అమరావతి: ‘‘చంద్రబాబూ నీకో దండం... నువ్వు మాకు వద్దు’’ అంటూ ఏపీ ప్రజలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని తిరస్కరిస్తారని వైయస్ఆర్ సీపీ సమన్వయ కర్తలు పేర్కొంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను నమ్మం బాబు అంటూ అన్ని నియోజకవర్గాల్లో బుధవారం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ సమన్వయకర్తలు బుధవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఆరోపించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాడుతున్న ఏకైక నాయకుడని అన్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు రాబోయే ఎన్నికలలో ప్రజలు చరమగీతం పాడతారని జోష్యం చెప్పారు. ఏపీ ప్రజలు చంద్రబాబు చేతిలో రెండోసారి మోసపోవడానికి సిద్దంగా లేరన్నారు. ‘‘ఏపీకి ఏం చేశాడని చంద్రబాబు మళ్లీ రావాలి’’ అంటూ ప్రశ్నించారు. గురువారం నుంచి ‘‘నిన్ను నమ్మం బాబు ’’ కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు.