తిరుమల లడ్డుపై విషప్రచారం తగదు

కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నాం

వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్య‌క్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి

నంద్యాల  :  భక్తుల మనోభావాలకు తీవ్ర భంగం కలిగించేలా తిరుమల లడ్డుపై కూటమి ప్రభుత్వం విషప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ  నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారు కల్లూరు అర్బన్ కృష్ణానగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు.

ఈ సందర్భంగా కాటసాని రామభూపాల్ రెడ్డి  మాట్లాడుతూ…ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ నేతలు దుష్ప్రచారం చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డులో ఎలాంటి జంతు పదార్థాలు కలవలేదని సీబీఐ ఎంక్వయిరీలో స్పష్టంగా తేలినప్పటికీ, రాజకీయ లబ్ధి కోసం అపవాదులు ప్రచారం చేయడం నీచ రాజకీయానికి నిదర్శనమని విమర్శించారు.

శ్రీవారి ప్రసాదంపై అనవసర ఆరోపణలు చేసిన నాయకులు ఇప్పటికైనా తప్పు తెలుసుకుని శ్రీవేంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరాలని సూచించారు. సనాతన ధర్మం పేరుతో మెట్లు కడిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన మాటలపై ఆత్మపరిశీలన చేసుకుని నోరు కడుక్కోవాల్సిన అవసరం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్‌ అని అన్నారు.

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాలలో, మద్యం అమ్మకాలలో తెలుగుదేశం పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని, అధికారుల బదిలీల్లో కూడా వసూళ్ల దందా జరుగుతోందని కాటసాని రామభూపాల్ రెడ్డి గారు ఆరోపించారు. తనను కబ్జాదారుడిగా చిత్రీకరించిన టీడీపీ నేతలు రెండు సంవత్సరాల పాటు ఎంక్వయిరీ చేయించి నిజాలు బయట పెట్టాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త దారా సుధీర్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలపు సతీష్, కల్లూరు అర్బన్ పరిధిలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Back to Top