తిరుపతి: డ్రగ్స్ దందాలో దొరికిన కానిస్టేబుల్ ను తన గన్ మెన్ అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని వైయస్ఆర్సీపీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ఆ కానిస్టేబుల్ ఇప్పుడు తన గన్మెన్ కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. ఎంపీ గురుమూర్తి ఏమన్నారంటే.. `టీడీపీకి, ఆ పార్టీ సోషల్ మీడియాకు ఎదుటివారిపై నిందలు వేయడం, బురద చల్లడం అలవాటుగా మారింది, నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న గుణశేఖర్ నా దగ్గర నుంచి ఎప్పుడో రిలీవ్ అయి వెళ్ళిపోయాడు, అతను మీ డిపార్ట్మెంట్లో మీ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు, ప్రస్తుతం తిరుపతిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు, అతను నా దగ్గర పనిచేసి వెళ్ళిపోయిన తర్వాత మీ పోలీస్ శాఖలో పనిచేస్తూ తప్పు చేస్తూ దొరికిపోతే నాకు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్, టీడీపీ అధికారంలోకి వచ్చే ముందు మేం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ అరికడతామని చెప్పి ఇప్పుడు స్వయంగా మీ పోలీస్ వ్యవస్ధలోని వారే ఈ పనులు చేస్తూ దొరికితే దాని వెనుక ఎవరున్నారో పట్టుకుని శిక్షించాలి అంతేకానీ మీ పోలీస్ వైఫల్యాన్ని నాకు, మా పార్టీకి అంటగట్టడం సమంజసం కాదు, దీనిపై లోతుగా విచారణ జరపాలని నేను అమిత్ షా గారికి, ప్రధానికి, అన్ని కేంద్ర దర్యాప్తు సంస్ధలకు లేఖ రాస్తాను, దీనిపై నేను బహిరంగ చర్చకు సవాల్కు నేను సిద్దం. మీ తప్పుల్ని, వైఫల్యాలను మా పార్టీకి అంటగట్టాలనే ప్రయత్నం చూస్తూ ఊరుకోం, దీని వెనుక ఉన్న పెద్దలకు తప్పనిసరిగా శిక్షపడాలి, అందరూ బయటికి రావాలి, దీనికోసం ఎందాకైనా పోరాడుతాం` అని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.