అమరావతి: కౌన్సిల్లో డీఎస్సీపై చర్చకు ప్రభుత్వం రావాలని, చర్చ సందర్భంగా మండలి ఛైర్మన్ ఎదుట మా వద్ద ఉన్న ఆధారాలను పెడతామని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. మీడియా పాయింట్ వద్ద వరుదు కళ్యాణి మాట్లాడుతూ..చంద్రబాబు వదిలేసి వెళ్లిన టీచర్ పోస్టులను వైయస్ జగన్ భర్తీ చేశారు. దేశ చరిత్రలో ఎవరూ ఇవ్వని విధంగా లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చారు. అంతర్జాతీయ క్రీడాకారిణి పీవీ సింధుతో డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను పోల్చడం సిగ్గుచేటు. గోల్డ్ మెడల్ సాధించిన వారిని పక్కన పెట్టి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వారికి ఉద్యోగాలు ఇస్తారా? డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నది వాస్తవం. వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమాలకు సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. “నీట్ పరీక్షల అక్రమాల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. మరి డీఎస్సీ వ్యవహారంలో మంత్రి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? డీఎస్సీపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతున్నాం. సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోంది? డీఎస్సీలో తప్పులు జరగకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు.