తాడేపల్లి: రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించి లాభం పొందాలనుకుంది ఎవరని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఢిల్లీలో అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఖండించారు. దేవాలయాలపై దాడుల వెనుక ఎవరు ఉన్నారో సాక్ష్యాధారాలతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షాకు నివేదిస్తామని ఆయన పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి అమీత్షాను కలిసి అబద్ధాలు చెప్పారని తప్పుపట్టారు. రాష్ట్రంలో మత కల్లోలాలు, మత మార్పిడీలు అంటూ టీడీపీ హయాంలో జరిగిన ఘటనలు అమీత్షాకు చూపించారని చెప్పారు. రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టిస్తూ..నంది విగ్రహాన్ని ఒక చోటి నుంచి తొలగించి, మరో చోటా పెట్టే దృశ్యాలు వీడియో ఫూటేజ్లతో సహా ఉంటే..అలాంటి వారిపై కేసులు పెట్టకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు అన్నారు. అసలు రాష్ట్ర చరిత్రలో మత కలహాలు ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. మత మార్పిడీలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాల ఘటనలపై విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయని చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి సంబంధించిన వీడియోలు 2016వ సంవత్సరంలోనివన్నారు. అప్పుడు చంద్రబాబు కాదా అధికారంలో ఉన్నదని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనలపై ఇప్పుడు సీఎం వైయస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. హిందూ మతాన్ని, దేవాలయాలను కూడా రాజకీయంగా వాడుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందన్నారు. గతంలో ఇదే అమిత్ షా తిరుమల వచ్చినప్పుడు ఆయన కారు మీద చెప్పులు వేయించింది చంద్రబాబు కాదా అన్నారు. ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి, కుటుంబం గురించి చంద్రబాబు అనరాని మాటలు అన్నారని గుర్తు చేశారు. ఈ వీడియో ఫుటేజ్లన్నీ కూడా వారికి అందజేస్తామని మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు.