ఎస్వీ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలి

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
 

అమరావతి: చిత్తూరు జిల్లాలో మూతపడిన శ్రీ వెంకటేశ్వర కో–ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీని త్వరగా తెరిపించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కోరారు. గురువారం జీవో అవర్‌లో ఎమ్మెల్యే రోజా చెరుకు రైతుల సమస్యలను ప్రస్తావించారు. 

చిత్తూరు జిల్లాలో గతంలో 6 షుగర్‌ ఫ్యాక్టరీలు ఉండేవి. ప్రస్తుతం ఒక్కటి మాత్రమే ఉంది. ఈ పరిస్థితికి రావడానికి చంద్రబాబు పరిపాలనే కారణం. చంద్రబాబు హయాంలో షుగర్‌ ఫ్యాక్టరీలు మూసేసి తన వర్గం వారికి కట్టబెట్టాలని చూశారు. 2003–2004లో ఎస్వీ షుగర్‌ ఫ్యాక్టరీని మయూర ఫ్యాక్టరీకి అమ్మాలని ప్రయత్నం చేస్తే షేర్‌ ఓల్డర్స్‌ ప్రతిఘటించారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని ఆ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. చిత్తూరు కో–ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ కూడా 2003లో ఆదికేశవులునాయుడికి రూ.18 కోట్లకు అమ్మాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తే..రైతులు 4 వేల మంది షేర్‌ హోల్డర్స్‌గా ఉన్నారు. వారు అడ్డుకున్నారు. దురదృష్టకరంగా రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో చిత్తూరు జిల్లాకు దరిద్రం పట్టుకుంది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక 2014–2015లో గాజులమన్యంలో ఉన్న శ్రీవెంకటేశ్వర షుగర్‌ ఫ్యాక్టరీ, చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీని మూసేశారు. ఈ రోజు వేలాది మంది చెరుకు రైతులు చాలా నష్టపోతున్నారు. చాలా కష్టపడుతున్నారు. వీరి జీవితాల్లో వెలుగులు నింపాలంటే వైయస్‌ జగన్‌ ఈ ఫ్యాక్టరీల గురించి ఆలోచన చేసి , ఎస్వీ షుగర్‌ ఫ్యాక్టరీని ఓపెన్‌ చేయించి, నేతం షుగర్‌ ఫ్యాక్టరీలో 2019–2020 సీజన్‌లో క్రసింగ్‌ కోసం ఇచ్చిన రైతులకు రూ.37 కోట్ల , 2018–2019లో మయూరీ షుగర్‌ ఫ్యాక్టరీ రూ. 32 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంది. యాజమాన్యంతో మాట్లాడి రైతులను అప్పుల ఊబి నుంచి బయటకు తీయాలని ఎమ్మెల్యే రోజా కోరారు. జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు చెరుకును పండిస్తున్నారు. మనకు ఒక్క ఫ్యాక్టరీ మాత్రమే ఉండటంతో రైతులు తమిళనాడుకు చెరుకును పంపిస్తున్నారు. దీనివల్ల అదనంగా టన్నుకు రైతులు రూ.800 చొప్పున నష్టపోతున్నారు. త్వరగా ఎస్వీ కో–ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీని ఓపెన్‌ చేయించాలని ఎమ్మెల్యే రోజా కోరారు. 
 

Back to Top