గ్రామీణ ఆసుపత్రుల్లో మెడికోల నిర్బంధ సేవలు

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
 

న్యూఢిల్లీ : ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఏ కేటగిరీలో సీట్లు పొందిన పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికోలు వైద్య విద్య పూర్తి చేసిన అనంతరం ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్బంధంగా వైద్య సేవలు అందించాలి. ఈ నిబంధనల 2022-23 విద్యా సంవత్సరం నుంచి వర్తించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని రాజ్యసభలో మంగళవారం శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ కేంద్ర వైద్ శాఖ సహాయ మంత్రి  శ్రీమతి భారతీ ప్రవీణ్ తెలిపారు. అలాగే సబ్ సెంటర్ స్థాయిలో కూడా వైద్యాధికారులు సేవలందించే విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ట్రయల్ రన్ కూడా ప్రారంభించిందని ఆమె తెలిపారు. 
ప్రభుత్వ ఆసుపత్రల్లో స్పెషలిస్ట్ వైద్యులను నియమించుకునేందుకు సరళమైన నిబంధనలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కాంట్రాక్టింగ్ ఇన్, కాంట్రాక్టింగ్ అవుట్ పద్ధతిలో స్పెషలిస్ట్ సర్వీసులు, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి స్పెషలిస్టు డాక్టర్లను ప్రభుత్వ సేవలకు వినియోగించుకోవడం వంటి వాటిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద వైద్యులకు ఏరియా అలవెన్సులు, పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు వసతి, రవాణా ఖర్చులు వంటి వాటిని ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకునే విధంగా వీలుకల్పించినట్లు తెలిపారు.  
డాక్టర్లు, స్పెషలిస్టులను ఆకర్షించే విధంగా జీతభత్యాలు నిర్ణయించుకునే అధికారం కూడా రాష్ట్రాలకు ఇచ్చినట్లు వెల్లడించారు. అందులో  భాగంగానే యువర్ కోట్, యువర్ పే విధానం ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొతరను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం డిస్ట్రిక్స్ రెసిడెన్సీ ప్రోగ్రాంను ఆమోదించింది. ఇందులో భాగంగా పీజీ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్నవిద్యార్థులు జిల్లా ఆసుపత్రుల్లో సేవలందించేందుకు మూడు నెలలపాటు నియమిస్తారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం కింద ప్రతినెలా 9వ రోజున 2, 3 ట్రైమిస్టర్‌లోని గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేయడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.6 కోట్ల మంది గర్భిణీలకు యాంటీ నాటల్ వైద్య సేవలందించినట్లు మంత్రి తెలిపారు. 

ఏపీలో 3 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం
న్యూఢిల్లీ, డిబర్ 13: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత (సీఎస్‌ఎస్‌) కింద ఆంధ్రప్రదేశ్‌లోని  పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో నూతన వైద్య కళాశాలలు ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. ఈ మూడు కాలేజీల్లో 150  ఎంబీబీఎస్ సీట్లు పెంచేందుకు అనుమతించినట్లు తెలిపారు. అలాగే  రెండవ దశలో రాష్ట్రంలోని 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను బలోపేతం చేస్తూ కొత్త పీజీ కోర్సులు ప్రారంభించేందుకు 1040 పీజీ సీట్లు పెంచేందుకు అనుమతించినట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశవ్యాప్తంగా సీఎస్ఎస్ కింద మూడో దశల్లో దేశవ్యాప్తంగా 157 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. జాతీయ మెడికల్ కమిషన్ అందించిన సమాచారం ప్రకారం ఏపీలో 13 ప్రభుత్వ వైద్య కళాశాలలతో సహా 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పటికే సీఎస్ఎస్ కింద మంజూరు చేసిన 157 మెడికల్ కాలేజీల లిస్టులో లేని కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరినట్టు మంత్రి తెలిపారు. రూరల్ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు లేని ప్రాంతాల్లో జిల్లా ఆసుపత్రులు, రిఫరల్ ఆసుపత్రులకు అనుసంధానంగా వైద్య కళాశాలలు నెలకొల్పుతున్నట్లు మంత్రి తెలిపారు.

Back to Top