ఎన్‌టీవీ జర్నలిస్టుల అరెస్టును ఖండించిన వైయ‌స్ జగన్ 

తాడేపల్లి: ఎన్‌టీవీ జర్నలిస్టుల అరెస్టులను వైయ‌స్ఆర్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు. ఈ మేరకు వైయ‌స్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 
ఇది పత్రికా స్వేచ్ఛ,  ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి. పండుగ రోజు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి.. బలవంతంగా జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి..అరెస్టు చేయటం దారుణం. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా, కనీసం నోటీసులు జారీ చేయకుండా జర్నలిస్టులను అరెస్టు చేయటం సరికాదు. ఈ అరెస్టులు నిరంకుశ మనస్తత్వాన్ని ప్రతిబింబం. జర్నలిస్టులు నేరస్థులో, ఉగ్రవాదులో కాదు.

అయినప్పటికీ వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి చర్యల వలన జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతాయి.మీడియా సోదరులలో భయాన్ని సృష్టిస్తాయి. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి. రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలనీ, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. 
 

Back to Top