ఫిట్ మెంటుపై బాబు అండ్ కో మాత్రం తెగ బాధపడిపోతుంది

వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి  జోగి రమేష్  

  సచివాలయ ఉద్యోగులను సైతం బాబు వర్గమే రెచ్చగొడుతోంది

 "చంద్రజ్యోతి-చంద్రనాడు" ఎంత రెచ్చగొట్టినా.. జగనన్నే మా దేవుడు అని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు

 నిత్యావసర వస్తువులు పెరుగుదలకు కారణం ఎవరు బాబూ..? కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించవు..

 హెరిటేజ్ లో ధరలు తగ్గించి.. ఆ తర్వాత రోడ్లమీదకు రా బాబూ..?

  చంద్రబాబు అక్కసంతా సాక్షి పత్రిక ఉండకూడదన్నదే

  సంక్రాంతి పండుగ వేళలో అయినా పది నిజాలు చెబితే బాబుకు నరకంలో పడే శిక్షలో పది శాతం రిబేటు ఉంటుంది

  సమ సమాజంకోసం జగన్ గారు తపనపడుతుంటే.. బాబుమాత్రం తన సామాజికవర్గం కోసం ఆరాటపడుతున్నారు

తాడేప‌ల్లి: ఫిట్ మెంటుపై ఉద్యోగులు అర్థం చేసుకున్నా.. చంద్ర‌బాబు అండ్ కో మాత్రం తెగ బాధపడిపోతుంద‌ని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి  జోగి రమేష్ పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారితో ప్రపంచం, దేశం, రాష్ట్రాలు అన్నీ కూడా అతలాకుతలం అవుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగులకు 23శాతం  ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆనందంగా, సంతోషంగా ఉండాలని, వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో... మరోవైపు కేంద్ర ప్రభుత్వం 14.29శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించినా సరే..  ముఖ్యమంత్రిగారు మాత్రం మన రాష్ట్రంలో, రెండేళ్లుగా కోవిడ్‌ వల్ల ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయినా సరే... ధైర్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులను సంతోషపరుస్తూ 23 శాతం ఫిట్ మెంటు ప్రకటించారు.  ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఫిట్‌మెంట్‌కు అన్ని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, అర్థం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్థం చేసుకుని ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను సంతోషంగా స్వీకరించారు.

 కానీ, ఇక్కడ ఇబ్బందిపడిందల్లా చంద్రబాబు నాయుడు, ఆయన వర్గం మాత్రమే. వాళ్లు మాత్రమే ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. ఎంతగా అంటే చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, పచ్చ పత్రికలు.. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, ఏబీఎన్‌ కథనాలు చూసినా, వారి పేపర్లలో వార్తలు చూసినా... వారు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతోంది. ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది పడటం లేదు గానీ.. చంద్రబాబు నాయుడు, ఆయన వర్గం మాత్రం బాగా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. 
-  చంద్రబాబూ.. మీరెందుకు ఇంతగా ఇబ్బంది పడుతున్నారని మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం. 

 మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. "వాళ్లంతా మన పిల్లలు. లక్షా 35వేల మందికి ఆ గ్రామాల్లోనే, ఆ మండల పరిధిల్లోనే, ఆ పట్టణాల్లోనే సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌గారిది. వాళ్లని రెచ్చగొట్టాలని, ప్రేరేపించాలని" చంద్రబాబు, ఆయన వర్గం మీడియా ఎంతగానో తాపత్రయపడుతున్నారు. వారిపట్ల లేని ప్రేమను నటిస్తూ...  మొసలి కన్నీరు కారుస్తున్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. మీరెంత రెచ్చగొట్టినా విలేజ్‌, వార్డు, సెక్రటేరియట్‌ ఉద్యోగులు రెచ్చిపోరు. "మాకు జగనన్న అన్నం పెట్టారు. మమ్మల్ని గౌరవించింది. మాకు దశ, దిశ కల్పించింది. మాకు దేవుడు జగన్‌ మోహన్‌ రెడ్డిగారు"అని సగర్వంగా ఈరోజు సచివాలయ ఉద్యోగులు గుండెలమీద చేయి వేసుకుని చెబుతున్నారు. అలాంటివాళ్లను మీరు, మీ వర్గం మీడియా వాళ్లు రెచ్చగొడితే రెచ్చిపోతారా చంద్రబాబు? దయచేసి మొసలి కన్నీరు కార్చడం చంద్రబాబు అండ్‌కో, ఆయన మీడియా ఆపితే మంచిది. ఎన్ని వార్తలు రాసినా, ఎన్ని డిబేట్స్‌ పెట్టినా... చంద్రజ్యోతి, చంద్రనాడు పేపర్లలో పుంఖానుప పుంఖాలుగా వార్తలు రాసినా మీ పేపర్లను, మీ మీడియాను ప్రజలను దిబ్బలో కొడుతున్నారు.

 నిత్యావసర వస్తువుల ధరలపై బాబుగారు పోరాటం చేస్తారట. మార్కెట్‌లో కందిపప్పు, పంచదార, వంటనూనెల ధరలు పెరిగిపోయాయని... ఈ పెరుగుదలకు కారణం రాష్ట్ర ప్రభుత్వం అని ఒక చౌకబారు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ధరలు పెరగటానికి కారణం ఎవరో రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలియదా? ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం కారణం అయితే ... కేంద్రం రెండున్నరేళ్ళుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుకుంటూ పోతే, రవాణా ఛార్జీలు పెరుగుతుంటే దాని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే దీనికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని మాత్రం చంద్రబాబు అండ్ కో.. ప్రశ్నించదు. కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం చంద్రబాబు పల్లెత్తి మాట అనరు. అదే రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రిగారి మీద నిందలు వేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌, టీవీ5... అడ్డుపెట్టుకుని కథనాలు వండి వారుస్తారు. డిబేట్‌లు పెడతారు, ఇదెక్కడి న్యాయం చంద్రబాబూ..

 ఇంతటి అబద్ధాలు, అసత్యాలను నిస్సిగ్గుగా ప్రసారం చేయడం న్యాయమా అని అడుగుతున్నాం. మీకు దమ్ముంటే కేంద్రాన్ని ప్రశ్నించండి. కేంద్రంలో ఉండే పాలకుల్ని అడగండి. పెంచిన ఇంధన, గ్యాస్‌ ధరలను తగ్గించాలని అడగండి. అలా చేయకుండా మా మీద అసత్య ప్రచారాలు చేయడానికి సిగ్దుందా అని నారా చంద్రబాబు నాయుడు అండ్‌ కో వర్గాన్ని ప్రశ్నిస్తున్నాం. 
- పెరిగేది కొంత అయితే గోరంతలుగా, రెట్టింపు రేట్లు చంద్రబాబు చెప్పాడని, మీ పత్రికల్లో రాయడం, టీవీల్లో చూపించడం ద్వారా వ్యాపారస్తులను సైతం ధరలు పెంచండి అని పరోక్షంగా మీరే చెబుతున్నారు. వీళ్ల రాతలు, వీళ్ళ చేష్టలు చూసి వ్యాపారస్తులు ధరలు పెంచేయడం, ఇదే అదనుగా, మార్కెట్‌లో ఉన్న ధరల కన్నా మరింతగా ధరలు పెంచి హెరిటేజ్‌ సంస్థల్లో మీరు కూడా అమ్ముతున్నారే? ముందు మీ హెరిటేజ్‌ సంస్థల్లో ధరలు తగ్గించి.. అప్పుడు రోడ్డు మీదకు రా చంద్రబాబూ?.
-  అన్నీ వదిలేసి రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తారా? ఇంతగా దిగజారిపోతారా..
-  ఈనాడు దినపత్రిక విషయానికొస్తే.. రామోజీరావు ప్రియ పచ్చళ్ల అమ్మకంలో ఏం చేస్తున్నారో చెప్పాలి. మీరేమయినా తక్కువకు పచ్చళ్ళు అమ్ముతున్నారా? మీరేమో మార్కెట్‌ను విచ్ఛిన్నం చేస్తూ పెంచుకుంటూపోతూ హెరిటేజ్‌, ప్రియా సంస్థల్లో మీ వస్తువులు అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు. మరోవైపు ఏమాత్రం సిగ్గులేకుండా చంద్రబాబు నాయుడుతో కలిసి మీరు కూడా గగ్గోలు పెడుతూ ప్రభుత్వంమీద నిందలు వేస్తున్నారు. 

  చంద్రబాబుకు వంట్లో గ్యాస్‌ తంతుంది. ఈనో ఇచ్చినా, జెల్‌సిల్‌ టాబ్లెట్ ఇచ్చినా తట్టుకునే పరిస్థితిలో లేరు. 
- సాక్షిలో పెట్టుబడుల్ని,పెట్టుబడులుగా కాకుండా, ఆదాయంగా పరిగణిస్తున్నామని గతంలో ఆదాయపన్ను శాఖ అంటే ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంటు ఒక దుర్మార్గమైన వ్యవహారం చేసింది. ఈ వ్యవహారం సరికాదని, ఇన్ కమ్ ట్యాక్స్ ట్రైబ్యునల్ నిన్న అభిప్రాయపడితే.. దాన్ని కూడా ఈరోజు చంద్రబాబు విమర్శించాడు. చంద్రబాబు సమస్య అంతా సాక్షి అనే పత్రిక ఉండరాదని, నడవరాదని మాత్రమే తప్ప చంద్రబాబు బాధ చట్టానికి సంబంధించినది కాదు. 
- ఇన్ కమ్ ట్యాక్స్ ట్రైబ్యునల్  అభిప్రాయంతో పాపం చంద్రబాబు నాయుడుకు గ్యాస్‌ తంతోంది. ఆ గ్యాస్‌తో ఊగిపోతూ ఉన్నారు. మీకెందుకు అంత కడుపు మంట. మీ దగ్గరకు వచ్చేసరికి ఒక నీతి.. మాకు ఏదైనా మంచి జరిగితే ట్రైబ్యునల్‌, సీబీఐవాళ్లు క్లీన్ చిట్‌ ఇస్తే తట్టుకోలేడు. సాక్షి పత్రిక ఉండకూడదనే అక్కసుతో బాబు ఏ విధంగా వ్యవహరించారో అందరికీ తెలిసిన విషయమే. 

  చేతనైతే, జనంలో  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిమీద గెలువండి... దొడ్డిదారిన ఎందుకు? ఇలాంటి దొంగ దెబ్బలు తీసే నైజం మీకు అలవాటు. వైయ‌స్ జగన్ గారు సింహంలా జనంలోకి వస్తారు. చంద్రబాబు ఏమో ఎప్పుడూ దొంగదెబ్బ తీసే నక్కలా వ్యవహరిస్తాడు.  సింహానికి, నక్కకు ఎక్కడైనా పోలిక ఉంటుందా? అంతేకానీ మీ వర్గం మీడియాను అడ్డు పెట్టుకుని కాదు. అంతేకాకుండా చైతన్య రథం పేరుతో టీడీపీ ఈ-పేపర్‌ ఏదో ప్రవేశపెడుతూ.. సాక్షి పత్రికపై తన అక్కసును వెళ్లగక్కాడు.

  సంక్రాంతి పండుగ వేళలో అయినా.. పది నిజాలు చెబితే చంద్రబాబు నాయుడుకు నరకంలో పడే శిక్షలకు పదిశాతం అయినా రిబేట్‌ వస్తుందేమో. దేవుడు దయతలుస్తాడేమో. 
- ప్రతిరోజూ, ప్రతిక్షణం ప్రజల కోసమే బతుకుతున్న జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని కించపరచడానికి, ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు.  సమ సమాజ స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం జగన్ గారు పోరాడుతుంటే.. చంద్రబాబు మాత్రం తన సామాజికవర్గం కోసం ఆరాటపడుతున్నాడు.

  ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలను అందలం ఎక్కించాలి, వారికి ఉన్నత పదవులు ఉండాలని తాపత్రయపడుతుంటే.. చంద్రబాబు నాయుడు మాత్రం తన వర్గం బాగుండాలని, తన కులం బాగుండాలని మాత్రమే తాపత్రయపడుతున్నారు. ఇంతకన్నా దిగజారిన రాజకీయాలు ఏముంటాయని మేము అడుగుతున్నాం. పండుగ రోజుల్లో అయినా నిజాలు చెప్పమని చంద్రబాబుకు సూచిస్తున్నాం.

  పట్టణాల్లోని మధ్యతరగతి వర్గాల ప్రజలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు ఇచ్చే మంచి కార్యక్రమానికి ముఖ్యమంత్రిగారు శ్రీకారం చుట్టారు. అలాగే కోవిడ్‌ వస్తే ప్రతి పట్టణంలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు ప్లాంట్లను ప్రారంభించారు. ప్రతిరోజు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంటే చంద్రబాబుకు మాత్రం కడుపులో గ్యాస్‌, నొప్పి వస్తుంది. ఇక్కడ జరిగే మంచిని చూడలేక, గతంలోనూ చంద్రబాబు, ఆయన కొడుకు హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లే.. మరోవైపు థర్డ్‌వేవ్‌ రావడంతో మళ్లీ అక్కడకే పారిపోతారేమో... ఆయనతో పాటు వాళ్ల అబ్బాయ్‌ కూడా తుర్రుమని హైదరాబాద్‌ పోతాడు. ప్రజలతో ఉండేది, ప్రజల కష్టాలు తెలుసుకునేది, ప్రజలతో మమేకం అయ్యేది గౌరవ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఒక్కరే. 

 ముఖ్యమంత్రిగారు అందరికీ మంచి చేస్తున్నారని అధికారం నుంచి దిగిపోవాలా..? రైతు భరోసా ఇస్తున్నారనా? అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని దిగిపోవాలా? అన్నివర్గాల ప్రజలకు పక్షపాతిగా ఉండి, మమ్మల్ని గౌరవిస్తున్నందుకు దిగిపోవాలా? చంద్రబాబు అండ్‌ కో...ని ప్రజలు మళ్లీ తరిమి తరిమి కొట్టే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి. ఏపీ నుంచే కాదు రాష్ట్ర సరిహద్దులు కూడా చూడకుండా తరిమికొట్టే రోజు ముందుందని నారా చంద్రబాబు అండ్‌ కో కు చెబుతున్నాం.

  సినిమా టికెట్ల వ్యవహారంలో.. మాకు ఎవరిమీద కోపం లేదు. వైయ‌స్ జగన​ మోహన్‌ రెడ్డిగారిది ప్రజా ప్రభుత్వం. అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉంటేనే.. మా ప్రభుత్వం బాగుంటుంది. సినిమా పరిశ్రమ బాగుండాలి. ప్రజలు కూడా బాగుండాలి. అందర్నీ సంతోషపెట్టే కార్యక్రమమే మా ప్రభుత్వం చేస్తుంది.

Back to Top