వలస కార్మికులను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలి  

కేంద్ర మంత్రికి లేఖ సీఎం వైయస్ జ‌గ‌న్‌ లేఖ
 

తాడేపల్లి :  కువైట్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులును స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన విమాన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కేంద్ర విదేశాంగ‌ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంక‌ర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు సీఎం వైయస్‌ జ‌గ‌న్ బుధ‌వారం కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా వలస కార్మికుల కోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నుంచి నేరుగా విమానాలు ఏర్పాటు చేయాల‌ని లేఖ‌లో కోరారు. అదే విధంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయలను వెనక్కి రప్పించేందుకు ‘వందే భారత్‌’ మిషన్‌ పేరుతో కేంద్రం చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమ‌న్నారు.

 ప్రయాణ ఖర్చు భరించే స్థితిలో వలస కార్మికులు
ఇత‌ర‌ దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది భార‌తీయులు వందే భారత్‌ మిషన్‌ను సద్వినియోగం చేసుకుని సొంత ఖర్చులతో స్వదేశానికి తిరిగి వస్తున్నార‌న్నారు. ఈ క్రమంలో గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోల్పోయి, అక్కడే చిక్కుకుపోయిన వేలాది వలస కార్మికులు కూడా స్వదేశానికి తిరిగి రావడానికి ఎంతో ఆశతో చూస్తున్నార‌ని, అయితే వారంతా స్వదేశానికి రావడానికి అయ్యే ప్రయాణ ఖర్చు భరించే స్థితిలో లేర‌ని సీఎం తెలిపారు. గల్ఫ్‌ దేశాల్లో ఆమ్నెస్టీ ద్వారా స్వదేశాలకు వెళ్లడానికి అనుమతి పొందిన సుమారు 2500 మంది వలస కూలీలు వారి ప్రయాణ ఛార్జీలకు కూడా డబ్బులు లేని స్ధితిలో ఉన్నార‌ని లేఖ‌లో పేర్కొన్నారు.  

స్వదేశానికి తిరిగి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నారు
ఇమ్మిగ్రేష‌న్‌ రుసుము మాఫీ చేయడం ద్వారా మన దేశ రాయబార కార్యాలయం, వారందరికీ ఎగ్జిట్‌ క్లియరెన్స్‌ కూడా ఇచ్చింద‌ని, మరోవైపు వారి ప్రయాణ ఖర్చును భరించడానికి కువైట్‌ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ప్రస్తుతం వారంతా అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నార‌ని, అరకొర భోజన వసతి, కనీస సదుపాయాలు కూడా లేకుండా రెండు వారాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతూ, స్వదేశానికి తిరిగి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నార‌ని వైయస్ జ‌గ‌న్ లేఖ‌లో తెలిపారు.  

అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉన్నాం
''రాష్ట్రానికి చెందిన వలస కూలీల ప్రయాణ ఖర్చు భరించడానికి కువైట్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున మీరు వెంటనే కువైట్‌ హైకమిషనర్‌కు సూచనలు జారీ చేసి, ఆ దేశం నుంచి రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి విమానాలు ఏర్పాటు చేసేలా చూడగలరు. వలస కూలీలందరినీ ఇక్కడ సొంత రాష్ట్రంలో రిసీవ్‌ చేసుకుని, వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేయడం, క్వారంటైన్‌కు పంపించడంతో పాటు, అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉన్నాం. జిల్లా కేంద్రాల్లో  క్వారంటైన్‌ సదుపాయంతో పాటు, విదేశాల నుంచి తిరిగొచ్చే వారికోసం తగిన వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం''. 

దశలవారీగా రాష్ట్రానికి అనుమతించండి
''ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కువైట్‌తో పాటు మధ్య ఆసియా, అగ్నేయాసియా దేశాల నుంచి రానున్న వలస కార్మికులు కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉన్నందున వారిని నేరుగా ఏపీకి వచ్చేలా అనుమతించాలని కోరుతున్నాను. విదేశాల్లో ఉన్న వలస కార్మికులు స్వరాష్ట్రానికి తిరిగి వస్తే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉంది. అందువల్ల కువైట్‌తో పాటు తూర్పు మధ్య, ఆగ్నేయాసియా దేశాల్లో ఉన్న వలసకార్మికులును వీలైనంత త్వరగా దశలవారీగా రాష్ట్రానికి అనుమతించాలని కోరుతున్నాం''. అని విదేశాంగ మంత్రికి ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ లేఖ‌లో సూచించారు.  

తాజా వీడియోలు

Back to Top