చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే

బూతులు మాట్లాడినట్లు నిరూపిస్తారా.. బాబు, పవన్‌కు పేర్ని నాని సవాల్‌

5 ఏళ్లలో మచిలీపట్నానికి ఏం చేశానో చెప్పే దమ్ము ఉంది

చంద్రబాబు, పవన్, బీజేపీ ఈ రాష్ట్రానికి ఏం చేశారో దమ్ముంటే చెప్పండి.

చంద్రబాబు మేకవన్నె పులి, నమ్మితే నష్టపోతారు.

 నిజాయితీగా ఉండే వైయ‌స్ జ‌గ‌న్‌ కావాలా?..లేక ఉద్యోగులకు చుక్కలు చూపించే చంద్రబాబు కావాలా..ఆలోచించండి:  పేర్ని నాని

 తాడేపల్లి: మచిలీపట్నంలో చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జితో మాట్లాడి తోట త్రిమూర్తులుకి బెయిల్‌ ఇప్పించారని అబద్ధం చెప్పాడని మండిపడ్డారు. శిరోముండనం కేసు 1996లో జరిగిందని, ఆ ఘటన జరిగినప్పుడు తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. 1995 నుంచి 2020 వరకు తోట త్రిమూర్తులు టీడీపీలో లేరా అని బాబును నిలదీశారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు త్రిమూర్తులు టీడీపీ నుంచి పోటీ చేసిన విషయాన్ని పేర్ని నాని గుర్తుచేశారు.  
చంద్రబాబులాగా అసహ్యంగా మాట్లాడే నాయకులు ఎవరైనా ఉంటారా అని మండిపడ్డారు. తనకు బూతులు తిట్టడానికి మంత్రి పదవి ఇచ్చారని అంటున్నారని, తాను ఏనాడు చంద్రబాబు, పవన్‌లను బూతులు తిట్టలేదని చెప్పారు. ఒకవేళ తాను బూతులు మాట్లాడి ఉంటే నిరూపించాలంటూ సవాల్‌ విసిరారు. బాబుకు వయసు పెరిగింది కానీ.. ఏం మాట్లాడాలో తెలియలేదని విమర్శించారు. 4 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బందర్‌కు ఏం చేశారని ప్రశ్నించారు.

బందర్‌కు పూర్వవైభవం రావడానికి కారణం సీఎం జగన్ అని పేర్ని నాని తెలిపారు. కృష్ణా వర్శిటీ, పాలిటెక్నిక్‌ కాలేజీలు నిర్మించామన్నారు. పోర్టు పనులు శరవేగంగా జరిగేలా చూస్తున్నామన్నారు. 26వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చామని పేర్కొన్నారు. కరోనా సమయంలో తన కొడుకు పేదలకు సేవ చేశాడని తెలిపారు. 75 ఏళ్ల వయసున్న చంద్రబాబువి అన్నీ పాపపు మాటలేనని దుయ్యట్టారు. తన కొడుకు గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు తీరును ప్రశ్నిస్తే నతాను బూతులు నానినా? అని నిలదీశారు.

 *మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:*

 

*టీడీపీలో ఉన్నప్పుడు తోట త్రిమూర్తులు మంచోడు...మా పార్టీలో ఉంటే చెడ్డొడా?:*

– నారా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఇద్దరూ మచిలీపట్నం వచ్చి వారి ఇష్టారాజ్యంగా మాట్లాడారు.

– అసత్యాలను బొంకుతూ, దూషణ పర్వాన్ని కొనసాగిస్తూ వారు ఓట్లు అడిగిన తీరు చూస్తే వీళ్లా ఈ రాష్ట్రానికి నాయకులు అనిపిస్తోంది.

– ప్రజలు వీరికి అధికారం ఇస్తే మేలు చేసే ఆలోచన లేని నాయకులు.

– చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ బొంకు మాటలే. ఆయన మాట్లాడిన ప్రతి మాటా అసత్యమే.

– దళితులకు శిరోముండనం కేసులో శిక్ష పడ్డ తోట త్రిమూర్తులకు సీటెందుకు ఇచ్చావ్‌ జగన్‌ అంటున్నాడు. 

– తోట త్రిమూర్తులను జైళ్లో వేయకుండా జడ్జి గారితో మాట్లాడి బెయిల్‌ ఎందుకు ఇప్పించావు అంటాడు. 

– అసలు ఈ శిరోముండనం కేసు 1996లో తోట త్రిమూర్తులు టీడీపీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగింది.

– 1995 నుంచి 2020 వరకూ.. పాతికేళ్లు ఆయన రాజకీయాలు ఎవరి జెండా పట్టుకుని నడిచాడు? 

– ఎవరి పక్కన కుర్చీలో కూర్చుని రాజకీయాలు నడిపాడో చంద్రబాబు చెప్పాలి. 

– చంద్రబాబే తన పక్కన కూర్చోబెట్టుకుని, ప్రతి ఎన్నికలో అతనికి సీటిచ్చి, గెలిపించుకుని ఇవ్వాళ జగన్‌ గారిని ప్రశ్నిస్తున్నాడు.

– నేడు జగన్‌ గారిపై బురద జల్లే మాటలను ఏమంటారు?

– మీ దగ్గర ఉంటే గంగానదిలో స్నానం చేసినట్లా? ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌ కట్టినప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిది? 

– 1996లో ఈ సంఘటన జరిగింది కదా..1999లో మీరు టికెట్‌ ఇవ్వకుండా ఆపారా? 

– పోనీ ఎప్పుడైనా అతనికి టికెట్‌ ఆపారా? అప్పటికి ఆయన ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు కదా?

– మీ దగ్గర ఉన్నంత సేపు మంచోడైనట్లు..వైఎస్సార్సీపీలోకి వస్తే జగన్‌ గారే పక్కనుండి ఆ చర్య చేయించినట్లుగా బొంకు మాటలు మాట్లాడుతున్నాడు. 

– ఇంత చెండాలంగా, అసహ్యంగా మాట్లాడే రాజకీయ నాయకుడు ఈ భారత దేశంలో ఎవరైనా ఉంటారా? 

 

*జగన్‌ గారిని పచ్చిగా ఎంత మాటైనా మీరు అనొచ్చు..మేం ప్రశ్నించకూడదా?:*

– నాకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను తిట్టడానికే జగన్‌ గారు మంత్రిపదవి ఇచ్చారట.

– నేను చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నా. ఏ రోజైనా నేను చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను అసభ్యంగా కానీ, మిమ్మల్ని బూతులు తిట్టానా చెప్పండి. 

– పచ్చిగా ఎంత మాట పడితే అంత మాట జగన్‌ గారిని మాట్లాడతారు. 

– జగన్‌ గారి జెండా మోసే వాడిగా, తన సహచర మంత్రిగా మిమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదా?

– ఇంత వయసొచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని నేను అడిగితే నేను నీతుల నానీని, బూతులు మాట్లాతాను అంటారు.

– ఇంకా నీ వయసుకు తగ్గట్లు ప్రవర్తించకుండా, 75 ఏళ్ల వయసొచ్చి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు ఎంత కిరాతకంగా మాట్లాడుతున్నారు. 

– నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని ఎంత దిగజారి కిరాతకంగా మాట్లాడారు? నా కొడుకు గంజాయి అమ్ముతాడా? 

– అందుకే నేను అనేది. వంటిమీద వయసుకు తగ్గ మాటలా ఇవి? 

– ప్రజాసేవ చేయాలనే బలమైన ఆకాంక్షతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి నాలుగేళ్లు అవుతుంది. 

– నీ కొల్లు రవీంద్ర, మీ నాయకులు..మీతో సహా అందరూ ఇళ్లలో పడుకుంటే కరోనా అతను ప్రాణాలు తెగించి సేవలందించాడు.

– కరోనాలో ప్రాణాలు పోతుంటే ఐసీయూలోకి కూడా వెళ్లి అందరికి సేవలందించిన వ్యక్తి పేర్ని కృష్ణమూర్తి. 

– బెడ్లు కావాలంటే..బెడ్లు అందించడం..ఎప్పుడూ సేవలోనే ఉన్నాడు.

– నూనూగు మీసాల నవయువకుడు మొదటి సారి రాజకీయాల్లో పోటీ చేస్తుంటే..అతన్ని ప్రజలు గుర్తిస్తే 75 ఏళ్ల వయసొచ్చిన చంద్రబాబు పాపపు మాటలు మాట్లాడతాడా? 

– ఇంజనీరింగ్‌ చదువుకుని ప్రజలకు, నా ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఆక్షాంక్షతో వచ్చాడు. 

– చంద్రబాబు లాంటి దుర్మార్గులు చాలా మంది ఉంటారని చెప్పినా ఇలాంటి వారికి దడిచి నేను ప్రజాసేవ మానుకుంటానా అన్నాడు. 

– అటువంటి యువకుడి గురించి పచ్చి పాపపు మాటలు మాట్లాడుతున్నారు. 

 

*జీవో 217 ద్వారా మత్స్యకారులకు ఏం అన్యాయం జరిగింది బాబూ?:*

– మత్స్యకారులకు 217 జీవో గుదిబండగా మారిందట. అసలు ఆ జీవోలో ఏముంది? 

– ఎక్కడైతే 100 హెక్టార్లు పైబడిన చెరువులు ఉన్నాయో వాటిలో కచ్చితంగా అక్కడి సంఘ సభ్యుల బ్యాంకు ఎకౌంట్లలోకి ఆ డబ్బు వెళ్లాలనే జీవో తెస్తే దాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారు. 

– మత్స్యకార సంఘాల పేరుతో అగ్రవర్ణాలు దోచుకుంటుంటే..దానికి చెక్‌ పెట్టడానికి ఈ జీవో తీసుకొచ్చాం. 

– మీ గుండెల మీద చేయివేసుకుని చెప్పండి..ఆ జీవోలో ఏం తప్పు ఉందో? 

– కృష్ణా జిల్లా ఎందరో మహనీయులను అందించిందని ఇప్పుడు వీరికి కొత్తగా గుర్తుకువచ్చింది. 

– పింగళి వెంకయ్య ఈ గడ్డపైనే పుట్టి మొట్టమొదటి జాతీయ జెండా ఎగిరింది ఇక్కడే అంటాడు.

– బ్రిటీష్‌ హయాంలో బందరు ఓ వెలుగు వెలిగింది అన్నారు. 

– 2014–19 వరకూ చంద్రబాబు హయాంలో జిల్లా కలెక్టర్‌తో సహా ఒక్క అధికారి బందరులో ఉండేవారు కాదు. 

– మొత్తం విజయవాడలోనే ఉండేవారు. ఆఖరుకు ఆగస్టు 15, జనవరి 26న కూడా వాళ్లు జెండా ఎగరేసేందుకు వచ్చే వారు కాదు. 

– సోమవారం ఒక్క రోజు వారికి బుద్దిపుడితే ఒక గంట కూర్చుని వెళ్లేవారు. 

– ఇదీ చంద్రబాబు హయాంలో బందరుకు ఏర్పడ్డ దుస్థితి. 

– ఇప్పుడు ఈయన ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్లు, ఇప్పుడే వచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేయండని మొదటి సారిగా ఓట్లడుగుతున్నట్లుగా బిల్డప్‌ ఇస్తున్నాడు ఈ బిల్డప్‌ బాబాయి. 

– 2022 మార్చిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. 

– బెజవాడ క్రీనీడలో గతమంతా ఘనమైన బందరు చరిత్ర ఎలాగైతే మసకబారిపోయిందో ఆ మసక తుడిచేయడానికి కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. 

– 2014–19, లేదా 2004కు ముందు మీరు ముఖ్యమంత్రిగా చేశారు కదా? బందరు గురించి మీరు ఎందుకు పట్టించుకోలేదు? 

– ఈ రోజు వచ్చి పింగళి వెంకయ్య గారి గురించి, జాతీయ జెండా అంటారు. 

– బ్రిటీష్‌ వారి టైంలో బందరు చరిత్ర ఘనం అన్నాడు. మరి నీ ఏలుబడిలో బందరు ఏమైపోయింది? 

 

*చంద్రబాబు, పవన్‌లు విషం చిమ్ముతూ ఊరూరా తిరుగుతున్నారు:*

– సైకో జగన్‌..ఒక్కో ప్రాంతానికి ఒక్కో సైకోను తయారు చేసి మమ్మల్ని మానసికంగా కుంగతీయాలని చూస్తున్నాడని అంటున్నాడు. 

– నేను మిమ్మల్ని మానసికంగా ఏం కుంగతీశాను. ఏ రోజన్నా మీ గురించి, మీ కుటుంబ విషయాల గురించి మాట్లాడానా? 

– చంద్రబాబుకు సవాల్‌ చేస్తున్నా. నేను ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడానా? 

– మీ రాజకీయ జీవితం, మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు మాట్లాడిన అసత్యాల గురించి తప్పితే నేను ఏ రోజన్నా మాట్లాడానా? 

– నేడు మీరు విషపు డబ్బా ఒకటి తీసుకుని విషాన్ని చిమ్ముతూ హెలికాఫ్టర్‌ వేసుకుని ఊరూరా తిరుగుతున్నాడు. 

– ఐదేళ్లలో జగన్‌ గారి నాయకత్వంలో బందరుకు ఏం చేశానో చెప్పే ధైర్యం నాకుంది. 

– కృష్ణా జిల్లాకు శతాబ్ధాలుగా ముఖ్య కేంద్రంగా వెలుగు వెలిగిన మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకొచ్చింది పేర్ని నానినే. 

– నాడు వైఎస్సార్‌ హయాంలోనైనా, ఈనాడు జగన్‌ గారి నాయకత్వంలోనైనా పేర్ని నానినే దానికి కారణం. 

– కృష్ణా యూనివర్సిటీని మచిలీపట్నం స్థాపించడానికి నాటి వైఎస్సార్‌ హయాంలో పేర్ని నానినే కారణం. 

– మచిలీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటుకు పేర్ని నానినే కారణం. 

– మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం చేయాలని ఆలోచన చేసి..దాన్ని కార్యరూపం దాల్చేలా చేసింది పేర్ని నానినే. 

– నేడు జగన్‌ గారి సారధ్యంలో ఆ పనులు శరవేగంగా పరిగెత్తిస్తున్నది పేర్ని నానినే. 

– మచిలీపట్నంలో మెడికల్‌ కాలేజీ కావాలని జగన్‌ గారిని ఒప్పించి ఏర్పాటు చేయించడం కూడా పేర్ని నానినే చేశాడు. 

– ఇళ్లు లేని నిరుపేదలు 26 వేల మంది ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇప్పించింది పేర్ని నానినే. 

– మీరు 3 సెంట్లు స్థలం ఇస్తానన్నారు. ఒక సెంటు స్థలం ఎవరికైనా ఇచ్చారా? 

 

*2014లో మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి..?:*

– 2014లో బందరు కోనేరు సెంటర్లో మీరు ఏమేమీ హామీలు బొంకారో వాటికి సమాధానం చెప్పండి. 

– బందరు పోర్టు పనులు గెలిచిన ఆరు నెలల్లో ప్రారంభించి పూర్తి చేసే బాధ్యత నాదే అన్నాడు. 

– పరిశ్రమలు, చేపల, రొయ్యల పరిశ్రమ కూడా పెట్టిస్తానన్నాడు. 

– విజయవాడ కాదు..బందరును హైదరాబాద్‌తో సమానంగా తయారు చేస్తానన్నాడు. 

– ఐటీని డెవలెప్‌ చేసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కూడా తెస్తానన్నాడు. 

– బందరు నుంచి రేపల్లెకు రైల్వే లైను వేయిస్తా..రెండు రింగు రోడ్లు కూడా వేయిస్తానన్నాడు.

– హైదారాబాద్‌ నుంచి ఉద్యోగాలు బందరు వచ్చేటట్లు చేస్తానని హామీ ఇచ్చాడు.

– మళ్లీ 2024 ఎన్నికల్లో ఇదే బందరు వచ్చి మళ్లీ పోర్టు పూర్తి చేస్తాను అంటాడు. రేపల్లెకు రైలు మార్గం వేస్తాను అంటాడు. ఇంతకన్నా దగాకోరు ఎవరైనా ఉంటారా? 

– నేను ఇలాంటివి అడిగితే నన్ను బూతులు తిడుతున్నాను అంటారు. 

– ఇన్ని సొల్లు కబుర్లు చెప్పిన సొల్లు కబుర్ల చంద్రబాబు చెప్పిన మాట ఏ ఒక్కటీ చేయలేదు.

– 5 ఏళ్లు మా ప్రాంతంలోని 22 గ్రామాలను బలవంతపు భూసేకరణ పేరుతో 33 వేల ఎకరాల పేద, సన్నకారు రైతుల భూమిని లాక్కున్నాడు. 

– ఈయన 2019 మార్చి 7వ తేదీన వచ్చి బందరు పోర్టుకు శంకుస్థాపన చేశాడు. 

– అప్పటికి పర్యావరణ అనుమతులు లేవు. బ్యాంకు లోను లేదు. భూసేకరణ లేదు. 

– ఇవన్నీ లేకుండా పని ఎలా మొదలు పెడుతున్నాని చెప్పాడో ఆలోచించండి.

– ఇది పెద్ద దగా శంకుస్థాపన. 2019న మార్చి 12వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ వస్తుంటే 7వ తేదీన శంకుస్థాపన చేశాడు.

– ఆ శంకుస్థాపన ఖర్చు 8.60 కోట్లు చేశారు. ప్రతిదీ లెక్కుంది. కావాలంటే బాబుకు రిజిస్టర్‌ పోస్టులో పంపిస్తాను. 

– జరగని పోర్టు పనులకు శంకుస్థాపన పేరుతో రూ.8.60 కోట్లు నాకేశారు. 

– మీరు ఇప్పుడొచ్చి నీతులు చెప్తూ...నన్ను నీతుల నానీ అంటున్నారు. 

– 2014లో ఏవైతే మాటలు చెప్పారో..అవే మాటలు 2024లో వచ్చి చెప్తున్నారు. 

– అంటే చెప్పడానికి మీకు సిగ్గులేదా? వినడానికి మాకు సిగ్గు లేదా? 

– 2014లో చెప్పి 2019 వరకూ మీరు ముఖ్యమంత్రిగా పదవి వెలగబెట్టి..2024లో మళ్లీ అవే మాటలు చెప్తున్నారంటే బందరు వాళ్లు పిచ్చోళ్లు అనుకుంటున్నావా? 

– ఈ ఐదేళ్లలో నేను పోర్టు పనులను మంజూరు చేయించి పనులు శరవేగంగా చేయిస్తున్నా. 

– ఆడపిల్ల పుడితే రూ.25వేలు డిపాజిట్‌ చేస్తాను అన్నారు..ఇచ్చారా? 

– కాపుల్ని బీసీలుగా, మత్స్యకారులు, రజకులను ఎస్సీలుగా చేస్తానన్నారు..చేశారా? 

 

*అసలు ఈ రాష్ట్రానికి మీరేం చేశారో చెప్పే దమ్ము మీకుందా?:*

– అసలు ఈ రాష్ట్రానికి మీరేం చేశారో చెప్పే దమ్ము చంద్రబాబు,పవన్‌కల్యాణ్, బీజేపీ వాళ్లని అడుగుతున్నా. 

– 2014–18 వరకూ మీరు ముగ్గురూ కలిసి ఈ రాష్ట్రాన్ని ఎలారు. మీ మార్కేంటని చెప్పే దమ్ము ఉందా? 

– మీకు నిజంగా సిగ్గు అనేది పెడితే మేం జన్మభూమి కమిటీలతో అద్భుతమైన పరిపాలన చేశాం..మేం వస్తే మళ్లీ అవే తెస్తాం అని చెప్పే దమ్ముందా? 

– ఆ దమ్ము లేక జగన్‌ గారు ఏర్పాటు చేసిన వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తాం..ఆయన ఐదు వేలే ఇస్తున్నాడు..నేను 10 వేలు ఇస్తాను అంటున్నారు. 

– ఇదీ మీ దిగజారుడు జారుడుబండ రాజకీయం. 

– జగన్‌ గారు అమ్మ ఒడి రూ.15వేలు ఇస్తుంటే...నేను 20 వేలు ఇస్తానంటారు. 

– చేయూత కింద జగన్‌ గారు ఐదేళ్లకు రూ.70 వేలు ఇస్తానంటే నేను లక్ష ఇస్తానంటాడు. 

– జగన్‌ గారు 2.70 లక్షల కోట్లు నేరుగా కోట్లాది మందికి ఆర్థిక పరిపుష్టి కలగజేస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుందని అన్నారు. 

– ఈ ప్రభుత్వం రద్దయిపోతుందని అవాకులు చెవాకులు పేలిన ఈ మూడు పార్టీ ఇప్పుడు జగన్‌ గారి పథకాలను కాపీ కొడుతున్నారు. 

– ఐదేళ్లలో రూ.6 లక్షల కోట్ల హామీలు ఇప్పటికే ఇచ్చారు. ఇంకా హామీలు ఇస్తారట. 

– చంద్రబాబును నేను నిలదీసి ప్రశ్నిస్తున్నా. మీ బొంకు మాటలు ఆపండి.

– కొల్లు అబద్ధం ఏది చెవిలో చెబితే అది మీరు మాట్లాడారు. 

– ఎవరో రాం నితీష్‌ అనే వ్యక్తి బైపాస్‌లో మాల్‌ కట్టుకుంటే నేను ఎన్వోసీ ఇవ్వకుండా డబ్బులు డిమాండ్‌ చేశానని ఆరోపించారు. 

– నేను చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను ప్రశ్నిస్తున్నా. ఆ రాం నితీష్‌తో నానీ నన్ను లంచం అడిగాడని చెప్పించు అంగీకరిస్తా. 

– కొల్లు అబద్ధాన్నీ, చంద్రబాబును చాలెంజ్‌ చేస్తున్నా...నా పరోక్షంలోనైనా సరే అతన్ని డబ్బు కోసం వత్తిడి చేశానని చెప్పించండి.

– ఆ మాల్‌ వెనుక కాలనీ వాసుల ఇబ్బంది తొలగడానికి అతను రోడ్డుకు స్థలం దానం చేశాడు. 

– అతన్ని ఒక్క  మాట చెప్పమనండి..నేను లంచం తీసుకున్నానని ఒప్పుకుంటా.

– తమ్మని వారి సత్రం నేను ఆక్రమించానని సిగ్గూ శరం లేకుండా ఆరోపిస్తున్నారు. 

– ఆర్యవైశ్య సమాజంలో క్రియాశీలకంగా ఉన్న ఏ ఒక్క సభ్యుడైనా నేను ఆక్రమించానని చెప్పమనండి.

– కొల్లు రవీంద్రను కూడా పిలుస్తున్నా...రండి..వాసవీ అమ్మవారి వద్ద ప్రమాణం చేద్దాం.

 – పేర్ని నాని తన జీవితంలో పాపపు రూపాయి ముట్టుకునే పరిస్థితి ఉండదు. 

– కొల్లు రవీంద్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ అంధ్రజ్యోతి పత్రికలోనే రెండు సార్లు ట్రాన్స్‌ఫర్లలో డబ్బులు దండుకుంటున్నావని రాశారు. 

– అది నిజం కాకపోతే రాధాకృష్ణను కొల్లుపై నేను అబద్ధం రాశానని మళ్లీ వార్త రాయమనండి.

– నీ లంచగొండి తనం భరించలేక చంద్రబాబు కూడా మంత్రిపదవి పీకేస్తానంటే నువ్వు కాళ్లపై పడి బోరున ఏడ్చావు. 

– చివరికి ఎటువంటి ఫైల్స్‌ రాని న్యాయ శాఖ, స్పోర్ట్స్‌ మంత్రిగా ఇచ్చింది నిజమా కాదా?

– మీరు నా గురించి తప్పుడు మాటలు మాట్లాడం..అవే మాటలు చంద్రబాబుతో చెప్పిస్తున్నారు. 

– నేను చంద్రబాబును చాలెంజ్‌ చేస్తున్నా..మీరు 2014లో పవన్, మోడీ ఫోటోలేసి ఇంటింటికి వెళ్లి పంచిన హామీలు ఏ మీటింగులోనైనా చదివి చేశాను కదా అని ప్రజలతో అనిపించగలరా?

– మా ఊరికి మా కొల్లు రవీంద్ర, చంద్రబాబు ద్రోహం చేశారు.

– నాతో అట్ల కాడ కాల్పించుకుని వాతలు ఎందుకు పెట్టించుకుంటారు? 

– నా జోలికి రాకుండా ఉండాలి కదా..నన్ను తిట్టకుండా ఉండాలి కదా? 

– నిజం నా తప్పులు ఉంటే నిలదీయండి..సమాధానం చెప్పుకుంటా..లేదంటే క్షమాపణలు కోరతా.

– బందరులో ఉండాల్సిన బెల్‌ కంపెనీ 2015లో నిమ్మకూరుకు ఎలా తరలిపోయింది? 

– 1937లో అయ్యగారి రామ్మూర్తి పంతులు గారితో స్థాపించిన ఆంధ్రా సైంటిఫిక్‌ కంపెనీని అప్పటి కార్మికుల పోరాటం ఆధారంగా దాన్ని భారత్‌ ఎలక్ట్రానిక్‌ కంపెనీలో కలిపేశారు. 

– బైపాస్‌లోని గోసంఘం భూమిలో నిర్మించాల్సిన బెల్‌ కంపెనీ నిమ్మకూరుకు ఎందుకు తరలిపోయింది? 

– నారా లోకేశ్‌ నిమ్మకూరును దత్తత తీసుకున్నాడని మీరంతా కలిసి దాన్ని బందరు నుంచి నిమ్మకూరుకు తీసుకెళ్లలేదా?

– 1937 నుంచి 2015 వరకూ బందరులో నడుస్తున్న బెల్‌ కంపెనీ నిమ్మకూరుకు ఎలా తరలిపోయింది?

– ఇప్పుడు మీరు వచ్చి బందరును ఉద్దరిస్తారట..

 

*నువ్వు చెప్పుతో కొడతానంటే..మా దగ్గర రెండు చెప్పులున్నాయని చెప్పా:*

– నేను జగన్‌ గారి ప్రాపకం కోసం నేను పవన్‌ కల్యాణ్‌ను ఎక్కువగా తిడుతున్నానట. 

– బందరు ఎమ్మెల్యే ఆకురౌడీని హెచ్చరిస్తున్నా. నీది నాదీ ఒకే కులమైతే నేను నీకు అలుసా అంటున్నారు. 

– జగన్‌ దగ్గర ఊడిగం చేసుకో..కుక్కపిల్లలా పాకు అంటున్నారు. 

– మీ మేనల్లుడు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడితే ఆయన సినిమా రిలీజ్‌ కోసం ఆడియో పంక్షన్లో మంచి మాటలు మాట్లాడమని పిలిస్తే ఆ సభలో మీరు మాట్లాడింది ఏంటి? నన్ను బూతులు కాదా తిట్టింది? 

– మీ ఇష్టం..మీరు సినిమా హీరో..చాలా గొప్పొళ్లు...మీరు మాత్రం ఏరా ఓరే..సన్నాసి, వెదవ అని మాత్రం తిడతారు.

– నేను అన్నీ మూసుకోవాలా? నేనూ కాపు బిడ్డనే కదా? ఎందుకు ఊరుకుంటాను. 

– మీరు అట్టు పెడితే నేను అట్టున్నర పెడతా. ముందు ఆ సభలో నన్ను తిట్టింది ఎవరు? 

– మీకేం హక్కుందని అలా మాట్లాడారు? ఏనాడైనా మీ ఆటోగ్రాఫ్, సెల్ఫీ కోసం నీ దగ్గరకు వచ్చానా? 

– ఏ నాడైనా మీ పార్టీలో చేరతానని కానీ, నాకు టికెట్‌ ఇవ్వండని కానీ మిమ్మిల్ని బతిమిలాడానా? 

– పోనీ మా ఇంట్లో శుభకార్యం ఉంది..మీరు రావాలని మిమ్మల్ని ఏనాడైనా పిలిచానా? 

– మనిద్దరికీ సంబంధాలు లేనప్పుడు నన్నెందుకు దుర్భాషలాడారు? 

– ఒక రాష్ట్ర మంత్రిని..ఫిల్మ్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌కి కూడా మంత్రిగా ఉన్నాను. 

– మీరు ఆ ఆడియో పంక్షన్‌కు వెళ్లి ఎందుకు నోరు జారి మీ ఇష్టం వచ్చినట్లు నన్ను తిట్టారు. 

– తిడితే నాకూ ఉంటుంది కదా? ఇది న్యూటన్స్‌ లా కదా? 

– నేనూ అదే జాతి..నాకూ పౌరుషం ఉందని మీకు చెప్పాను. 

– పవన్‌ కల్యాణ్‌ చెప్పు తీసుకుని కొడతా అంటే...మా దగ్గర కూడా రెండు చెప్పులున్నాయని చెప్పా. నోరు జారడం మంచిది కాదని చెప్పా. 

– వైఎస్సార్సీపీలోని కాపు నా కొడకల్లారా..చెప్పు తెగిపోద్ది అని మాత్రం మీరు మాట్లాడొచ్చు. 

– మా అమ్మా నాన్న కని నిన్ను, చంద్రబాబును తిట్టమని వదిలేశారా?

– అందుకే నేను నోరుజారవద్దు..మా దగ్గర రెండు చెప్పులున్నాయని చెప్పా.

– ఇంజనీరింగ్‌ చదివి సమాజానికి ఏదో చేద్దామని ఒక యువకుడు మందుకొచ్చి నిలబడితే రౌడీ అంటారా?

– కొల్లు రవీంద్ర వెనుక హత్యలు చేసిన వాళ్లు, హత్యాయత్నం కేసుల్లో ఉన్నవారే తిరుగుతారు.

 

*మా ఊరికి మీరేం చేశారు చంద్రబాబూ..?:*

– చంద్రబాబును మళ్లీ అడుగుతున్నా..మా ఊరికి ఏం మీరు ఏం చేశారు?

– ఆరు నెలల్లో పోర్టు కడతాను అన్నారు..60 నెలల్లో కూడా శంకుస్థాపన చేయలేదు.

– పోర్టును, మెడికల్‌ కాలేజీని బాలశౌరి శాంక్షన్‌ చేయించాడట. 

– మరి జగన్‌ ఎవరు? బందర్‌ పోర్టు కేంద్రం నిర్మిస్తుందా..రాష్ట్రం నిర్మిస్తుందా? 

– జగన్‌ గారి మంత్రిమండలి సహచరుడిగా నేనుండి ప్రతి దాన్నీ నేను దగ్గరుండి పూర్తి చేయిస్తే నేనే చేయించాను అంటున్నాడు.

– రాష్ట్ర ప్రభుత్వం ఆ పోర్టుకు రూ.4,500 కోట్లు అప్పు హామీ ఇచ్చి అప్పు తెస్తే..ఈయన నిధులు మంజూరు చేయించాను అంటున్నాడు.

– అప్పును కూడా మీరు నిధులని చెప్తుంటే మీరు చెప్తే మేం నమ్మాలా? 

– రామాయపట్నం పోర్టుకు స్టేట్‌ బ్యాంక్‌ అప్పు ఇచ్చింది కదా? మూలపేటలో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లోన్‌ ఇచ్చింది. అక్కడి వారు తామే నిధులు తెచ్చామని చెప్పుకోవడం లేదే? 

– జగన్‌ గారిని నేను మెడికల్‌ కాలేజీని అడిగిన తర్వాత జగన్‌ గారు మోడీ వద్దకు వెళ్లి మూడు కాలేజీలు తెచ్చారు.

 

*ఉద్యోగులూ....సాధుజంతువుగా నటించే చంద్రబాబు కావాలా? నిజాయితీగా ఉండే జగన్‌ గారు కావాలా?:*

– రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా. 

– చంద్రబాబు, ఆయన మనుషుల రెచ్చగొట్టే మాటలకు బలి కావద్దు. 

– 2019కి ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంత నరకం చూశారో, 2004కు ముందు ఎంత నరకం చూశారో ఒక సారి గుర్తుకు తెచ్చుకోండి.

– మీరు ఆశించిన మేరకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా బాగోని పరిస్థితుల్లో మాత్రమే జీతం పెంచలేకపోయానని జగన్‌ గారు చెప్తున్నారు. 

– నన్ను అర్ధం చేసుకోండి అని జగన్‌ గారు మిమ్మల్ని బతిమిలాడారు.

– నిజాయితీగా వాస్తవాలను చెప్పి, నచ్చచెప్పే ప్రయత్నం చేసే నాయకుడు మంచివాడా? లేదా పంజా చేతికి చిక్కే వరకూ సాధుజంతువుగా నటించే వ్యక్తి మంచివాడా? 

– పంజాలో చిక్కగానే తన నిజస్వరూపాన్ని చూపే చంద్రబాబు లాంటి మేకతోలు కప్పుకున్న తోడేలు కావాలా? 

– ఆర్ధిక పరిస్థితి మెరుగుపడితే జగన్‌ గారి లాంటి మంచోడు ఎవరూ ఉండరు.

– ఏరోజన్నా ఉద్యోగులను వేధించిన పరిస్థితులు ఉన్నాయా? వ్యవస్థలో మార్పులు కోసం ప్రయత్నం చేశాడు.

– రాష్ట్ర వ్యాప్తంగా 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగులను నియామకం చేశారు. 

– చరిత్ర తిరగేయండి..ఎప్పుడైనా 2.30 లక్షల నియామకాలు ఎప్పుడన్నా జరిగాయా? 

– గత్యంతరం లేక మాత్రమే ఆయన అలా చెప్పారు. 

– నేను సీపీఎస్‌ చేద్దామని మాట్లాడాను. కుర్చీలో కూర్చున్న తర్వాత ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు తెలిసాయి. 

– చంద్రబాబు అంతులేని బొక్కలు చేసి వెళ్లాడు..ఇది మేడిపండు చందంగా ఉందని తెలిసింది.

– సాక్షాత్తు రామోజీ కూడా తన పత్రికలో ఖజానా ఖాళీ అని రాసిన తార్కానం మనం చూశాం.

– అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల అప్పులన్నీ మేమే తెచ్చాం...వీళ్లకు అప్పులు కూడా పుట్టవు అని చెప్పాడు.

– అందుకే సీపీఎస్‌ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు జీపీఎస్‌ ద్వారా అదే తరహా లబ్ధి వచ్చేలా ఆలోచించారు.

– పెన్షన్‌ విధానం అసలు లేకుండా..మనిషి చనిపోతే షేర్‌ వ్యాల్యూ బట్టి ఎంతొస్తుందో కూడా అర్ధం కాని పక్షంలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు. 

– ఒక్కసారి కష్టమైనా, ఇబ్బంది అయినా వాస్తవాలును చెప్పి నిజాయితీ ఇదీ స్థితిగతులు అని చెప్పే నాయకుడు కావాలా? చంద్రబాబు కావాలా అనేది ఆలోచించుకోండి.

Back to Top