విజయవాడ : రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు నాగరిక సమాజాన్ని సిగ్గుపడేలా చేస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని కూడా ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంబటి ఇంటిపై దాడి నాగరిక సమాజానికి అవమానం “గుంటూరులో అంబటి రాంబాబు అన్న ఇంటికి వెళ్లి చూసినప్పుడు నాగరిక ప్రపంచం తలవంచుకునే పరిస్థితి కనిపించింది. ఐదు కార్లను ధ్వంసం చేశారు. ఇంట్లోకి చొరబడి అద్దాలు పగలగొట్టారు. ఇంట్లో ఉన్న మహిళలను దుర్భాషలాడారు. ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగాయి. సాయంత్రం ప్రారంభమైన దాడి అర్ధరాత్రి వరకు కొనసాగింది” అని వైఎస్ జగన్ తెలిపారు. జోగి రమేష్పై హత్యాయత్నం “అదే పరంపరలో జోగి రమేష్ ఇంటిపై కూడా దాడి జరిగింది. యాసిడ్ బాటిళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. యాసిడ్ పడిన ప్రాంతాల్లో గోడలు, తలుపులు కాలిపోయాయి. స్విచ్ బోర్డులపై పడితే పెద్ద ప్రమాదం జరిగేది. ఇంట్లో 80 ఏళ్ల వృద్ధుడు ఉన్నాడు. ఇది హత్యాయత్నం కాదా?” అని ప్రశ్నించారు. పోలీసులతో కలిసి కుట్ర “టీడీపీ నాయకులు పోలీసులతో కలిసి దాడులకు కుట్ర పన్నారు. డీసీపీ, సీఐలతో కలిసి టీడీపీ నాయకులు సమావేశాలు నిర్వహించిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులు విసిరి దాడులు చేశారు” అని ఆరోపించారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు దుష్ప్రచారం “తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, పందికొవ్వు, చేప నూనె కలిసిందని చంద్రబాబు ప్రజలను తప్పుదారి పట్టించారు. కానీ సీబీఐ చార్జిషీట్ స్పష్టంగా ఇవన్నీ అబద్ధాలని తేల్చింది. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్టులు కూడా ఎటువంటి కల్తీ జరగలేదని నిర్ధారించాయి” అని జగన్ పేర్కొన్నారు. సీబీఐ క్లీన్ చిట్పై వ్యాఖ్యలు “టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఎటువంటి తప్పు చేయలేదని సీబీఐ నిర్ధారించింది. వారి పేర్లు చార్జిషీట్లో కూడా లేవు. కానీ చంద్రబాబు మాత్రం అబద్ధ ప్రచారం కొనసాగిస్తున్నారు” అని విమర్శించారు. తప్పు చేసినవారు ఎవరు? “సీబీఐ చార్జిషీట్లోనే టీటీడీ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు మళ్లీ అదే కాలంలో వేరే పేర్లతో ప్రవేశించాయని పేర్కొన్నారు. అప్పుడు పాపం చేసినవారు ఎవరు? చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, పవన్ కల్యాణ్ దీనికి సమాధానం చెప్పాలి” అని జగన్ ప్రశ్నించారు. జోగి రమేష్పై కేసులు రాజకీయ కక్షసాధింపు “జోగి రమేష్పై ప్రభుత్వం 12 కేసులు పెట్టింది. చేయని నేరానికి 83 రోజులు జైలులో పెట్టారు. ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టారు. బీసీ నాయకులు ఎదగడం చంద్రబాబుకు నచ్చడం లేదు” అని విమర్శించారు. న్యాయపోరాటం చేస్తాo “ఈ దాడులపై ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్తాం. రాష్ట్రంలో జరుగుతున్న జంగిల్ రాజ్ను దేశానికి తెలియజేస్తాం. మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడీ దాడులకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతాం” అని వైఎస్ జగన్ హెచ్చరించారు.