విజయవాడ: ప్రజానాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన రంగా 79వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ, గుడివాడ, కైకలూరు, గుంటూరు, నందిగామ, తిరువూరు, కాకినాడ తదితర ప్రాంతాల్లో రంగా విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పలు చోట్ల అన్నదానం, పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ: విజయవాడ నగరంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రంగా జయంతి వేడుకలు నిర్వహించారు. రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలు, మహిళలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు. వైయస్ఆర్సీపీ ఎప్పటికీ రంగా ఆశయాలు, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. అనంతరం వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర కూడా నివాళులర్పించి, రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నామని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రంగా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. గుడివాడ.. మాజీ మంత్రి కొడాలి నాని ఆదేశాల మేరకు గుడివాడలోని వైయస్ఆర్సీపీ కార్యాలయంలో రంగా జయంతి నిర్వహించారు. రంగా కుల, మతాలకు అతీతంగా పేదల కోసం పనిచేసిన మహానేత అని నాయకులు కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ నాయకత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. కైకలూరులో.. ఏలూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కౌకలూరులో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గుంటూరులో.. వైయస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నియోజకవర్గ సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నందిగామలో.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు ఆధ్వర్యంలో రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడారని, ఆయన ఆశయాలకు అనుగుణంగానే వైయస్ఆర్సీపీ పనిచేస్తోందని తెలిపారు. తిరువూరులో.. నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో రంగా జయంతి వేడుకలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. కాకినాడలో.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రంగా పేదలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచిన నాయకుడని కొనియాడారు. తన రాజకీయ జీవితానికి రంగా ప్రోత్సాహం అందించారని గుర్తు చేసుకున్నారు. రంగా బాటలోనే రాజకీయాలు చేస్తున్నామని పేర్కొంటూ, కాకినాడలో ముత్తా వారధి జంక్షన్ వద్ద రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.