తాడేపల్లి: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చేసిన ప్రచారం అబద్ధమని సీబీఐ సిట్ చార్జిషీట్ సాక్షిగా బట్టబయలు కావడంతో.. తమపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి బయటపడ్డానికి కూటమి నేతలు మరింత దుష్ర్పచారానికి తెగబడుతున్నారని మాజీ మంత్రికురసాల కన్నబాబు, విజయనగరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు చేసిన కుట్రలే కూటమి ప్రభుత్వానికి ఉరితాడులా బిగుసుకున్నాయని తేల్చి చెప్పారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపం లేకుండా మరలా లడ్డూలో కల్తీ జరిగిందని ప్రజలను నమ్మించడం ద్వారా... వైయస్ఆర్సీపీ నేతలను జైళ్లకు పంపించడమే లక్ష్యంగా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. దీని ద్వారా తమకు నచ్చిన నివేదిక రాయించుకోవడమే... ఏకసభ్య కమిషన్ ఏర్పాటు వెనుకున్న లక్ష్యమని తేల్చి చెప్పారు. గతంలోనూ గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచార పిచ్చి కారణంగా 29 మంది చనిపోతే ఏకసభ్య కమిషన్ భక్తుల అత్యుత్సాహమే తొక్కిసలాటకు కారణమని తేల్చిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబుకి భజన చేసే ఎల్లో మీడియా తప్ప జాతీయ మీడియాతోపాటు ప్రతి రాష్ట్రంలోని అన్ని మీడియా ఛానెళ్లు కూడా సిట్ చార్జిషీట్ ఆధారంగా తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదనే చెబుతున్నాయని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. కురసాల కన్నబాబు, మాజీ మంత్రి. తప్పుడు ప్రచారమే చంద్రబాబుకి ఉరితాడు.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి సంపాదించలేక నానా అగచాట్లు పడుతోంది. నే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు చేసిన తప్పుడు ప్రచారం ప్రభుత్వానికి ఉరి తాడులా బిగుసుకుంది. వైయస్ జగన్ని రాజకీయంగా ఎదుర్కోలేక వైయస్ఆర్సీపీ మీద బురదజల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దుర్బుద్ధితో కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదంపై మోపిన నిందలు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని దహించి వేస్తున్నాయి. సీబీఐ సిట్ దర్యాప్తు చేసి రూపొందించిన చార్జిషీట్లో జంతువుల కొవ్వు కలవలేదని ల్యాబ్ రిపోర్టుల ఆధారాలతో సహా వెల్లడించడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన కుట్రలు బట్టబయలయ్యాయి. దాన్నుంచి బయటపడలేక చంద్రబాబు, పవన్ కళ్యాన్ సహా కూటమి నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా చేసిన తప్పుకి పశ్చాత్తాపం ప్రకటించి ప్రజలకు క్షమాపణలు చెప్పకుండా నివేదిక తమకు అనుకూలంగా లేదనే ఆవేదనతో ఇంకా దిగజారిపోయి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని ఎలాగైనా ప్రజలను నమ్మించడానికి స్వామి వారి పవిత్రతను ఇంకా దెబ్బతీయడానికి కూడా వెనుకాడటం లేదు. కెమికల్స్ కొనుగోలు చేస్తే లడ్డూలో కలిపేసినట్టేనా? సీఎంగా ఉన్న చంద్రబాబు భక్తుల విశ్వాసాలను మరింత దెబ్బతీసేలా బాత్రూమ్ క్లీనింగ్కి వాడే హార్పిక్ వంటి కెమికల్స్ని లడ్డూ తయారీకి వాడారని దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. నిజంగా ఆయన చెప్పినట్టు అలాంటి ప్రాణాంతకమైన కెమికల్స్తో లడ్డూని తయారు చేస్తే తిన్నవారు బతికుంటారా? అందులో కలిపారని చెప్పడానికి ఆధారాలు లేకపోయినా బోలేబాబా డెయిరీ అలాంటి కెమికల్స్ 8900 కేజీలు కొనుగోలు చేసింది కాబట్టి అందులో వాడేశారంటూ కొత్తగా దుష్ప్రచారం మొదలుపెట్టాడు. తిరుమలేశుడు మా ఇంటి దైవం అని చెప్పుకుంటూనే ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా భక్తుల విశ్వాసాలను ప్రశ్నార్థకం చేసేలా వ్యవహరించడం కరెక్టా కాదా అనే ఆలోచన చేయడం చేయడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు అనుక్షణం తిరుమల శ్రీవారిని వివాదాల్లోకి లాగుతున్నాడు. రెండు మూడు రోజులపాటు ఆయనే ఎల్లో మీడియాలో, టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయించి దాన్ని తీసుకొచ్చి పత్రికలు రాశాయని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఆవు కొవ్వు, పందికొవ్వు, చేపల నూనె కలిసిందని వారు చేసిన ప్రచారం సీబీఐ సిట్ చార్జిషీట్తో వికటించడంతో బాత్రూమ్లు కడిగే రసాయనాలు వాడారు అంటూ కొత్త డ్రామాకు తెరదీశాడు. ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఎలాగైనా తాము అనుకున్నట్టు వైయస్ఆర్సీపీ నాయకులను జైళ్లకు పంపాలనే దురుద్దేశంతో ఇలాంటి తప్పుడు సాంప్రదాయానికి చంద్రబాబు తెరదీశాడు. వైయస్ జగన్ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తున్నాడు. రాబోయే మూడేళ్లూ లడ్డూతోనే డైవర్షన్ పాలిటిక్స్. తిరుమల లడ్డూపై చేసిన తప్పుడు ప్రచారంతో అడ్డంగా దొరికిపొయిన చంద్రబాబు.. కూటమి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి ఏనాడూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూటమి పార్టీలతో కలిసి ప్రెస్మీట్ పెట్టకపోయినా.. ఇప్పుడు తనకు వచ్చిన అపఖ్యాతిని బీజేపీకి కూడా అంటించే ప్రయత్నం చేస్తున్నాడు. తాను చేసిన తప్పుడు ప్రచారమే నిజమని ప్రజలను నమ్మించడానికి పడరాని పాట్లు పడుతున్నాడు. తిరుమల లడ్డూ అంశాన్ని ప్రచారం చేసుకుని రాబోయే మూడేళ్లు కూడా డైవర్షన్ చేయాలని చంద్రబాబు ఫిక్స్ అయిపోయాడు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిపాలన గాలికొదిలేసి, ప్రభుత్వం ఇరుకున పడిన ప్రతిసారీ తిరుమల లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ వ్యవహారంలోకి బలవంతంగా బీజేపీని తీసుకొచ్చి వారి భుజాల మీద తుపాకీ పెట్టి వైయస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు దారుణమైన కుట్రలు చేస్తున్నాడు. గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు స్నానం సరదా కారణంగా 29 మంది అమాయకుల భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోతే ఆరోజున ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ భక్తుల అత్యుత్సాహమే తొక్కిసలాటకు కారణమని తేల్చింది. ఇప్పుడు కూడా చంద్రబాబు తన రాజకీయప్రయోజనాలను నెరవేర్చడం కోసమే వైయస్ జగన్ ని, వైయస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడం కోసం చేస్తున్న దుశ్చర్య అని ఆయన స్పష్టం చేశారు. మజ్జి శ్రీనివాసరావు, వైయస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గం తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన ప్రచారం సీబీఐ సిట్ చార్జిషీట్తో అబద్ధమని తేలిపోయింది. రాష్ట్రంలోని చంద్రబాబుకి భజన చేసే ఎల్లో మీడియా తప్ప జాతీయ మీడియాతోపాటు ప్రతి రాష్ట్రంలోని అన్ని మీడియా ఛానెళ్లు కూడా సిట్ చార్జిషీట్ ఆధారంగా తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేశాయి. దీంతో రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నామని గ్రహించిన చంద్రబాబు దేవుడి విషయంలో ఇంకా దిగజారి ప్రవర్తిస్తున్నాడు. జంతువుల కొవ్వు కలవలేదని జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబుతో జరిపిన ఏకాంత చర్చల తర్వాత మాట మార్చేశాడు. వైయస్ జగన్ని రాజకీయంగా ఎదుర్కోలేక లడ్డూ పేరుతో వితండవాదనకు దిగాడు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి తిరుమల లడ్డూ అంశాన్ని చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నాడు. వైయస్ జగన్ మీద బురదజల్లాలని అనుకున్నప్పుడల్లా దేవుడిని రాజకీయాల్లోకి లాగి పబ్బం గడుపుకుంటున్నారు. తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నందుకే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై టీడీపీ గూండాలతో దాడులు చేయిస్తున్నాడు. దేశంలోనే అత్యున్నత న్యాయవ్యవస్ధ సుప్రీంకోర్టు వేసిన సీబీఐ సిట్ లడ్డూలో జంతువుల కోవ్వు కలవలేదని తేల్చిన తర్వాత కూడా ఏకసభ్య కమిషన్ పేరుతో రాజకీయ కక్షసాధింపులకు దిగాలనుకోవడం సిగ్గుచేటని మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.