దేవినేని ఉమ నాటకాలు, డ్రామాలు తెలియనివి కావు 

వైయస్ఆర్ కాంగ్రెస్ మైలవరం ఎమ్మెల్యే  వసంత కృష్ణ ప్రసాద్ 

  ఘర్షణలు, అల్లర్లు ప్రేరేపించేందుకు దేవినేని ఉమ దుష్ప్రచారం

కొండపల్లి ప్రాంతంలో  అనుమతులు ఇప్పించిందీ దేవినేని ఉమానే

 విజ‌యవాడ‌:  మీడియా ముందు టీడీపీ నేత దేవినేని ఉమ నాట‌కాలు, డ్రామాలు అంద‌రికీ తెలుస‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ మైలవరం ఎమ్మెల్యే  వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.   ప్రశాంతమైన మైలవరం నియోజకవర్గంలో ఘర్షణలు, అల్లర్లు ప్రేరేపించేందుకు పనీపాటలేని మాజీ మంత్రి దేవినేని ఉమ గత కొంతకాలంగా నాపైన, ప్రభుత్వంపైన విష ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తున్నాడు. నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. 

 సంబంధం లేని అంశాలతో చెత్తాచెదారాన్ని అంతా తీసుకొచ్చి, గాలి పోగేసి, వాటిని నాకు, ప్రభుత్వానికి ఆపాదిస్తూ నిత్యం నోటికొచ్చిన ఆరోపణలు చేస్తూ బురదజల్లుతున్నాడు. రక్షిత అటవీ ప్రాంతమైన కొండపల్లి కొండల్లోకి ఇప్పటికి 15 సార్లు వెళ్ళి.. ఒక అబద్ధాన్ని నిజం చేయాలని, దాన్ని నామీద రుద్ది, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నాడు. తాను ఆశించింది జరగకపోవడంతో ప్రజలను రెచ్చగొట్టి అయినా నియోజకవర్గంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. 

 కొండపల్లి ప్రాంతంలో  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు ఇప్పించిందీ దేవినేని ఉమానే. అప్పుడు అవి రెవెన్యూ భూములు అని చెప్పి ప్రారంభోత్సవాలు చేసింది కూడా అతనే. ఇప్పుడు అవి ఫారెస్టు భూములంటాడు. అధికారంలో ఉంటే ఒక మాట, అధికారం పోయాక మరో మాట మాట్లాడుతున్నది దేవినేని ఉమానే. దుగ్గిరాలపాడు, మరో చోట నాకు సంబంధం లేకపోయినా, వాటిని నాకు ఆపాదించడం,  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, తన అనుకూల మీడియాలో తప్పుడు వార్తలు రాయించి ఇబ్బంది పెట్టాలని చూడటంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ ప్రాంత ప్రజలు విసిగిపోయారు. 

 ఈరోజు మరోసారి రక్షిత అటవీ ప్రాంతానికి వెళ్ళి, మళ్ళీ అదే దుష్ట రాజకీయం చేయాలని చూసిన దేవినేని ఉమాను ప్రశ్నించేందుకు స్థానిక వైయస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళారు. ఆ విషయం తెలిసి, నేను మా కార్యకర్తలకు నచ్చజెప్పి వెనక్కి రప్పించాను.

 దేవినేని ఉమా ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలి. మర్యాద అన్నది ఇచ్చి పుచ్చుకోవాలి. నోటికొచ్చినట్లు మాట్లాడి, ప్రజలను రెచ్చగొడితే ఎవరూ చూస్తూ ఊరుకోర‌ని హెచ్చ‌రించారు.

Back to Top