అసెంబ్లీ: మురికివాడల్లో ఉంటున్న దళిత బిడ్డలు ఏబీసీడీలు నేర్చుకుంటామంటే చంద్రబాబు, పవన్, వెంకయ్యనాయుడుకు ఎందుకు ఇబ్బంది కలుగుతుందని, సీఎం వైయస్ జగన్ తీసుకువచ్చిన ఇంగ్లిష్ మీడియం బోధనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ప్రశ్నించారు. ఇంగ్లిష్ మీడియం పేదలు దక్కకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. కౌన్సిల్లో ఎందుకు తిరస్కరించారని నిలదీశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సుధాకర్బాబు మాట్లాడుతూ.. ‘చరిత్రాత్మకమైన బిల్లును సమర్థించలేక మండలిలో తిరస్కరించి సవరణలు కోరడాన్ని దళితులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన సమస్యలపై చర్చించేటప్పుడు సభలో ప్రతిపక్షం ఉండడం లేదు. అమ్మఒడి పథకం ద్వారా రూ.6456 కోట్లతో 43 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరిందన్నారు. పేద తల్లుల మనస్సు తెలుసుకున్న నాయకుడు సీఎం వైయస్ జగన్. ఇంగ్లిష్ మీడియం, అమ్మఒడి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరుగుతుంది. రాజధానుల గురించి టీడీపీ చాలా దుష్ప్రచారం చేస్తోందని, చంద్రబాబు చేసిన అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం ఉందో లేదో కానీ, మా నాయకుడు సీఎం వైయస్ జగన్ ఎక్కడ ఉంటే అక్కడే మా రాజధాని. ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలకు ఏబీసీడీలు నేర్పిస్తానని సీఎం వైయస్ జగన్ అంటే.. చంద్రబాబు, పవన్, వెంకయ్యనాయుడుకు ఎందుకు కష్టం వచ్చింది. మారుమూల ప్రజలు ఇంగ్లిష్ మీడియంలో చదివితే నారాయణ, చైతన్య స్కూళ్లు మూతపడతాయని భయం పట్టుకుంది. నారాయణ చంద్రబాబు బినామీ కాబట్టే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధనతో పేదల ఇళ్లలో విద్యాదీపం వెలుగుతుంది. సీఎం వైయస్ జగన్ తీసుకువచ్చిన ఈ వెలుగు పేదరికాన్ని దూరం చేస్తుందని ఎమ్మెల్యే సుధాకర్బాబు అన్నారు.