అనంతపురం జిల్లా: నియోజకవర్గంలోని వైయస్ఆర్సీపీ కుటుంబాలకు కష్టకాలంలో పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ భరోసా కల్పించారు. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన వైయస్ఆర్సీపీ నాయకుడు గాంధీ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం, అలాగే శింగనమల మండలం జలాలపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రామచంద్ర అనారోగ్యంతో ఇటీవల మృతి చెందడం తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ ఘటనల నేపథ్యంలో డా. సాకే శైలజానాథ్ సంబంధిత గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాధను పంచుకుని ఓదార్పుని కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కష్టకాలంలో వైయస్ఆర్సీపీ పార్టీ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుంది. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం” అని తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొని బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.