తాడేపల్లి: అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ రథం దగ్ధం ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, తప్పు చేసిన వారు తప్పించుకునే పరిస్థితి లేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తక్షణమే స్పందించి అలసత్వం వహించిన అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు నూతన రథం కోసం రూ.95 లక్షలు మంజూరు చేశారన్నారు. ఫిబ్రవరిలో రథోత్సవం వరకు రథం తయారు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ''దేవాదాయ శాఖ మంత్రిగా నేను, జిల్లా మంత్రులు విశ్వరూప్, వేణుగోపాల కృష్ణ అంతా కలిసి అంతర్వేదిలో పర్యటించాం. విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సామరస్యంగా సూచనలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పాం. కొంత మంది విద్రోహశక్తులు విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ముసుగులో దూరి అంతర్వేదిలో ఉన్న చర్చిపై రాళ్లు రువ్వడం దురదృష్టకరం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే.. చర్చి, మసీద్, గుడిపై దాడులు చేస్తే ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం. అర్ధరాత్రి ఏవిధంగా రథం తగలబడిందో తెలియదు. దీనికి కులాలు, మంత్రులకు అంటగడుతున్నారు. ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణకు ఆదేశించింది. ఇంకా నిజానిజాలు బయటకు రాలేదు. అప్పుడే దానిపై గగ్గోలు. ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు. తగలబెట్టడం, దేవాలయాలు కూల్చివేసే సంస్కృతి గత ప్రభుత్వానిదే. తుని రైలు ఘటన, అమరావతిలో అరటి తోటల దగ్ధం, పుష్కరాల పేరుతో 40 గుళ్లు కూల్చివేసిన పరిస్థితులు గత ప్రభుత్వంలో చూశాం. విజయవాడలో దక్షణాముఖ ఆంజనేయస్వామి గుడి, రాహు, కేతు గుడి, సాయిబాబా గుడి, సీతమ్మవారి పాదాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక దేవాలయాలను కూల్చివేశారు. దాంట్లో బీజేపీ భాగస్వామ్యం ఉంది. ఆ రోజున దేవాదాయ శాఖ మంత్రిగా ఉంది బీజేపీ నాయకుడు కాదా..? ఆనాడు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురిపై బాధ్యత లేదా..? ఆ దేవాలయాలను పునర్నిర్మించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. అటువంటి ప్రభుత్వంపై మచ్చ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కానీ, మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం మంచిది కాదు. హిందూ ప్రేమికులకు, స్వామీజీలకు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, ఇతర సేవా సంస్థలు ఎవరైనా సూచనలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ, మతం ముసుగులో మసీద్లు, చర్చీలు, దేవాలయాలపై దాడి చేస్తే ఉపేక్షించే పరిస్థితి లేదు. గుళ్లు కూల్చేసే సంస్కృతి హైదరాబాద్లో కూర్చొని జూమ్లో మాట్లాడే వ్యక్తులది''.