తాడేపల్లి: ఆర్టీసీని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజా రవాణా వ్యవస్థను కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టే ప్రయత్నాలను విరమించుకోవాలని వైయస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డి డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరించి ప్రజలపై అదనపు భారం మోపేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదని తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హెచ్చరించారు. - ఆర్టీసీని బలోపేతం చేసిన జగన్.. నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి రూ.700 కోట్లతో 1,459 కొత్త బస్సులు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఉద్యోగుల భద్రతను కాపాడుతూ సంస్థను బలోపేతం చేశారని తెలిపారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్టీసీని బలహీనపరుస్తూ ప్రైవేటీకరణ దిశగా నడుస్తోందన్నారు. 12 డిపోల్లో 700 ఎలక్ట్రిక్ బస్సులు, పూర్వోదయ పథకం పేరుతో మరో 1,450 బస్సులను ప్రైవేటుకు అప్పగించే ఎత్తుగడ అందులో భాగమేనని పేర్కొన్నారు. - ప్రైవేటీకరణతో నష్టపోయేది ప్రజలే ప్రైవేటీకరణ వల్ల నష్టపోయేది కేవలం ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే కాదు.. ప్రజలు కూడా అని పూనూరు గౌతమ్రెడ్డి అన్నారు. టికెట్ చార్జీలు పెరుగుతాయని, గ్రామీణ రూట్లు దెబ్బతింటాయని, ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులు, డిపోలు, ప్రభుత్వ మౌలిక వసతులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. ఈ నిర్ణయాలపై ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో బహిరంగ చర్చలకు రావాలని డిమాండ్ చేశారు. - ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమమే ఆర్టీసీని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, కొత్త బస్సులను ఆర్టీసీయే కొనుగోలు చేసి సంస్థను మరింత బలోపేతం చేయాలని పూనూరు గౌతమ్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు కొనసాగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజా ఆస్తులను కాపాడేందుకు అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తామని పూనూరు గౌతమ్రెడ్డి స్పష్టం చేశారు.