నివాసానికి తప్ప అమరావతిలో ఒక రోడ్డు కూడా వేయలేకపోయారని స్పష్టం చేశారు. ● డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రత్యేక అసెంబ్లీ - సీదిరి అప్పలరాజు: అమరావతి అవినీతిపై చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం. విభజన చట్టంలో సవరణ కోరడం అనేది కేవలం వైయస్ఆర్సీపీపై బురదజల్లడానికే. శాసనమండలిలో మాకు బలం ఉంది కాబట్టే, అక్కడ ప్రశ్నలను ఎదుర్కోలేక కేవలం అసెంబ్లీ సమావేశాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. లక్ష ఎకరాల సేకరణ, రూ.2 లక్షల కోట్ల వ్యయం మన ఆర్థిక పరిస్థితికి సాధ్యమేనా? అమరావతిని ఏటీఎంగా మార్చుకుని బినామీల కడుపు నింపడమే మీ ధ్యేయం. - మీ మాటలపై మీకే నమ్మకం లేదు: 2028 లోగా రాజధాని పూర్తి చేస్తామని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు భవిష్యత్తులో ఎవరూ మార్చడానికి వీల్లేకుండా చట్ట సవరణ కోరడం చూస్తుంటే మీ మాటలపై మీకే నమ్మకం లేదని అర్థమవుతోంది. మీరు సకాలంలో నిర్మాణాలు పూర్తి చేస్తే అసలు ఈ చర్చకు తావే ఉండదు. వైయస్ జగన్ గారు మళ్లీ అధికారంలోకి వస్తారన్న భయమే ఈ డ్రామాకు మూల కారణం. - వైయస్ఆర్సీపీని బద్నాం చేసే కుట్ర: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ అమరావతికి వ్యతిరేకం కాదు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎందుకు ఎంచుకున్నామంటే.. అప్పటికే అభివృద్ధి చెందిన ఆ నగరాన్ని అతి తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చవచ్చని, అది రాష్ట్రానికే గ్రోత్ ఇంజన్గా మారుతుందని భావించాం. కానీ మీరు అమరావతిని కేవలం మీ బినామీల కడుపు నింపుకోవడానికి, వైయస్ఆర్సీపీపై బురద చల్లడానికి వాడుకుంటున్నారు." - మండలి సమావేశంపై భయం ఎందుకు? అసెంబ్లీ అంటే కేవలం శాసనసభ మాత్రమే కాదు, శాసనమండలి కూడా భాగమే. మండలిలో మాకు బలం ఉంది కాబట్టే, మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేవలం అసెంబ్లీని మాత్రమే సమావేశపరిచారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. మీకు చిత్తశుద్ధి ఉంటే రెండు సభల్లోనూ చర్చ పెట్టాలని సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అమరావతిలో జరుగుతున్న దోపిడీని అరికట్టి, పారదర్శకంగా పనులు పూర్తి చేయడంతో పాటు భూములిచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించి, కౌలు చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలి. 2028 లోపు రాజధానిని ఎలా పూర్తి చేస్తారో స్పష్టం చేయాలన్న వైయస్ఆర్సీపీ నేతలు, ఇప్పటికైనా రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని హెచ్చరించారు.