`ప‌ది` మూల్యాంక‌నం లోపాల‌కు లోకేషే కార‌ణం

 వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య  డిమాండ్‌

పదవ తరగతి మూల్యాంకన లోపాలపై విద్యార్థుల ఆందోళన

మంగ‌ళ‌గిరి: పదవ తరగతి మూల్యాంక‌నంలో జ‌రిగిన లోపాల‌కు విద్యా శాఖ మంత్రి లోకేష్ కార‌ణ‌మ‌ని, త‌క్ష‌ణ‌మే ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. ప‌దో త‌ర‌గ‌తి మూల్యాంక‌నంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌ను నిర‌సిస్తూ వైయ‌స్ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌గిరిలోని విద్యా భ‌వ‌న్ ఎదుట ఆందోళ‌న చేప‌ట్టారు.  శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న‌ విద్యార్ధి నేతలపై మంగళగిరి పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎవరో ఆదేశించిన చందంగా అమాంతం వారిని అక్కడి నుంచి తరిమివేసే ప్రయత్నం చేశారు. దీనికి విద్యార్ధి సంఘం నాయకుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఒక దశలో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులతో వాగ్వివాదం, తోపులాటల అనంతరం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెల‌కొన్నాయి. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్‌ చేయాలని.. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్‌ మార్క్స్‌ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజుల పాటు నిలిపివేయాలని.. బాధ్యులైన అందరిపైనా చర్యలు చేపట్టాలని కోరుతూ పాఠశాల విద్యా డిప్యూటీ కమిషనర్‌ కృష్ణారెడ్డికి వైయ‌స్ఆర్‌సీపీ స్టూడెంట్స్ వింగ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు.
        ఈ సందర్భంగా పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. కూటమి  పాలనలో విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని ధ్వజమెత్తారు. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తీరని కష్టాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. 10వ తరగతి మూల్యాంకనాన్ని సరిగ్గా నిర్వహించలేక‌పోయార‌న్నారు. 6.14 లక్షల మంది విద్యార్థులు రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించకుండా ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అంతులేని మానసిక క్షోభకు గురిచేశారని మండిప‌డ్డారు. ఇటు ప్రభుత్వం అటు విద్యాశాఖ నిర్వాకం ఫలితంగా ఇప్పుడు ప్రతి విద్యార్థి కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేసే దారుణమైన పరిస్థితిని నెలకొల్పారని నిప్పులు చెరిగారు. ప్ర‌భుత్వ తీరుతో ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్‌ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో సైతం విద్యార్థులు న‌ష్ట‌పోతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే ప్రభుత్వ చేతగానితనం బయటపడిందని పానుగంటి చైతన్య ఆరోపించారు. ప్రశ్నాపత్రాలు వాట్సాప్ వేదికగా లీక్ అయినా తప్పులను సరిదిద్దుకోకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం కాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

    మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా గ‌త ప్ర‌భుత్వంలో నాటి ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్ తీసుకొచ్చిన అనేక సంస్కరణలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే దెబ్బతీసిందని పానుగంటి చైతన్య విమర్శించారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా  ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చడం ద్వారా కూటమి ప్రభుత్వం విద్యార్ధి వ్యతిరేక ప్రభుత్వమన్న వాస్తవాన్ని చెప్పకనే చెప్పారని ఆయన అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ తప్పిదం వలన విద్యార్థులు బలైపోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదన్నారు. ఇదే విధంగా ముందుకు సాగితే విద్యార్థులు తిరగబడతారని.. కూటమి ప్రభుత్వ తలరాతను తప్పకుండా మార్చేస్తారని.. పానుగంటి చైతన్య హెచ్చరించారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్ స్టూడెంట్స్ వింగ్‌ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గంటి, రవి, జిల్లా అధ్యక్షుడు వినోద్, రీజనల్ కో ఆర్డినేటర్ విఠల్, జిల్లా నాయకులు జగదీష్, అజయ్, కిరణ్, కరీం, సాజిద్, రాజేష్, సతీష్, హేమంత్, అరుణ్, మంగళగిరి విద్యార్ధి నేత సందీప్, తెనాలి విద్యార్ధి నేత శామ్యూల్, పత్తిపాడు విద్యార్ధి నేత కెనడి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top