విశాఖ: ఈ నెల 12వ తేదీ దేశ ప్రధాని నరేంద్రమోదీ విశాఖలో 7 ప్రాజెక్టులను ప్రారంభిస్తారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రధాని పర్యటనకు సంబంధించి విశాఖ నగరంలో ఏర్పాట్లను ఎంపీ విజయసాయిరెడ్డి పరిశీలించారు. నగరంలోని ఏయూ కాలేజీ గ్రౌండ్ను కలెక్టర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఈ నెల 12న ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ ఉంటుందన్నారు. పలు కార్యక్రమాలకు ప్రధాని నరేంద్రమోదీ సీఎం వైయస్ జగన్తో కలిసి విశాఖలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. ఇది రాజకీయ పార్టీలకు సంబం«ధించిన పర్యటన కాదు. ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. ఏ రాజకీయ పార్టీ దీన్ని క్లైమ్ చేసుకోదు అన్నారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే అన్ని రాజకీయ పార్టీలు స్వయంగా ఆహ్వానం పలుకుతారు. దీన్ని రాజకీయం చేయవద్దని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12న ఉదయం ఏయూ కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. మినిట్ టు మినిట్ ప్రోగ్రాం త్వరలో షెడ్యూల్ రాబోతోంది. పీఎంవో, సీఎంవో అధికారులు చర్చించి ప్రోగ్రాం షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేస్తారని చెప్పారు. ఈ రోజు ప్రధాని ఆఫీస్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ప్రధాని 7 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. భోగాపురంకు సంబంధించిన కేసుపై జడ్జిమెంట్ రాలేదు. దాని కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. రైల్వే జోన్ ఇస్తామని కేంద్ర రైల్వే మంత్రి ప్రకటించిన విషయం అందరికి తెలుసు. ప్రధాని పర్యటనలో ఈ ప్రోగ్రాం కవర్ అవుతుందా? లేదా అన్నది త్వరలోనే తెలియజేస్తామన్నారు. దాదాపు 30 ఎకరాల స్థలాన్ని ప్రధాని పర్యటనకు సిద్ధం చేస్తున్నాం..పర్యవరణ నేపథ్యంలో ఎక్కడా కూడా చెట్లు తొలగించే అవకాశం ఉండదని మంత్రి విజయసాయిరెడ్డి తెలిపారు.