రాజకీయ నాటకానికి ప‌వ‌న్‌ తెర

ఎంపీ మార్గాని భరత్‌రామ్‌

తూర్పుగోదావరి: పవన్‌ కల్యాణ్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై శ్రమదానం పేరుతో పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలు చేస్తూ.. పబ్బం గడుపుకోవాలనుకోవడం అవివేకమని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత రోడ్ల పరిస్థితికి గత టీడీపీ ప్రభుత్వమే కారణమని ఎద్దేవా చేశారు.

పవన్‌ కల్యాణ్‌ పార్టీ 2019 ఎన్నికల్లో ఎంతపైకి లేచిందో ప్రజలందరికీ తెలుసని అన్నారు. కాగా, ప్రస్తుతం రోడ్ల మరమ్మత్తులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే రూ. 2500 కోట్ల నిధులను మంజూరు చేశారని తెలిపారు. రోడ్ల మరమ్మత్తులు జరుగుతాయని తెలిసే.. పవన్‌ రాజకీయ నాటకానికి తెరలేపారని ఎంపీ మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత పవన్‌ కల్యాణ్‌కు లేదని ఎంపీ భరత్‌రామ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  

Back to Top