నెలాఖరులోగా అప్ ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తిచేయాలి

లింక్ రోడ్డు ద్వారా వాహనాలు పంపేందుకు ఏర్పాట్లు చేయండి

ఐఐటి నిపుణులు, ఇంజినీరింగ్ అధికారుల సమావేశంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుప‌తి: భారీ వర్షాల కారణంగా అప్ ఘాట్‌లో ధ్వంసమైన రోడ్డు, రక్షణ గోడల పునః నిర్మాణం నెలాఖరులోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేసి శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం ఐఐటి నిపుణులు, ఇంజినీరింగ్ అధికారులతో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. అప్ ఘాట్ రోడ్డులో ఇటీవల విరిగిపడిన భారీ కొండ చరియలోని మిగిలిన సగభాగం రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన కొండ చరియలను కెమికల్ టెక్నాలజీని ఉపయోగించి ఇబ్బంది లేని విధంగా తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల భద్రత ముఖ్యమని ఈ విషయంలో ఖర్చుకు ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత చర్యలపైన దృష్టి పెట్టాలన్నారు. డౌన్ ఘాట్ రోడ్డు నుంచే వాహనాల రాకపోకలు సాగుతున్నందువల్ల అలిపిరి, లింక్ బస్టాండ్, తిరుమల లో భక్తులు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందన్నారు. వీరి ఇబ్బందులు తొలగించడానికి లింక్ రోడ్డు మీదుగా తిరుమలకు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Back to Top