చిత్తూరు: చంద్రబాబు తన తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మూడు సీట్లు దక్కడం కూడా కష్టమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా అన్నారు. ఏదో విధంగా ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు చూస్తున్నాడని, ప్రజాదరణ కలిగిన ప్రభుత్వాన్ని కుట్రలు ఏమీ చేయలేవన్నారు. నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్.. కాపులకు కొండంత అండగా నిలిచారన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్నానని చెప్పుకునే నిమ్మగడ్డ రమేష్కుమార్ అనైతిక కార్యక్రమాలకు పాల్పడటం దారుణమని ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని పార్కు హయత్ హోటల్లో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్రావులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలవడం వెనుక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పార్కు హయత్లో జరిగిన రహస్యభేటీని ఎల్లో మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన పత్రికలో రహస్య మంతనాలపై ఎందుకు వార్తలు రాయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు టీడీపీ డైరెక్షన్లో కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని, ప్రజల ఆశీస్సులు ఉన్న సీఎం వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు.