చంద్ర‌బాబును దేశ బహిష్కరణ చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

పేదలంటే చంద్రబాబుకు చులకన భావం

సెంటు స్థలంలో మురికివాడలు అంటూ బాబు అవమానకరంగా మాట్లాడుతున్నారు

ముందస్తుకు వెళ్లాల్సిన మాకు అవసరం

తాడేప‌ల్లి: సెంటు స్థలంలో సమాధులు కట్టుకోమంటున్న చంద్రబాబును రాజకీయల నుంచే కాదు.. దేశం నుంచే బహిష్కరించాలని   వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  అన్నారు. చరిత్రలో చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యయం అయితే.. ఆ పాలనలో పేదలకు ఇల్లు అనేది ఒక కలగానే ఉండిపోయిందని పేర్కొన్నారు. ఆ కలను సాకారం చేయడానికి సీఎం వైయ‌స్‌జగన్‌ తీవ్రంగా కృషి చేస్తుంటే.. కోపం, అసూయ, ద్వేషంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు.  

గురువారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ..  2014-19 మధ్య రాష్ట్రంలో పేదలకు ఎక్కడైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా?. నిజంగా ఇస్తే ఎవరికి ఇచ్చారో బయట పెట్టగలరా?. పేదలంటే చంద్రబాబుకు చులకన భావం. కనీసం టిట్కో ఇళ్లలో కూడా 16 గజాలు ఇవ్వలేదు. అందులో కూడా కాంట్రాక్టర్లకు అధిక రేట్లుకు ఇచ్చి.. వారి నుండి కిట్ బ్యాగులు తీసుకున్నారు. ఇప్పుడేమో సెంటు స్థలంలో మురికివాడలు అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారు అని సజ్జల మండిపడ్డారు. 

చక్కని రోడ్లు, మంచినీరు, కరెంటు అన్నీ కల్పిస్తుంటే మురికివాడలు అంటారా?. స్థానిక ఎమ్మెల్యేలు ఆ పేదలకు సామాజిక బాధ్యతగా సిమెంట్, ఇసుక, కంకర లాంటివి తక్కువ రేటుకు ఇప్పిస్తున్నారు. వైయ‌స్ జగన్ కట్టించిన టిట్కో ఇళ్ల దగ్గరకు వెళ్లి చంద్రబాబు సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెంటు స్థలంలో సమాధులు కట్టుకోమంటున్న చంద్రబాబును రాజకీయల నుంచే కాదు.. దేశం నుంచే బహిష్కరించాలని సజ్జల అన్నారు. 

ముందస్తు ఎన్నికలనే తప్పుడు ప్రచారం చేసుకుని పార్టీని బతికించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తారని, చంద్రబాబు బలవంతుడు అవుతాడని భావించినప్పుడే తాము ముందస్తుకు వెళ్తామని.. కానీ, అలాంటిదేం లేనప్పుడు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమకు ఏంటని సజ్జల పేర్కొన్నారు. 

చంద్రబాబుది దింపుడుకల్లం ఆశ. లోకేష్ ఎదగలేదనీ, పార్టీ బతకదని చంద్రబాబుకు పూర్తిగా అర్థం అయ్యింది. అందుకే ఫ్రస్టేషన్‌లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితే ప్రజలు రాజకీయంగా సమాధి చేస్తార‌ని సజ్జల రామ‌కృష్ణారెడ్డి అన్నారు.

తాజా వీడియోలు

Back to Top