న్యూఢిల్లీ : విశాఖ ఉక్కు కోసం సంఘటితంగా పోరాడుదామని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఢిల్లీలో వరుసగా రెండో రోజు నిర్వహిస్తున్న ధర్నాకు వైయస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎంపీలు మద్దతు ఇచ్చారు. ఆంధ్రా భవన్ ఆవరణలో మంగళవారం ఉక్కు కార్మికులు చేపట్టిన ఆందోళనకు వారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ఆర్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు శ్రీ వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉక్కు కార్మికులకు భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ ఉద్యమాన్ని ఒక ఏడాది పాటు ఇదేలా కొనసాగిస్తే సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుంది. ఎన్నికలు ముందు పెట్టుకుని ఏ ప్రభుత్వమూ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోదని శ్రీ వి.విజయసాయి రెడ్డి అన్నారు. ఒక సంవత్సరం పాటు దీన్ని కొనసాగించాలంటే మనం అందరం కలిసి సంఘటితంగా పోరాటం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. అవసరమైతే మీరు కోర్టులను ఆశ్రయించి ఈ ప్రక్రియపై స్టే తీసుకురావడానికి ప్రయత్నించండి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వం నిర్ణయంలోనే అనేక అవకతవకలు ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వంలోని పెద్దలకు తెలుసు. కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయడానికి ప్రయత్నాలు చేయమని అన్నారు. ఉక్కు కార్మికుల పోరాటంలో మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలని ఎల్లవేళలా కోరుకుంటున్నారు. ఉక్కు కార్మికుల పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ వెంట ఉండి మేం నడుస్తాం. మా ఎంపీలు అంతా నిన్న, ఈరోజు ఈ ధర్నాలో పాల్గొనటం జరిగింది. మీ వెంట నిలబడి మీతో కలిసి పోరాడుతామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా అని విజయసాయి రెడ్డి అన్నారు.