తాడేపల్లి: ఏడాది పాలనతోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైయస్ఆర్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు ఛీకొట్టారని తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. మహానాడు అట్టర్ ఫ్లాప్.. వెన్నుపోటు దినం సూపర్ హిట్ మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల నాయకులు ఏడాది కాలంగా ప్రజలను వంచిస్తున్నారు. అందుకే చంద్రబాబు పాలన మోసాలను నిరసిస్తూ వైయస్ఆర్సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. అంతకుముందే అధికారమదంతో కడపలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాన్ని కూడా ప్రజలు తిరస్కరించారు. వేలాది బస్సులేసి తరలించినా జనం లేక సభ ఖాళీ కుర్చీలతో బోసిపోయి కనిపించింది. ప్రభుత్వ వ్యతిరేకతను చాటడానికి నిర్వహించిన వెన్నుపోటు దినం కి వచ్చిన స్పందన మహానాడుకి రాలేదు. ఇప్పటికైనా సిగ్గుపడి చంద్రబాబు కళ్లు తెరవాలి. ప్రజల సొమ్ముతో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని మా నాయకులు వైయస్ జగన్ని తిట్టడం, పార్టీ ఆఫీసులో ఆనం వెంకట రమణారెడ్డి వంటి వారితో తిట్టించడం తప్ప ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కనీసం ప్రయత్నం చేయడం లేదు. దివంగత మహానేత వైయస్సార్ ప్రోత్సాహంతో ఎదిగి, మా పార్టీలో పదవులు పొంది టీడీపీలో చేరిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి తిట్టించడం చూస్తే చంద్రబాబు నైజం అర్థమైపోతుంది. చంద్రబాబు కనీస రాజకీయ విలువలు పాటించడం లేదు. ఇంతకన్నా దిగజారడు అనుకున్న ప్రతిసారీ చంద్రబాబు దిగజారిపోతూనే ఉన్నాడు. కూటమి పాలనలో దళితులపై వేధింపులు ఎక్కువైపోయాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి దళితులను దారుణంగా వేధిస్తున్నారు. దళిత యువకులను రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? వారు నిజంగా తప్పు చేసి ఉంటే దాన్ని నిర్ధారించి శిక్షలు వేయాల్సింది కోర్టులు.. పోలీసులే శిక్షలు వేసేట్టయితే న్యాయస్థానాలు ఉన్నదెందుకు? దళితులంటే అంత లెక్కలేనితనమా? ఇంజనీరింగ్ చదివే విద్యార్థులను ఇలా వేధించడం తగునా? 24 కేసులున్న చంద్రబాబుని కూడా ఇలాగే రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా అని మా నాయకులు వైయస్ జగన్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేక ఆనంతో తిట్టించారు. చంద్రబాబు రాజకీయ అనుభవం ఇదేనా. మా నాయకులు వైయస్ జగన్ గురించి అవాకులు చెవాకులు పేలినవారంతా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. లేదంటే వారికి కూడా అదేవిధంగా బదులిచ్చేందుకు వైయస్ఆర్సీపీ వెనుకాడే ప్రసక్తే ఉండదని గుర్తుంచుకోవాలి. గంజాయి రవాణాలో టీడీపీ నాయకులు రాష్ట్రంలో గంజాయి రవాణా చేస్తున్నది తెలుగుదేశం వారేనని నాడు మంత్రిగా ఉన్న టీడీపీ నాయకులు గంటా శ్రీనివాసరావు స్వయంగా చెప్పారు. ఇప్పుడు కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. అంటే ఆ వైఫల్యం ప్రభుత్వానిది కాదా? ఒక దళిత మహిళ అయ్యుండీ హోంమంత్రి వంగలపూడి అనిత దళిత విద్యార్థుల గురించి చాలా నీచంగా మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు అయిన విద్యార్థులను పోలీసులు నడి రోడ్డు మీద కొట్టి హింసించడాన్ని ఆమె సమర్థించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలా మంది నాయకుల మీద కేసులున్నాయి. వారిని కూడా ఇలాగే రోడ్డుమీదకి లాక్కొచ్చి కొట్టే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నా. మహిళలపై అఘాయిత్యాలకు శిక్షలేవి? మహిళలు, చిన్నారుల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే నిందితులకు శిక్షలు పడలేదు. ముచ్చుమర్రిలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేస్తే ఇంతవరకు శవాన్ని కనుగొనలేకపోయారు. పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఉన్న రాప్తాడులోని రామగిరి మండలం ఏడుగుర్రాలపాడులో ఒక దళిత బాలిక మీద ఆరు నెలలుగా 14 మంది యువకులు అత్యాచారాలు చేశారు. నిందితులందరూ టీడీపీకి చెందినవారే. కానీ ఇవేవీ హోంమంత్రి కళ్లకు కనిపించడం లేదు. పోలీస్ వ్యవస్థను ప్రైవేటు సైన్యంగా మార్చి వైయస్ఆర్సీపీ నాయకులను వేధించడానికి ఉపయోగిస్తున్నారు. ఏడాది పాలనలో 700 మందికిపైగా వైయస్ఆర్సీపీ నాయకుల మీద హత్యాయత్నాలు, దాడులు జరిగాయి. 300 మందినిపైగా హత్య చేశారు. వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో రమేష్ నాయుడు అనే మాజీ ఎంపీటీసీని దారుణంగా చంపేశారు. విచక్షణారహితంగా కత్తులతో నరికి, బండరాయితో మోది చంపినా ప్రభుత్వానికి కనిపించడం లేదు. వైయస్ఆర్సీపీకి అండగా ఉంటే చాలు వారి మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తారు. కానీ విచ్చలవిడిగా పబ్లిక్గా నేరాలు చేస్తున్న టీడీపీ నాయకుల మీద కనీస మాత్రం కేసులు నమోదు కావడం లేదు. మాజీ మంత్రి అని గౌరవం లేకుండా పోలీసులు పల్లు నూరుతూ పైకి దూకుతున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో తాగి డ్రైవింగ్ చేస్తున్నాడని ఎమ్మెల్యే సతీమణి కారు డ్రైవర్కి పెనాల్టీ వేస్తే కానిస్టేబుల్ని ఇంటికి పిలిపించి దారుణంగా కొట్టారు. అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారనేదానికి ఈ ఘటన ఇది పరాకాష్ట. వైయస్ఆర్సీపీ కండువా వేసుకుని టీడీపీకి అనుకూలంగా వీడియోలు చేస్తున్న సీమరాజాకి కూడా పోలీసుల అండదండులున్నాయి. సామాన్యుల మీద, అధికారుల మీద దాడులు చేసినా కేసు నమోదు చేయలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు విద్యుత్ చార్జీలు ఎందుకు పెంచారని అడిగినా, చేసిన అప్పులు ఏమయ్యాయి.. మాకు సంక్షేమ పథకాలు ఎప్పుడిస్తారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు. దానికీ కేసులు పెడుతున్నారు. ఏడాది పాలనతోనే తీవ్రమైన అవినీతిలో కూరుకుపోయిన కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని దుస్థితికి చేరుకుంది. గత వైయస్ఆర్సీపీ పాలనలో దళారులతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేస్తే, ఇప్పుడు సంక్షేమం అన్న పదమే రాష్ట్రంలో వినిపించడం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, మోడీ.. నలుగురూ కలిసి ప్రజలను దారుణంగా మోసగించారు. ఏడాదిలోనే మేనిఫెస్టోను చెత్తకుండీలో పడేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా జగన్ ఒక్కడే సంక్షేమ పథకాలు అమలుచేస్తే, మూడు పార్టీలు కలిసినా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేకపోయారు. కూటమి పాలనతో ప్రజలు అప్పులపాలవుతుంటే, అధికారం అండతో చంద్రబాబు కుటుంబ ఆదాయం మాత్రం రూ. లక్షల కోట్లకు చేరింది. మూడు పార్టీలను నమ్మి అన్ని వర్గాల ప్రజలు దారుణంగా నష్టపోయారు. ఈ చేతకాని ప్రభుత్వం కారణంగా ఆక్వా రంగం కుదేలైంది. క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితికి తీసుకొచ్చారు. రైతులకు ఈ ప్రభుత్వంలో భరోసా లేదు. మద్దతు ధర దక్కడం లేదు. ఆఖరుకి సినిమా థియేటర్లు కూడా మూసుకునే పరిస్థితి తెచ్చారు. ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, వైయస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను పీకేస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాలేదు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉపాధి హామీ కూలీ డబ్బులను కూడా దోచుకుంటున్న చరిత్ర ఈ కూటమి నాయకులది. రేషన్ బియ్యం దోచుకుంటున్నారు. ఉద్యోగులకిచ్చిన ఏ ఒక్క హామీ అమలుకాలేదు. ఇదేనా చంద్రబాబు అనుభవం?