చిత్తూరు: మేనిఫెస్టో అంటే విలువ లేని వ్యక్తి చంద్రబాబు అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు హామీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.. ఆయన మేనిఫెస్టో పై ఎవరికి నమ్మకం ఉండదు అన్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై హాట్ కామెంట్లు చే శారు.. కూటమి తెచ్చిన మేనిఫెస్టోను కూటమిలో ఉన్న పార్టీలే నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాయుడు హామీలు నిలబెట్టుకోరు అని బీజేపీకి తెలుసన్న ఆయన.. అందుకే మేనిఫెస్టో ప్రకటన సమయంలో కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులు ఆ మేనిఫెస్టోను తీసుకోవడానికే నిరాకరించారు.. మేనిఫెస్టో అంటే విలువ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించే గొప్ప నాయకుడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడే వారికి అధికారం వచ్చేసినట్టుగా నారా లోకేష్.. రాజధానిని నిర్మిస్తామని అంటున్నారు.. వారి ధ్యాస అంతా ఇంకా భూములు దోచుకోవడంపైనే ఉంది అని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయాలి, ప్రజల కు మరింత అండగా నిలవాలన్న ఆలోచన ఇప్పటికి వారికి లేదన్నారు. సీఎం వైయస్ జగన్ ఎన్నికల హామీలు అన్ని అమలు చేశారని.. మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పిన దమ్ము, ధైర్యం ఉన్న నేత సీఎం వైయస్ జగన్ అని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.