సోము వీర్రాజు నిలదీయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని

 వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

 కేంద్రం ఇచ్చిన కోవిడ్ మార్గదర్శకాల్లో 4వ పేరా చదువుకోండి

కేంద్రం ఆదేశాల మేరకే..బహిరంగ ప్రదేశాలు, పందిళ్లలోనే వేడుకలు వద్దన్నాం

అంతేతప్ప వినాయక చవితి పండగ జరపవద్దనలేదు

 అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అసత్యాలు చెబుతున్నారు

కోవిడ్ నిబంధనలు అన్ని మతాలకూ ఒక్కటే..

 గుడులలోనూ పండగ చేసుకోవద్దన్నామంటూ... పచ్చి అబద్ధాలు చెబుతూ అనవసర రాద్దాంతం చేస్తున్నారు

 రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారు

 ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు

 సోము వీర్రాజుగారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

తాడేపల్లి:  కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్  మార్గదర్శకాల మేరకే.. అన్ని మతాలకూ ఒక్కటే నిబంధనలు విధించామ‌ని, నిజానికి సోము వీర్రాజు నిలదీయాల్సింది కేంద్ర ప్ర‌భుత్వాన్ని అని *– వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు.  వినాయక చవితి పండగ నిబంధనలకు సంబంధించి గత నెల 28న కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో నాలుగవ పేరా ఆయన ఒకసారి చదువుకోవాలి. అందులో కేంద్రం చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింద‌ని తెలిపారు. ' బహిరంగ ప్రదేశాలలో వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వడం లేదు. అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుగారు అన్నీ అసత్యాలు చెబుతూ ప్రభుత్వపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాలు, పందిళ్లలో మాత్రమే గణేష్‌ నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వడం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆదివారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మ‌ల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని:
    ‘కరోనాను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం వైయస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్స్‌ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించడం జరిగింది. అలాగే ఇవాళ గురు పూజోత్సవం కార్యక్రమాలను కూడా రద్దు చేయడం జరిగింది’.

తెలిసి కూడా ప్రభుత్వంపై దుష్ప్రచారం:
    ‘సోము వీర్రాజుకు అసలు సిగ్గు ఉందా?. గుడులలో కూడా పండగ నిర్వహించకూడదని ప్రభుత్వం చెప్పిందని పచ్చి అబద్ధం చెబుతున్నారు. నిజానికి బహిరంగ ప్రదేశాలలో పండగ వేడుకలు నిర్వహించకూడదని కేంద్రమే స్పష్టంగా మార్గదర్శకాలు, ఆదేశాలు జారీచేస్తే, ఇక్కడ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు’.
    ‘కేంద్రం ఇచ్చిన ఆదేశాలను మీరే ఉల్లంఘిస్తే ఎలా?.
కావాలంటే కేంద్రాన్ని అడగండి. అలా ఎందుకు ఆదేశాలు జారీ చేశారని.
అదే కేంద్రం నుంచి రావాల్సిన కరోనా వ్యాక్సిన్లు, ఇతర నిధుల గురించి ఇదే సోము వీర్రాజు ఏనాడూ మాట్లాడలేదు. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం తాము హిందూ పక్షపాతిగా చూపుకుంటూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు’.

అవేవీ మీకు కనిపించడం లేదా?:
    ‘సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారు గంగానదిలో స్నానం చేసినా, పుష్కరాల సందర్భంగా నదుల్లో స్నానం చేసినా, ప్రతిచోటా నియమ నిష్టలతో వ్యవహరించడం మీ కళ్లకు కనిపించడం లేదా. ఇప్పుడు కూడా కేవలం ప్రజల ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’.
    ‘రంజాన్, బక్రీద్, మొహర్రం వంటి పండగలకు కూడా ఇలాగే ఆదేశాలు ఇచ్చారా అని సోము వీర్రాజుగారు మాట్లాడుతున్నారు. అందుకే వాటికి సంబంధించి అప్పుడు ప్రభుత్వం జారీ చేసిన జీఓలు ఒకసారి చూడాలని ఆయనను కోరుతున్నాను’.

హిందువులపై మీకు చిత్తశుద్ధి ఉంటే:
    ‘సోము వీర్రాజుగారు మీరు మాట్లాడే తీరు చూస్తుంటే, పోలీసులు హిందువులను అరెస్టు చేస్తారా అని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మీకు హిందువుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏడాది క్రితం జరిగిన ఒక ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరితే, దానిపై ఇప్పటి వరకు అతీగతీ లేదు. దాని ద్వారానే తేటతెల్లమవుతోంది మీకు హిందువుల మీద నిజంగా ఎంత ప్రేమ ఉన్నది అన్నది’.
    ‘ఆ ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. సీబీఐ దర్యాప్తు కోరితే, ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు’.

ఆ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం:
    ‘కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను ఒకసారి చూసుకోండి. అంతేతప్ప ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడడం తగదు. సోము వీర్రాజుగారు ఇవాళ మాట్లాడిన మాటలు దారుణం. వాటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రాణం ఎంతో విలువైంది. కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ పొంచి ఉందని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్రం కూడా అప్రమత్తం చేసి, ఆ మార్గదర్శకాలు జారీ చేసింది’.

దేనికి డెడ్‌లైన్‌?:
    ‘కేంద్రం ఇచ్చిన ఆదేశాలను తెలుసుకోకుండా, కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పును పట్టించుకోకుండా, మీరు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ పెడతారా. మేమేమైనా అసలు పండగే వద్దన్నామా. సోము వీర్రాజుగారు మీ విధానం సమంజసంగా లేదు. మీరు అసంబద్ధమైన కార్యక్రమాలను తెరపైకి తెస్తున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు’.

ఎవరా స్వామీజీ?:
    ‘అలాగే శ్రీనివాసానంద సరస్వతి స్వామి. అసలు ఆయన ఎవరో తెలియదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఆయనతో ఎవరు మాట్లాడిస్తున్నారో కూడా తెలియదు. కాబట్టి దారినపోయే స్వామీజీలు అందరూ కూడా ఈ ప్రభుత్వం ప్రతిష్ట దిగజారాలని ప్రయత్నించడం సరి కాదు’.. అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు.
 

Back to Top