కోవిడ్‌ కట్టడికి ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

ఉదయం6 గంటల నుంచి మ.12 వరకే షాపులకు అనుమతి

12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు ప్రైవేటు వాహనాలు రాకపోకలపై నిషేధం 

7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు కేబినెట్‌ ఆమోదం

ఈ నెల 13న రైతు భరోసా నిధులు రూ.4,050 కోట్లు రైతు ఖాతాల్లో జ‌మ   

మే 18న వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా నగదు జమ

మూసేసిన సహకార డెయిరీలను అమూల్‌కు లీజుకివ్వడానికి నిర్ణయం

కేబినెట్ నిర్ణ‌యాల‌ను మీడియాకు వివ‌రించిన మంత్రి పేర్నినాని

అమ‌రావ‌తి: కోవిడ్‌ కట్టడికి ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉద‌యం 6 గంటల నుంచి మధ్యాహ్నం12 వరకే షాపులకు అనుమతి. 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు ప్రైవేటు వాహనాలు రాకపోకలపై నిషేధం విధించాల‌ని మంత్రి మండ‌లి తీర్మానించింది. అంతరాష్ట్ర సర్వీసులు కూడా రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

కరోనా కట్టడికి కేబినెట్‌లో విస్తృతంగా చర్చించాం. 24 గంటల్లోనే కరోనా టెస్ట్‌ రిపోర్ట్‌ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 26వేల ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయి. ఇప్పటివరకు కోటి 67వేల మందికి కరోనా పరీక్షలు చేశాం. ప్రతి మండల కేంద్రంలో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. 558 ఆస్పత్రుల్లో కోవిడ్‌ వైద్య సేవలు అందిస్తున్నాం. 100కుపైగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. కోవిడ్‌  బాధితుల కోసం 44, 599 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. కర్ణాటక, ఒడిశా, చెన్నై, విశాఖ నుంచి ఆక్సిజన్‌ తీసుకొస్తున్నాం. రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను కూడా అందుబాటులో ఉంచుతున్నామ‌ని మంత్రి పేర్ని నాని తెలిపారు. 

 కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం. 45 ఏళ్లు పైబడ్డ వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటివరకు 81.66 శాతం హెల్త్‌ వర్కర్లకు.. 76 శాతం ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్ చేశాం అని మంత్రి తెలిపారు. వ్యాక్సినేష‌న్ విష‌యంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి లేఖ రాయాల‌ని మంత్రి మండ‌లిలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్ని నాని తెలిపారు.

ఈ నెల 13న రాష్ట్రలో మరో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. మొత్తం రూ.4,050 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. 2019-20 సంవత్సరానికి 46,69,000 మంది రైతు భరోసా పథకానికి అర్హులయ్యారని, 2020-21వ సంవత్సరంలో దీనివల్ల 51 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింద‌ని, 2021-22 సంవత్సరానికి గాను సుమారు 54 లక్షల మంది లబ్దిదారులయ్యారని తెలిపారు. వీరికి మే 13న రైతు భరోసా ప్రయోజనం అందుతుందని అన్నారు.

2020 ఖరీఫ్ లో పంటనష్టం చవిచూసిన రైతులకు వైయ‌స్సార్ ఉచిత పంట బీమా పథకం ద్వారా మే 25న రూ.2,589 కోట్లు చెల్లించనున్నట్టు తెలిపారు. 38,30,000 మంది రైతుల ఖాతాల్లో బీమా మొత్తం జమ చేస్తామని చెప్పారు. 

సముద్రంలో వేటపై నిషేధం ఉన్నందున ప్రతి మత్స్యకార కుటుంబానికి మే 18న రూ.10 వేలు సాయం చెల్లించనున్నట్టు వివరించారు. దీని ద్వారా 1,30,469 మంది లబ్దిపొందుతారని పేర్ని నాని వెల్లడించారు.  

సీబీఎస్ఈ విద్యా బోధ‌న‌..
7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు కేబినెట్‌ ఆమోదం. రాష్ట్రవ్యాప్తంగా 44, 639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌కు అంగీకారం. ‘‘పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియంలో సీబీఎస్‌ఈ విద్యాబోధన ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. 

పాఠశాల విద్య కోసం ప్రపంచబ్యాంక్‌ నుంచి రూ.1860 కోట్ల అప్పు తీసుకున్నాం అని పేర్ని నాని తెలిపారు. ‘‘2.5 శాతం స్వల్ప వడ్డీతో రుణం తీసుకున్నాం. ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో అరకొర చదువులు చెప్తున్నారు. ఎయిడెడ్‌ సంస్థలు ప్రభుత్వానికి అప్పగిస్తే మంచిది. ప్రభుత్వమే అన్ని బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తుంది’’ అని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రైవేట్‌ యూనివర్శిటీల్లో 35 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాకు ఇవ్వాలి. ఆ సీట్లకు ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పులు ప్రభుత్వమే ఇస్తుంది అన్నారు.

ఏపీలో మూసేసిన సహకార డెయిరీలను అమూల్‌కు లీజుకివ్వడానికి నిర్ణయం. 708 గ్రామాల్లో అమూల్‌ సేవలు.

ఏ కేటగిరి ఆలయాల్లో అర్చకులకు రూ.15వేల గౌరవ వేతనం. బీ కేటగిరి ఆలయాల్లో రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం పెంపుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దాంతో పాటు ఇమామ్‌లకు రూ.5వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనం పెంపు.. మౌజమ్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేలకు గౌరవ వేతనం పెంపుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. 

పట్టా రైతులతో సమానంగా అసైన్డ్‌దారులకు కూడా భూ సేకరణ పరిహారం.

రూ.511.79 కోట్లతో 176 పీహెచ్‌సీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.

ప్రతి ఏజెన్సీ మండలానికి మూడు పీహెచ్‌సీలు.

ప్రతి పాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు డాక్టర్లు, 104 వాహనం.

ఏలేరు-తాండవ లింక్ కెనాల్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిన‌ట్లు పేర్ని నాని  వివ‌రించారు. 

 

 

Back to Top