గురజాల: అక్రమ కేసులతో భయపెట్టి మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని, ఈవీఎంల ధ్వంసాలపై వీడియోలన్నీ ఎన్నికల కమిషన్ బయట పెట్టాలని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్యారెక్టర్ను అశాసినేట్ చేస్తూ ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారని, పచ్చమీడియా ఛానళ్లల్లో చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక ఈవీఎం ఘటనను చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సమంజసం..? అని ప్రశ్నించారు. పిన్నెల్లి 4 సార్లు మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అని, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్ననాడే ప్రజాబలంతో మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని గుర్తుచేశారు. గురజాల వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కాసు మహేష్రెడ్డి ఇంకా ఏమన్నారంటే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఒక ఈవీఎం ఘటనను చూపెట్టి పిన్నెల్లిని నిందితుడిగా చేర్చారు. మరి, రాష్ట్రంలో అనేకచోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని.. అలా చేసిన వారందరిపైనా కేసులు నమోదు చేసినట్లు ఎన్నికల కమిషన్ చెబుతుంది. సరే.. ఈవీఎంలను ధ్వంసం చేసిన మిగతాచోట్ల వీడియోలను మీరెందుకు బయటపెట్టడం లేదు..? ఎందుకని మాచర్ల వీడియో ఒక్కటే బయటకొచ్చింది..? తెలుగుదేశం నేతలు దౌర్జన్యం చేసి ఈవీఎంలను పగులకొట్టిన వీడియోలు బయటకు ఎందుకు సర్క్యూలేట్ చేయలేకపోతున్నారు..? మిగతా వీడియోలు ఎందుకు బహిర్గతం చేయరు..? ఎన్నికల వాతావరణంలో పలుచోట్ల కొన్ని సంఘటనలు జరుగుతాయి. అయితే, ఇటు వైయస్ఆర్సీపీ .. అటు తెలుగుదేశం నుంచి ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదుల ప్రకారం ఈవీఎంల ధ్వంసాలకు సంబంధించి మొత్తం వీడియోలను మీరెందుకు బహిర్గతం చేయట్లేదు..? ఒక్క మాచర్ల ఘటననే ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది. పోలింగ్ కేంద్రాల్లో వీడియో కెమెరాలు పెట్టిందే తప్పులు తెలుసుకోవడానికి.. అయితే.. అలాంటి తప్పులు జరిగాయని గత పదిరోజులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎన్నికల కమిషన్ ముందు ఘోషిస్తున్నాం కదా..? మీరెందుకు స్పందించరు..? పాల్వాయిగేట్లో మా ఏజెంట్లను లాగేసిన వీడియోలన్నీ బయటపెట్టండి ఉదాహరణకు మాచర్ల నియోజకవర్గాన్నే తీసుకుంటే .. తుమృకోట, వెల్దుర్తి, చింతపల్లి, వేపకంపల్లె, ఒప్పిచర్లలో టీడీపీ నేతలు ఇష్టానుసారం రిగ్గింగ్కు పాల్పడ్డారు. అక్కడ వైయస్ఆర్సీపీ ఏజెంట్లను లాగేశారు. వాటికి సంబంధించిన వీడియోలను మా నేతలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే పాల్వాయిగేట్లో మా పార్టీకి చెందిన ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు లాగి కొడుతుంటే.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారెళ్లి వారిని పరామర్శించడం కూడా జరిగింది. మరి, పాల్వాయి ఘటనలో ఈవీఎం విరగొట్టిన వీడియోను చూపించిన వాళ్లు.. ఆ ఘటనకు రెండు మూడు గంటల ముందు జరిగిన టీడీపీ నేతల దౌర్జన్యాలను, విధ్వంసకాండను ఎందుకు బయటపెట్టలేకపోతుంది..? పాల్వాయిగేట్లో ఉదయం నుంచి జరిగిన ఘటన వీడియో మొత్తాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మాచర్లలో రిగ్గింగ్ జరగలేదని ఈసీ ప్రూవ్ చేయాలి మాచర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్నికల సంఘానికి ఎన్ని ఫిర్యాదులొచ్చాయి..? వాటిపై మీరేం యాక్షన్ తీసుకున్నారో.. చెప్పండి..? మేము చెబుతున్న చోట్ల అసలు రిగ్గింగ్ జరగలేదని మీరు మీ వెబ్ కెమెరాల వీడియోలను బయటపెట్టి నిరూపించండి. మేం వైయస్ఆర్సీపీ ఎన్నికల అభ్యర్థులుగా అడుగుతున్నాం. మాకూ.. ప్రజలందరికీ ఆరోజేం జరిగిందో వీడియోలన్నీ బహిర్గతం చేసి నిరూపించండి. మా అనుమానాల్ని నివృత్తిచేయాల్సిన బాధ్యత ఈసీదే ఎన్నికల కమిషన్ గానీ.. సిట్ అధికారులు గానీ మేం ఫిర్యాదు చేసినచోట్ల రిగ్గింగ్ వీడియోల న్నీ బయటకు తీయాలని కోరుతున్నాం. ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని నిరూపించుకునే బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంటుంది కదా..? అది కానప్పుడు ఈ వ్యవస్థ.. ఈ తతంగమంతా ఎందుకంటున్నాం..? కనుక, ఎన్నికల అభ్యర్థులుగా మా అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఖచ్చితంగా ఉంటుంది. కొత్తగణేశునిపాడులో మహిళల్ని నిర్భంధిస్తే మీరేం న్యాయం చేశారు..? పలనాడు కలెక్టర్ ఒక్క పాల్వాయిగేట్ ఘటన వీడియోనే బయట పెట్టి మిగతా వీడియోలను దాచేయడంలో ఆంతర్యమేంటి..? తుమృకోటలో రిగ్గింగ్కు సంబంధించి అవతల ఎవర్నో అరెస్టు చేశారంటున్నారు కదా.. మరి, ఆ వీడియోలనూ బయటపెట్టండి. కొత్తగణేశునిపాడులో మహిళలను గంగమ్మ గుడిలో నిర్భందించి.. వాళ్ల ఇళ్ల మీద దాడులు చేస్తూ టీడీపీ మనుషులు స్వైరవిహారం చేస్తే పోలీసులు ఏం చేశారు..? ఇరువర్గాల మీద ఒకే కేసులు.. ఒకే సెక్షన్లా..? ఇదా మీ ఎన్నికల కమిషన్ చేసే ధర్మం..? న్యాయం..? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా..? ఎన్నికల కమిషన్ విఫలమైనట్టు కాదా..? ఎన్నికల కమిషన్ను సూటిగా నేనొక ప్రశ్న అడుగుతున్నాను. ఎన్నికలకు సంబంధించి పోలింగ్కు కొద్దిరోజుల ముందు కొంతమంది అధికారులను మార్చారు. పోలింగ్ తర్వాత వాళ్లు విధుల్లో అలసత్వం ప్రదర్శించారని వారిని ఇదే ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. అంటే, ఇక్కడ ఎవరు విఫలమైనట్లు..? అధికారులా.. ఎన్నికల కమిషనా..? వాళ్లంతా ప్రభుత్వం నియమించిన అధికారులు కాదుగదా..? ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులే సస్పెండ్ అయ్యారంటే ఎవరు విఫలమైయ్యారో ప్రజలకు సమాధానం కావాలి. లోపాలపై హైకోర్టుకెళ్లి రీపోలింగ్కు పోరాడతాం ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందించిన ఫిర్యాదులన్నింటికీ మాకు సమాధానం రావాలి. రిగ్గింగ్ జరిగినట్లు మేం ఫిర్యాదిచ్చిన ప్రతీ పోలింగ్ కేంద్రాల వీడియోలను ఎన్నికల కమిషన్ బహిర్గతం చేయాల్సిందే.. ఎన్నికల అధికారుల నియామకాలు.. ఆ తర్వాత వారిని సస్పెండ్ చేయడాలు.. జరిగిన లోపాలు, నష్టనివారణ చర్యలపై మేం ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం. రీపోలింగ్ నిర్వహించడానికి మా వంతుగా మేం పోరాటం చేస్తాం. రీపోలింగ్పై ఎన్నికల కమిషన్ పరిశీలించాలి ఎన్నికల వాతావరణంలో పలుచోట్ల చెదురుమదురు సంఘటనలు జరగడం సహజమే. కనుక, ఎక్కడైతే రిగ్గింగ్ చేశారని వివిధ రాజకీయ పార్టీలు ఆరోపించాయో.. ఆయా పార్టీల ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని మీరు వెబ్ కెమెరాలను తనిఖీ చేసి రీపోలింగ్ పెట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉంది. కనుక, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని ఎన్నికల కమిషన్ మేం కోరిన వీడియోలన్నీ బహిర్గతం చేయడం ఎంతైనా మంచిదని చెబుతున్నాం. రిగ్గింగ్ జరిగింది కాబట్టే పాల్వాయిగేట్లో ‘పిన్నెల్లి’ ప్రతిఘటించారు మాకున్న సమాచారం ప్రకారం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు, ఏజెంట్లు కలిసి రిగ్గింగ్కు పాల్పడ్డారు. అక్కడున్న వైయస్ఆర్సీపీ ఏజెంట్లును బయటకు లాగి దాడిచేశారు. కాబట్టే.. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అక్కడకెళ్లి తీవ్రంగా ప్రతిఘటించాల్సి వచ్చింది. దీన్నిబట్టి ఎన్నికల కమిషన్ దృష్టిలో రిగ్గింగ్ చేయడం సమంజసమా..? మా ఏజెంట్లను లాగేయడం సమంజసమా..? లేదంటే, వారి రిగ్గింగ్ను ఎన్నికల అభ్యర్థి ప్రతిఘటించడం సమంజసమా..? అనేది ఎన్నికల కమిషన్ తేల్చాలి. మేం చెప్పేది నిజం కాకుంటే.. అక్కడ జరిగిన పర్యవసానాలేంటో.. పిన్నెల్లి ఆ విధంగా ఎందుకు ప్రతిఘటించాల్సి వచ్చిందో పూర్తి నిడివి వీడియోలను ఎన్నికల కమిషన్ బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మాచర్లలో పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరు మాచర్ల నియోజకవర్గంలో ప్రజాబలం ఉన్న ఏకైక నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన ఇప్పటికే 4 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదోసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. ఏదో నలుగురు అధికారులను మేనేజ్ చేసి.. అవసరమైనంత వరకే వీడియోను కట్ చేసి దొంగ వీడియోలను లీక్ చేసి.. కేసులు పెట్టినంత మాత్రానా మేం భయపడే వ్యక్తులం కాదు. ఈ ప్రాంతంలో ఇలాంటి రాజకీయాల్ని మేం చాలా చూశాం. మాచర్ల ఎమ్మెల్యేగా పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపబోరు. ఫ్యాక్షన్ లీడర్లను ప్రోత్సహించే చంద్రబాబు నోట రాజకీయనీతులా..? చంద్రబాబు ఇవాళ రాజకీయ నీతులు ఎవరికి చెబుతున్నాడు..? ఇదే నరసరావుపేటలో హోంమంత్రిగా చేసిన కోడెల శివప్రసాదరావు ఇంట్లో బాంబులు తయారు చేస్తూ పేలాయి. ఆయన్ను తన కేబినెట్లోకి తీసుకుని మంత్రి వదవిచ్చాడు చంద్రబాబు. అలాంటి వ్యక్తి రాజకీయ నీతి పాఠాలు చెబితే అంతగా నప్పదు. అంతెందుకు.. ఇదే మాచర్ల తెలుగుదేశం అభ్యర్థి బ్రహ్మారెడ్డి ఏడుగురిని వారి కుటుంబ సభ్యుల్నే హత్య చేసింది నిజం కాదా..? అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే ఆ కేసును ఫ్రేమ్ చేసింది నిజం కాదంటారా..? అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉండి ఇదే బ్రహ్మారెడ్డిని ఏ1 ముద్దాయిగా పెట్టి ఎఫ్ఐఆర్ కట్టించాడు కదా..? మరలా అదే వ్యక్తిని తెచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చోబెడతారా..? ఈరోజు పలనాడులో అల్లర్లకు కారణం అతనే కదా..? ఫ్యాక్షనిజాన్ని .. ఫ్యాక్షన్ లీడర్లను ప్రోత్సహించేదే చంద్రబాబు. ఈ విషయం రాష్ట్రప్రజలకూ తెలుసు.