విశాఖపట్నం: ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు ఇచ్చిన 'ఆడబిడ్డ నిధి' హామీకి మంగళం పాడుతున్నాయని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఓ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆడబిడ్డ నిధిని పీ4లో పెట్టాను అనడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. అంటే ఎన్నికలకు ముందు మహిళలను ఆడబిడ్డ నిధి పథకం అంటూ నమ్మించి, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత వారిని పచ్చిగా మోసం చేయాలనే దుర్మర్గపు ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఆడబిడ్డ నిధి పేరుతో పద్దెనిమిది ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ లోపు ఉన్న మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని హామీ ఇచ్చాయి. మూడు రోజుల కిందట చంద్రబాబు మాట్లాడుతూ ఈ పథకాన్ని పీ4లో పెట్టాను, దానిలో చూస్తాను అని చెప్పారు. పీ4కి, ఆడబిడ్డ నిధికి సంబంధం ఏమిటీ? ఏడాదికి రూ.18000 ఇస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావోస్తోంది. రాష్ట్రంలోని దాదాపు అర్హులైన కోటి మందికి పైగా మహిళలకు ఎప్పుడు ఆడబిడ్డ నిధిని ఇస్తారు? బీజేపీ, జనసేనలు కూడా చంద్రబాబు మాటలను సమర్థిస్తున్నారా? ఆడబిడ్డ నిధిని ఎప్పుడు ఇస్తారో ప్రకటించాలని ప్రతిపక్షంగా వైయస్ఆర్సీపీ తరుఫున డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు ఆశ చూపి వంచించడం చంద్రబాబు నైజం ఎన్నికలకు ముందు చంద్రబాబు, కూటమి పార్టీల నేతలు సూపర్ సిక్స్ హామీలు అంటూ ప్రజలను ఓట్లు అడిగారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందుగా మోసపోయేది మహిళలే. వారిని సునాయాసంగా నమ్మించి మోసగించడం చంద్రబాబుకు అలవాటు. అరచేతిలో వైకుంఠం చూపి, మాయమాటలతో ఓట్లు దండుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ అంటూ మహిళలను ఇలాగే మోసం చేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడటం లేదు. మహిళలకు ఉచిత బస్సును ఆగస్టు 15న ప్రకటిస్తామని లీకులు వదులుతున్నారు. తల్లికివందనంను గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఈ ఏడాది స్కూల్స్ తెరిచిన తరువాత ఇస్తామంటూ చెబుతున్నారే తప్ప, అది కార్యరూపంలోకి వస్తుందా అనేది అనుమానం. హామీలను ఎగ్గొట్టే చర్యలను ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోం. అక్కచెల్లెమ్మలకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్సీపీ వారికి అండగా నిలబడి పోరాడుతుంది. విశాఖ జీవీఎంసీలో కూటమి పార్టీల్లో లుకలుకలు విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక సాక్షిగా కూటమి పార్టీల మధ్య ఉన్న లుకలుకలు బయటపడ్డాయి. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం లేకపోవడం వల్ల వాయిదా పడింది. కూటమి పార్టీలకు చెందిన కార్పోరేటర్ల మధ్య తేడాలు ఉండటం వల్ల కోరంకు సరిపడే కార్పోరేటర్లు ఈ ఎన్నికకు హాజరుకాలేదని తెలుస్తోంది. కూటమి పార్టీలకు అధికారం, దానిని అడ్డం పెట్టుకుని దోచుకోవడమే ముఖ్యం. ప్రజలకు మంచి పాలన అందించాలనే ఆలోచనే లేదు. తమకు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు వస్తే, దానిని అడ్డం పెట్టుకుని దోచుకోవాలనేదే వారి ఉద్దేశం. కూటమి పార్టీలకు చిత్తశుద్ది ఉంటే, కోరంకు సరిపడే సంఖ్యాబలం ఉండి కూడా డిప్యూటీ మేయర్ ఎన్నికను ఎందుకు చేయించుకోలేకపోయారు. సుమారు 63 మంది కార్పోరేటర్లు వారికి ఉండి కూడా దాదాపు ఇరవై మందికి పైగా కార్పోరేటర్లు ఈ ఎన్నికకు గైర్హాజరు అయ్యారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే, కూటమి పార్టీలకు అధికారం మాత్రమే ముఖ్యమని తెట్టతెల్లమవుతోంది. రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన రాష్ట్రంలో ఏడాది కాలంగా అస్తవ్యస్త పాలన సాగుతోంది. అన్నిచోట్లా సంఖ్యాబలం లేకపోయినా అధికార దుర్వినియోగంతో, పోలీసులను అడ్డం పెట్టుకుని, దౌర్జన్యాలతో పదవులను దక్కించుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఏడాది కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. ఆరు నెలలుగా జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ లేరు. ఇటువంటి కీలకమైన పోస్ట్లకు కూడా ఇన్చార్జీలను నియమించి పాలన సాగిస్తున్నారు. ఇటువంటి పాలనను ఎప్పుడూ చూడలేదు. జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన 27 మంది కార్పోరేటర్లకు విప్ జారీ చేశాం. చట్టప్రకారం ఎన్నికల అధికారి పదిరోజుల్లో దానిపై స్పందించి ఆ 27 మందికి నోటీస్లు ఇచ్చి, వారి స్పందనను మాకు తెలియచేయాలి. కానీ ఎన్నికల అధికారి నుంచి ఎటువంటి స్పందన లేదు. అంటే చట్టాన్ని ఏ విధంగా కించపరుస్తున్నారు, ఏ విధంగా రాజకీయ ఒత్తిళ్ళతో చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల అధికారికి రెండుసార్లు రిమైండ్ ఇచ్చాం. ప్రస్తుత వేసవి సెలవులు పూర్తయిన తరువాత దీనిపై న్యాయస్థానంను ఆశ్రయిస్తాం. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వైయస్ఆర్సీపీ పూర్తి వ్యతిరేకం స్టీల్ప్లాంట్ను కాపాడుకోవడంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అంగీకరించేది లేదు. ఆనాడు ప్రధాని మోడీ సమక్షంలోనే వైయస్ జగన్ గారు చాలా స్పష్టంగా స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కానీ ఇటీవల ప్రధాని రాష్ట్రానికి వచ్చిన సందర్బంలో కూటమి ప్రభుత్వం మాత్రం ఎందుకు ప్రధానిని స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రశ్నించలేదు? స్టీల్ప్లాంట్ను కాపాడుకునేందుకు దేనికైనా సిద్దం.