పల్నాడు: చంద్రబాబు.. మీకు ఊడిగం చేయడానికే కమ్మవారు పుట్టారా?, కుమ్మవారు మా పార్టీలో ఉంటే నీకేంటి అభ్యంతరం అంటూ వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు. వైయస్ఆర్సీపీలోని కమ్మవారిని చంద్రబాబు టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకి ఊడిగం చేయడానికి సిద్ధంగా లేడనే దేవినేని అవినాష్ను వేధిస్తున్నారని, ఏం పాపం చేశాడని వల్లభనేని వంశీని జైల్లో పెట్టి వేధిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు శాడిజానికి వల్లభనేని వంశీ బాధపడుతున్నాడని, కొడాలి నాని ఏం పాపం చేశాడని కేసు పెట్టారని నిలదీశారు. ఏంపాపం చేశాడని.. మా పార్టీ నేత తలశిల రఘురాంపై 3 కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏం పాపం చేసిందని.. కృష్ణవేణిని మహిళ అని కూడా చూడకుండా వేధించారు. ఏం పాపం చేశాడని.. ఇంటూరి రవిపై కేసులు పెట్టి వేధించాంటూ ధ్వజమెత్తారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పోలీసుల వేధింపుల తాళలేక ఆత్మహత్య చేసుకున్న వైయస్ఆర్సీపీ కార్యకర్త, గ్రామ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ ఏమన్నారంటే.. వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే నిదర్శనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న నిదర్శనం.. ఈ రోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు అన్న. వెంకటేశ్వర్లు కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు అన్న ఇక్కడ నిల్చొని ఉన్నాడు? ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనడానికి నిదర్శనం ఈరోజు ఈ కార్యక్రమం.సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల అనే గ్రామం.. కోర్లకుంట వెంకటేశ్వర్లు అన్న ఈ గ్రామంలో మా పార్టీకి సంబంధించిన నాయకుడు. తన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. పోలింగ్ మొట్ట మొదటి రోజు నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అన్నదానికి నిదర్శనం ఈరోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది. అనుకూలమైన అధికారులకు పోస్టింగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి నేతలు తమకు అనుకూలమైన అధికారులందరికీ పోస్టింగులు ఇప్పించుకున్నారు. ఇక్కడున్న పోలింగ్ సమయంలో ఐజీ, ఎస్పీలు, సీఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేశారన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా తెలుసు. ఆవాళ్టి నుంచి పరిస్థితి గమనిస్తే 2024 జూన్ 4వ తేదీన అంటే కౌంటింగ్ రోజునే అల్లర్లు చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ల తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు.. నాగమల్లేశ్వరరావును స్టేషన్ కు తీసుకుని పోయారు. టీడీపీకి ఫలితాలు అనుకులంగా వచ్చిన మరుక్షణమే నాగమల్లేశ్వరరావను స్టేషన్లో ఉంచారు. ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణమే నాగమల్లేశ్వరరావును సెల్ లో వేశారు. టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం మొదలయ్యాక ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై అంటే వెంకటేశ్వర్లు అన్న ఇంటిపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచి, ఊర్లోకి వెళ్లడానికి వీల్లేదని, ఊరు విడిచిపెట్టి పోవాలని, లేకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తూ సీఐ రాజేషే చెప్పాడు. రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు.. కాల్చి చంపుతామని కూడా సాక్షాత్తూ సీఐ రాజేష్ అనే వ్యక్తి బెదిరించడం కూడా జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే జూన్ 4వ తేదీన కౌంటింగ్ మొదలైతే.. జూన్ 5వ తారీఖు రాత్రి దాకా నాగమల్లేశ్వరరావును స్టేషన్లోనే ఉంచుకున్నారు. అవమానించారు. బెదిరించారు. ఆయన మీద చెయ్యకూడని నేరాలన్నీ కూడా చేశారు. 5వ తేదీ రాత్రి తనను విడిచిపెట్టారు. నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్లాడు. ఈ సీఐ, ఈ పోలీసులు వీళ్లు బెదిరించిన తీరు, అవమానించిన తీరు.. నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్లి వాళ్ల నాన్నకు ఫోన్ చేశాడు. పోలీసులు ఏరకంగా అవమానించారు, ఏరకంగా బెదిరించారు, ఏ రకంగా కొట్టారు.. ఇటువంటి విషయాలన్నీ వాళ్ల నాన్నకు చివరి సారిగా ఫోన్లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్లిపోయాడు. వెంటనే తన కొడుకు నాగమల్లేశ్వరరావును కాపాడుకునేందుకు వెంకటేశ్వర్లు అన్న హుటాహుటిన గుంటూరుకు వెళ్లి కొడుకును హాస్పిటల్లో చేర్పించాడు. ఆ ట్రీట్మెంట్ జరుగుతుండగా జూన్ 9న నాగమల్లేశ్వరరావు ప్రాణాలు విడిచాడు. బాధ్యులెవరు బాబూ? నాగమల్లేశ్వరరావుకు భార్య, ఒక కూతురు ఉంది. ఆ కూతురు కూడా చిన్న పాప. ఇప్పుడు ఆ భార్యకు, కూతురుకు ఏం సమాధానం చెబుతారు చంద్రబాబూ అని అడుగుతున్నా. మీ పాలనలో దగ్గరుండి కేవలం మీ పార్టీకి అనుకూలంగా లేరు అన్న ఒకే ఒక్క కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణం అయ్యారు. ఏడాది అయిపోయింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళ్టికి కూడా శోకంలోనే ఉంది. దీనికి బాధ్యులెవరు? . వీరి ఇంటిపై రాళ్లు విసిరి, దాడి చేసిన వారి మీద ఎంత మందిని అరెస్టు చేశారు? ఎంత మంది మీద కేసులు పెట్టారు? ఎంత మందికి శిక్ష విధించారు అని అడుగుతున్నా. కనీసం ఇంతగా వేధించి చంపిన ఆ సీఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తున్నా. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చివరికి వెంకటేశ్వర్లు అన్న ప్రైవేటు కంప్లయింట్ ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. లక్ష్మీనారాయణ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలోనే ఈ మధ్య కాలంలోనే రాజుపాలెం మండలానికి సంబంధించి పెదమండలిపూడి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ అనే ఆయన హాస్పిటల్లో తన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఇదే లక్ష్మీనారాయణను రెండు నెలల క్రితం తప్పుడు అభియోగాలు చేసి స్టేషన్ కు పిలిచారు. సీఐలు, ఎస్ఐలు ఇద్దరూ కూడా తప్పుడు ఆరోపణలు చేసి స్టేషన్ కు పిలిచి లక్ష్మీనారయణ సమాధానాలన్నీ కూడా గట్టిగా చెప్పిన నేపథ్యంలో ఆయనమీద ఎలాంటి ఆధారాలు లేని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఆయన్ను విడిచిపెట్టారు. డీఎస్పీ హనుమంతరావు కుల ఉన్మాది రెండు నెలల తర్వాత ఇదే లక్మీనారాయణను డీఎస్పీ పిలిచాడు. ఆయన పేరు హనుమంతరావు.. ఒక కుల ఉన్మాది.. నేను అడుగుతా ఉన్నా ఈ డీఎస్పీని.. పోలీసు బట్టలు వేసుకున్నారా? న్యాయం, ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా? న్యాయం, ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా? అని అడుగుతా ఉన్నా.. ఈ డీఎస్పీ మళ్లీ లక్ష్మీనారాయణను పిలిచి కమ్మ కులంలో పుట్టి వైయస్సార్ సీపీలో ఎలా ఉన్నావ్... అని ఇదే హనుమంతరావు అనే డీఎస్పీ లక్మీనారాయణను కించపరుస్తూ మాట్లాడాడు.. అంతేకాదు.. తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతానని బెదిరించి.. లెంపకాయలు వేసి కొట్టి అవమానిస్తే.. లక్మీనారాయణ పురుగులమందు తాగి.. సూసైడ్ సెల్ఫీ వీడియో చేసి.. తన చావుకు ఎవరు కారణం.. ఎలాంటి పరిస్థితుల మధ్య తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాను.. ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీసు శాఖలో కొందరు పనిచేస్తా ఉన్నారు... వీరికి చంద్రబాబు, నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఎలా నడిపిస్తున్నారో వీడియోలో చెప్పి.. లక్ష్మీనారాయణ ఈ రోజు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్న.. వెంకటేశ్వర్లు అన్న విషయమైతేనేమి..ఆయన కుమారుడు నాగమల్లేశ్వరరావు విషయమైతేనేమి..లేదా లక్ష్మీనారాయణ విషయమైతేనేమి.. నేను చంద్రబాబుగారిని సూటిగా ఒక విషయమడుగుతున్నా.. మీకు ఊడిగం చేయడానికే కమ్మవారు పుట్టారా బాబూ? ఏమయ్యా చంద్రబాబూ.. కమ్మవారు మా పార్టీలో ఉంటే నీకు అభ్యంతరమా? అని అడుగుతా ఉన్నా..కమ్మవారు పుట్టింది కేవలం చంద్రబాబుగారికి ఊడిగం చేయడానికేనా? అని అడుగుతా ఉన్నా.. కమ్మవారు పుట్టింది కేవలం చంద్రబాబుగారికి ఊడిగం చేయడానికే పుట్టారంట..చంద్రబాబు అన్యాయాలను ఎవరైనా వ్యతిరేకిస్తే.. ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిని వెంటాడి వెంటాడి..హింసించి జైల్లో పెట్టడం.. దొంగకేసులు బనాయించడం.. దొంగ సాక్ష్యాలు సృష్టించడం.. చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం.. కేవలం చంద్రబాబుగారికి మాత్రమే చెల్లు..ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారని చంద్రబాబుగారిని గట్టిగా నిలదీస్తూ..అడుగుతా ఉన్నా..ఏం పాపం చేశాడని తనను పొట్టనపెట్టుకున్నారని చంద్రబాబును అడుగుతా ఉన్నా.. ఏం పాపం చేశారని లక్ష్మీనారాయణను ఆత్మ హత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం చేశారని.. భయపెట్టి.. బెదిరించి..ఆత్మహత్య చేసుకునే స్థాయికి ఎందుకు తీసుకువచ్చారని చంద్రబాబును అడుగుతా ఉన్నా... ఏం పాపం చేశారని.. ఏం పాపం చేశారని ఇదే కమ్మసామాజిక వర్గానికి చెందిన మా పార్టీకి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇన్ని రోజులపాటు జైల్లో పెట్టారని ప్రశ్నిస్తా ఉన్నా... ఒక కేసులో బెయిల్ వస్తే.. బెయిల్ వచ్చే వరకు గమ్మున ఉంటారు. బెయిల్ వస్తానే..వెంటనే ఇంకో కేసు పెడతారు..మళ్లీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాల్టికి దాదాపు రెండు నెలలు దాటిపోయింది..ఇవ్వాల్టికి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబుగారి శాడిజానికి బలవుతూ జైలులోనే మగ్గుతా ఉన్నాడు..ఏం పాపం చేశాడని అడుగుతా ఉన్నా..? ఒకటైపోయిన తర్వాత మరొకటి..తప్పుడు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు.నేను అడుగుతా ఉన్నా.. ఏం పాపం చేశారని.. కొడాలి నానిని.. మా పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి కూడా.. ఏం పాపం చేశాడని..తప్పుడు కేసులు పెట్టి తనను ఎందుకు హెరాస్ చేస్తున్నారని అడుగుతా ఉన్నా.. ఏం పాపం చేశారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై కేసులు మీద కేసులు పెడతా ఉన్నారు..ఇప్పటికే 9 కేసులు పెట్టారు..ఎందుకు అబ్బయ్య చౌదరిని హింసిస్తా ఉన్నారని ప్రశ్పిస్తూ ఉన్నా? ఏం పాపం చేశారని దేవినేని అవినాష్ ను వేధిస్తున్నారు? కేవలం కమ్మ సామాజికవర్గంలో పుట్టాడు.. అవినాష్ .. చంద్రబాబును వ్యతిరేకిస్తున్నాడు.. చంద్రబాబుకు ఊడిగం చేయడం ఇష్టం లేదు అన్నాడు. అన్న ఒకే ఒక్క కారణంతో అవినాష్ పై కూడా కేసులు మీద కేసులు పెట్టి రోజూ హింసించే కార్యక్రమం చేస్తూనే ఉన్నారు.. రోజూ కోర్టులకు పోయి బెయిల్ తెచ్చుకుని రోజూ చంద్రబాబుతో యుద్ధం చేస్తా ఉన్నాం.. ఏం పాపం చేశారని.. మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాంపై ఏం పాపం చేశారని మూడు కేసులు పెట్టారు? రఘురాం నాతో పాటు 15 సంవత్సరాలు ప్రయాణం చేశాడు.ఆయన్ను కూడా చిత్రహింసలకు గురిచేస్తా ఉన్నారు. ఏం పాపం చేశాడని ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన మా పార్టీ ఎక్స్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రాష్ట్రంలో వ్యాపారాలు చేసే పరిస్థితి లేకుండా.. తనను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టే కార్యక్రమం చేసి.. తనను బెదిరించి.. తప్పడు సాక్ష్యాలతో .. తప్పుడు కేసులు బనాయించి ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తా ఉన్నారని గట్టిగా అడుగుతా ఉన్నా..ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుపై తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా.. మా పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన వినుకొండ, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావుల మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మీద అక్రమ కేసులు పెట్టారు. ఆయన కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయిబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోగా కాలేజీలో తనిఖీల పేరుతో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. మా పార్టీ సానుభూతిపరుడైనందుకు ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన సినీ నటుడు, దర్శకుడు, డైలాగు రైటర్ పోసాని కృష్ణమురళిని నెలరోజులపాటు జైళ్లలో నిర్బంధించి వేధించారు. అక్రమంగా 9 కేసులు బనాయించి శ్రీకాకుళం నుంచి కడప దాకా రకరకాల స్టేషన్లు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ ఏం పాపం చేశాడని ఆయనకు వైజాగులో స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన భూములు రద్దు చేశారు. మంగళగిరికి చెందిన రాజ్కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చంద్రబాబుకి వ్యతిరేకంగా, జగన్కి అనుకూలంగా పోస్టులు పెట్టినందుకు ఆయనతోపాటు ఆయన భార్య కృష్ణవేణి మీద ఏకంగా 11 కేసులు పెట్టి నెలరోజులపాటు జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్కుమార్ను దారుణంగా కొట్టి చొక్కా విప్పించి లోకేష్ ఫొటో ముందు మోకాళ్లపై నిలబెట్టి ప్రాధేయపడేలా చేశారు. ఏం పాపం చేశాడని మరో సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ మీద 19 తప్పుడు కేసులు పెట్టి.. నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పారు. చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా.. ఏమయ్యా చంద్రబాబూ, కమ్మవారంతా నీకు ఊడిగం చేయడానికే పుట్టారా? నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5.. ఒక దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. ఇదీ, మీరంతా చేస్తున్న పని. మీరు దోచుకోవడానికి చంద్రబాబు సీఎంగా ఉండటం అవసరం. మీరంతా గజదొంగల ముఠాగా ఏర్పడి దోచుకుంటుంటే మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మవాడైనా ప్రశ్నిస్తే చాలు వారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి ఏమాత్రం వెనుకాడని నీ నైజం చూస్తుంటే అసలు నువ్వు మనిషివేనా అని ఆయన్ను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబుని ప్రశ్నిస్తే కమ్మ కులంలో తప్పుపుట్టినట్టుగా వారి మీద కక్ష కట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఆయన్ని వెనకేసుకొస్తున్న ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్మీడియా మొత్తం కలిసి చంద్రబాబుని వ్యతిరేకించిన వారి మీద బురదజల్లుతూ అప్రతిష్టపాలు చేస్తున్న తీరు రాక్షసుల కన్నా అన్యాయం కాదా అని ప్రశ్నిస్తున్నా. రేపు సుదీర్ఘ ప్రెస్మీట్ ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోంది. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద రేపు ఉదయం 11 గంటలకు సుదీర్ఘమైన ప్రెస్మీట్ పెట్టి ప్రజలందరికీ వివరించడం జరుగుతుంది. చంద్రబాబుకి, ఆయనకి వత్తాసు పలుకుతున్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు.. అందరూ కాదు.. కొందరికి మాత్రమే ప్రత్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్పటికే ఒక ఏడాది గడిచిపోయింది. మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తా. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబానికి చేసిన అన్యాయమే రెడ్ బుక్ కారణంగా ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాలను చూసి ప్రతి అధికారికీ ఒకటే చెబుతున్నా, ఈ అన్యాయాలలో మీరు భాగస్వాములు కావొద్దు. భాగస్వాములైతే చంద్రబాబుతోపాటు మిమ్మల్ని కూడా బోను ఎక్కించే కార్యక్రమం చేస్తానని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నా. ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు సీఐ రాజేష్ మీద నాగమల్లేశ్వరావు తండ్రి వెంకటేశ్వర్లు ప్రైవేటు కంప్లైంట్ నమోదు చేసినా పోలీసులు కేసు కట్టలేదు. ఇంతదారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన చేస్తే ఈ ప్రభుత్వం నిలబడుతుందా అని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు పాలనలో రైతులు, చదువుకుంటున్న పిల్లలు, అక్కచెల్లెమ్మలు.. ఎవరూ సంతోషంగా లేరు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లకు అన్ని వర్గాలు బలైపోయాయి. రెడ్ బుక్ రాజ్యాంగంతో విచ్చలవిడి అవినీతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనం అయిపోయాయి. ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు. దేవుడు, ప్రజలు గట్టిగా మొట్టికాయలు వేసే రోజు తొందర్లోనే వస్తుందని ఖచ్చితంగా చెబుతున్నా` అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు.