అమరావతి: చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ..రాయలసీమ ప్రాంత నీటి అవసరాల దృష్ట్యా ఎత్తిపోతల పథకాలు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను రాజకీయ కారణాలతో మూసివేస్తున్నారా అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయని చెప్పారు. ప్రజల ఆందోళనలను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలని, రాయలసీమకు జీవనాధారంగా ఉన్న నీటి ప్రాజెక్టులపై స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి ఇచ్చిన సమాధానంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాయలసీమ నీటి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.