మాన‌వ‌త్వంతో అంబులెన్స్‌లను అనుమతించాలి

బార్డర్‌లో అంబులెన్స్‌లను అడ్డుకోవడం దురదృష్టకరం

తెలంగాణ ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ పాటించడం సాధ్యం కాదు

అంబులెన్స్‌ల అనుమతి అంశంపై అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి

దయచేసి ఎవరూ తొందరపాటు స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని విజ్ఞప్తి

మన రాష్ట్రంలో ఉన్న ఫెసిలిటీస్‌ను వాడుకునే ఆలోచన చేయాలి

సంక్షేమం, ప్రజారోగ్య పరిరక్షణలో దేశానికి రోల్‌ మోడల్‌గా సీఎం వైయస్‌ జగన్‌

కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక ప్రభుత్వం మనది

కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాం

ఆరోగ్యశ్రీ కింద పేదల ఉచిత వైద్యానికి రూ.3500 కోట్ల వెచ్చించాం

ప్రభుత్వ సలహాదారు, వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్తున్న కోవిడ్‌ బాధితుల అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని ప్రభుత్వ సలహాదారు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంబులెన్స్‌లను ఆపొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించినా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం గైడ్‌ లైన్స్‌ పెట్టిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గైడ్‌లైన్స్‌ పాటించడం సాధ్యం కాదన్నారు. మానవతా దృక్పథంతో అంబులెన్స్‌లను అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుందన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎక్కువగా ఉన్న నగరాలకు వెళ్లడం సహజమని, ఇతర ఏ రాష్ట్ర సరిహద్దుల్లో రాని సమస్య తెలంగాణ బార్డర్‌లోనే వస్తుందన్నారు. ప్రాణం మీదకు వచ్చినప్పుడు అన్ని చోట్లా బెడ్స్‌ కోసం ప్రయత్నిస్తారని, అలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వ పెట్టిన నిబంధనల ప్రకారం ఆస్పత్రి లెటర్, పాసులు తీసుకురావడం సాధ్యం కాదన్నారు. ఇది మానవత్వంతో చూడాల్సిన అంశమని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఇలాంటి సమస్య లేదన్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ చంద్రబాబు మూటా, ముళ్లె సర్దుకొని వచ్చి అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో ఉమ్మడి రాజధాని అవకాశాన్ని కోల్పోయామన్నారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే.. 

అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సరిగా లేని భాగాన్ని మనకు వదిలేయడం వల్ల, ఐదేళ్ల పాటు పరిపాలించిన టీడీపీ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టకపోవడంతో ఈ సమస్య ఎదురైంది. కోవిడ్‌ బాధితులు పెద్ద ఆస్పత్రులకు వెళ్లాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇది మానవత్వంతో చూడాల్సిన అంశం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వెంటనే చర్చించారు. ఆయన ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు చర్చలు జరుపుతున్నారు.  

అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి..
కోవిడ్‌ తక్కువ వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారుతుందని అందరికీ తెలిసిందే. సాధారణ మనిషి గంటల్లోనే మృత్యువుకు చేరువుగా వెళ్తున్నారు. ఈ సమయంలో ఆస్పత్రులు అడ్మీషన్‌ ఇచ్చి.. పేషెంట్‌ అక్కడకు వెళ్లేలోగా బెడ్‌ ఖాళీగా ఉంటుందనే నమ్మకం లేదు. ఇలాంటి సమయంలో ఆస్పత్రులు అడ్మీషన్‌ ఇవ్వడం, దాన్ని ప్రభుత్వ కంట్రోల్‌ రూమ్‌కు పంపించడం, వాళ్లు అప్రూవ్‌ చేసి పాస్, అడ్మీషన్‌ పాస్‌ తీసుకొని పేషెంట్‌ బార్డర్‌ దాటి వెళ్లాలంటే.. అది ఆచరణలో సాధ్యమేనా అని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రాణాలు కాపాడుకునేందుకు వస్తున్న బాధితుల అంబులెన్స్‌లు నిలిపివేయడం దురదృష్టకరం. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు అనుమతి ఇవ్వండి అని ఒప్పించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. 

ఆవేశపూరిత స్టేట్‌మెంట్లతో బార్డర్‌ సమస్య తేవొద్దు..
కొంతమంది ఈ అంశాన్ని రాజకీయ కోణంలో ఆలోచిస్తూ తొందరపాటుతో ఆరోపణలు చేస్తున్నారు. దయచేసి అంశాన్ని డైవర్ట్‌ చేయొద్దు.. ఆవేశాలకు పోతే ఒరిగేది ఏమీ ఉండదు. అత్యవసరం అయితే ఎక్కడ ట్రీట్‌మెంట్‌కు అవసరం ఉన్నా.. అనుమతి ఇవ్వాలి. వీటన్నింటికీ సంబంధించి గైడ్‌లైన్స్‌పై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఏకం చేసి సుప్రీం కోర్టు విచారణ చేస్తుంది. ఆవేశంగా స్టేట్‌మెంట్లు ఇచ్చి.. బార్డర్‌ సమస్య తీసుకురావొద్దని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.. మీడియా కూడా అదే దృష్టితో చూసి సహకరించాలని కోరుతున్నాం. 

హడావుడిగా వెళ్లి.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..
మన రాష్ట్రంలో ఉన్న ఫెసిలిటీస్‌ను వాడుకోవాలి. ఏ ఆస్పత్రుల్లో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయో తెలియకుండా హైదరాబాద్‌కు వెళ్లిపోవడం ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఆలోచన చేయాలి. పరిష్కారం అయ్యేంత వరకు హడావుడిగా పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో బార్డర్‌లో శానససభ్యులు సహాయం చేస్తున్నారు. మిగిలిన చోట్ల అవగాహన కల్పిస్తున్నారు. 

సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు..
కోవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేయడం, ప్రజలను రక్షించుకోవడం, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు పెంచుకోవడం, ఎకనామిక్‌ యాక్టివిటీ, అగ్రికల్చర్, ఇలా అనేక అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ నిర్విరామంగా సమీక్షలు చేస్తున్నారు. అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. మొదటి ఫేజ్‌లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు అభినందించాయి. కరోనా విపత్తులో పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఏపీ ముందుంది. సెకండ్‌ వేవ్‌లో కూడా అదే జరుగుతుంది. నిన్న రైతులకు వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద 52.38 లక్షల మంది రైతులకు ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం సందర్భంగా పెట్టుబడి సాయం కింద ఒక్కొక్కరి బ్యాంక్‌ ఖాతాల్లో రూ.7,500 చొప్పున జమ చేశారు. మన రాష్ట్రంలో 70 శాతం పైగా రెండు, రెండున్నరెకరాలు కలిగిన రైతులే ఉన్నారు. వారికి రైతు భరోసా సాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈనెల 25వ తేదీన వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా కింద.. 32 లక్షల మందికి పైగా రైతులకు రూ. 2 వేల కోట్లపైచిలుకు అందబోతుంది. ఇంత సంక్షోభంలో కూడా రైతులను ఆదుకోవడానికి సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారు. 

ఇచ్చిన మాట కంటే మిన్నగా రైతన్నకు సాయం..
2014కు ముందు చంద్రబాబు రుణమాఫీ అనే పథకం ప్రకటించాక.. ఐదేళ్లలో ఇచ్చింది సుమారు రూ.14 వేల కోట్లు ఉంటుందేమో.. ఇంకో విడత అని చెప్పి మా ప్రభుత్వంపై దబాయింపులకు దిగాడు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాట కంటే మిన్నగా రైతులను ఆదుకుంటున్నారు. రైతు భరోసా సాయం నాలుగు సంవత్సరాల్లో రూ.50 వేలు అని చెప్పి.. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టారు.  రైతులకు రూ.13500 చొప్పున ఐదేళ్ల పాటు అందించనున్నారు. 

కోవిడ్‌ మహమ్మారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నా.. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, ఆరోగ్యశ్రీ ఇలా ఎన్నో పథకాలు సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. 

90 శాతం జనాభాను ఆరోగ్యశ్రీలో చేర్చారు..
ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకు రూ. 3500 కోట్లు ఖర్చు చేశారు. అందులో రూ.470 కోట్లు గత ప్రభుత్వ బకాయిలు తీర్చారు. సంవత్సర ఆదాయం లిమిట్‌ 5 లక్షలకు పెంచి, 90 శాతం జనాభాను ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఆరోగ్యశ్రీ పరిధిలో 2 వేలకు పైగా జబ్బులకు చికిత్స అందిస్తున్నారు. శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో డబ్బులు ఇస్తున్నారు. ఏదైనా వ్యాధి వస్తే ఎవరూ భయపడకుండా నేనున్నాను అని ధీమా కల్పిస్తున్నారు. 

దూరదృష్టితో, దార్శనికుడిగా..
దేశంలోనే తొలిసారిగా కోవిడ్‌కు ఉచితంగా చికిత్స అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైయస్‌ జగన్‌ది. రూ.370 కోట్లు కోవిడ్‌ చికిత్సకు చెల్లించడం జరిగింది. ఇది కాకుండా కోవిడ్‌పై రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. వ్యాక్సిన్‌ మొత్తం ఫ్రీ అని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. దూరదృష్టితో, దార్శనికుడిగా నిజమైన ప్రజా ప్రభుత్వం ఎలా వ్యవహరించాలనేది రోల్‌ మోడల్‌గా సీఎం వైయస్‌ జగన్‌ ఉన్నారు. ఎలాంటి రాజకీయాలు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వగలుగుతున్నారు. ప్రజలంటే ప్రేమ, తపన ఉంది కాబట్టే సీఎం వైయస్‌ జగన్‌ ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ చొరతతోనే ఆక్సిజన్‌ కోటాను కూడా పెంచుకున్నాం. రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో.. అంతా చేస్తున్నారు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

 

తాజా వీడియోలు

Back to Top