ద‌ళిత బాలిక‌పై నెల‌ల త‌ర‌బ‌డి అత్యాచారం చేయ‌డం దుర్మార్గం

ఫిర్యాదు చేయ‌లేద‌ని నిందితులను పోలీసులు వ‌దిలేయ‌డం ఘోరం

వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున రేపే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం

మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు సాకె శైల‌జానాథ్‌

మానవ‌త్వంతో స్పందించాల్సిన పోలీసులు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించారు

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులపై కేసుల్లో ఉన్న శ్ర‌ద్ద బాలిక‌కి న్యాయం చేయ‌డంలో లేదు

అత్యాచారంతో సంబంధం ఉన్న నిందితుల‌ను కఠినంగా శిక్షించాలి

బాలిక కుటుంబానికి న్యాయం చేసే బాధ్య‌త ప్ర‌భుత్వానిదే 

అనంత‌పురంలోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్‌

అనంత‌పురం: రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం, రామ‌గిరి మండ‌లం, ఏడుగుర్రాలపాడు గ్రామంలో ఒక ద‌ళిత బాలిక‌పై నెల‌ల త‌ర‌బ‌డి 14 మంది యువ‌కులు అత్యాచారం చేయ‌డం దుర్మార్గ‌మ‌ని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు సాకె శైల‌జానాథ్ మండిప‌డ్డారు. అత్యాచార బాధిత బాలిక కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఫిర్యాదు చేయ‌లేద‌ని నిందితులను పోలీసులు వ‌దిలేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున రేపే పోలీసులకు ఫిర్యాదు చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.  శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ద‌ళిత బాలికే క‌దా అని నిర్ల‌క్ష్య‌మా? 
మాజీ మంత్రి ప‌రిటాల సునీత ప్రాతినిథ్యం వ‌హించే స‌త్య‌సాయి జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం, రామ‌గిరి మండ‌లం, ఏడుగుర్రాలపాడు గ్రామంలో ఒక ద‌ళిత బాలిక‌పై నెల‌ల త‌ర‌బ‌డి 14 మంది యువ‌కులు అత్యాచారం చేసి ఫొటోలు వీడియోలు తీయడం, వాటిని చూపించి బెదిరించి అత్యాచారాల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న వెలుగుచూసింది. ఆ బాలిక గ‌ర్భం దాల్చ‌డంతో బాధిత కుటుంబాన్ని భ‌య‌పెట్టి ఊరి నుంచి త‌రిమేశారు. స‌భ్య‌స‌మాజం త‌లదించుకునే ఇలాంటి ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించాలి. బాలిక త‌ర‌ఫున ఫిర్యాదు చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఐ చెప్ప‌డం వారి ఉదాసీన వైఖ‌రికి నిద‌ర్శ‌నం. బాలిక తండ్రి చ‌నిపోయాడు. త‌ల్లి మాన‌సిక విక‌లాంగురాలు. బాలిక భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇలాంటి దుర్భ‌ర స్థితిలో కుటుంబం ఉంద‌ని తెలిసి కూడా ఫిర్యాదు చేస్తే ద‌ర్యాప్తు చేస్తామ‌న‌డం సిగ్గుచేటు. ఒక బాలిక‌కు జ‌రిగిన దారుణం వెలుగుచూస్తే పోలీసులు మాన‌వత్వంతో స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల్సింది పోయి, మీన‌వేషాలు లెక్కించ‌డం దారుణం. నిందితుల వివ‌రాలు ప్ర‌చారంలో ఉన్నా విచారించ‌డానికి పోలీసులు ఎందుకు వెన‌క‌డుగు వేస్తున్న‌ట్టు? ఈ కేసును విచారించ‌డానికి ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాలు కావాలా? ద‌ళిత కుటుంబం క‌దా వారి ప‌క్షాన ఎవ‌రుంటారులే అని ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తే వైయ‌స్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. కంప్లైట్ చేయ‌డ‌మే కావాల‌నుకుంటే రేపే వైయ‌స్సార్సీపీ త‌ర‌ఫున పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేస్తాం. 

బాలిక ఎక్క‌డుందో పోలీసులు త‌క్ష‌ణం క‌నిపెట్టాలి 
రాజ‌కీయ అంశాల‌కు సంబంధించిన కేసుల్లో వేగంగా స్పందించే పోలీసులు, దళిత బాలిక‌కు అన్యాయం జ‌రిగితే ఎందుకు వెనక‌డుగు వేస్తున్నారు? వైయ‌స్సార్సీపీ నాయ‌కుల మీద న‌మోదైన సోష‌ల్ మీడియా కేసుల్లో త‌ల్లిదండ్రుల‌ను కూడా అరెస్ట్ చేయ‌డానికి వెనుకాడ‌ని పోలీసులు, బాలిక‌కు జ‌రిగిన అన్యాయంపై మాత్రం క‌నీసం స్పందించ‌క‌పోవ‌డం సిగ్గుచేటు. పోలీసులు ఇప్ప‌టికైనా మాన‌వ‌త్వంతో స్పందించాలి. ముందుగా బాలిక‌, బాలిక త‌ల్లి ఎక్కడున్నారో పోలీసులు క‌నిపెట్టాలి. పోలీసులు బాధ్య‌తల‌ నుంచి పారిపోకుండా ఈ ఘ‌ట‌న‌పై త‌ద‌న‌నుగుణంగా స్పందించాలి. ద‌ళితులే క‌దా అని చిన్న‌చూపుతో వ్య‌వ‌హ‌రించ‌డం త‌గ‌దు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీని, స‌త్య‌సాయి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని విజ్ఙ‌ప్తి చేస్తున్నా. వైయ‌స్సార్సీపీ నాయ‌కులను నియంత్రించాల‌న్న ఆలోచ‌న‌ల నుంచి కొంత‌కాలం బ‌య‌ట‌కొచ్చి అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి. బాలికకి న్యాయం చేయ‌డంతోపాటు ఆమె భ‌విష్య‌త్తుకి భ‌రోసా ఇవ్వాలి.

Back to Top