మండలిలో వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యుల‌ ఆందోళన

 రాయలసీమ ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఎమ్మెల్సీల డిమాండ్‌

అమ‌రావ‌తి: శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన విజ్ఞప్తి వల్లే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిలిపివేశారని తెలంగాణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. ఆ వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉన్నారా? అని ప్రశ్నించారు. అలాగే ఆ వ్యాఖ్యలపై చంద్ర‌బాబు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు నిలిపివేయడం వల్ల ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని, సీమ లిఫ్ట్‌ ప్రాజెక్టును ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలని వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రుల నుంచి సరైన, పొంతనలేని సమాధానాలు వచ్చాయని వారు ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో మండలిలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాయలసీమ ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని సభ్యులు కోరారు.

Back to Top