అసెంబ్లీ: పాడి రైతులకు అదనపు ఆదాయం చేకూర్చేందుకు అమూల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, మహిళా సాధికారత దిశగా ఏపీ అమూల్ ప్రాజెక్టు పనిచేస్తుందన్నారు. సీఎం వైయస్ జగన్ లక్ష్యసాధనలో భాగస్వామి కావడం తన అదృష్టమన్నారు. ఏపీ అమూల్ ప్రాజెక్టు ఏ ప్రైవేట్ డెయిరీకి పోటీ కాదన్నారు. ఏపీ అమూల్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడారు.
ఆయన ఏం మాట్లాడారంటే..
ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలు, ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాంటి పత్రికలు, ఛానళ్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా సభలో చర్చించాలన్నారు. ప్రభుత్వ ప్రకటనలను ఆ పత్రికలకు కూడా ఇస్తున్నాం. ఎక్కడా పక్షపాతం చూపించడం లేదు.
3.5 శాతం ఫ్యాట్తో ఉన్న ఆవు పాలకు డెయిరీలన్నీ రైతులకు రూ.23 నుంచి 25 రూపాయలు చెల్లిస్తాయి. 9.5 శాతం ఫ్యాట్ ఉన్న గేదెపాలు అయితే రూ.54 లేదా రూ.55 చెల్లిస్తాయి. డెయిరీలు వినియోగదారులకు పాలు అమ్మే లీటర్ పాల ప్యాకెట్లో 70 శాతం ఆవు పాలు, 30 శాతం గేదె పాలు ఉంటాయి. లీటర్ పాలనను రూ. 58 అమ్ముతున్నారు. ఒక్క లీటర్ పాల ప్యాకెట్ అమ్మి రూ.25 లాభం పొందుతున్నారు. ఒక లీటర్ పాల నుంచి 40 గ్రాముల వెన్న తీస్తారు. వెన్న తీసిన పాలకు రూ.1 తగ్గిస్తారు. 40 గ్రాముల వెన్నను రూ.15 విక్రయిస్తున్నారు. ఒక రూపాయి తగ్గితే రూ.15 పెరిగింది. ఒక లీటర్ పాలకు డెయిరీకి రూ.34 లాభం వస్తుంది.
ఈ రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ డెయిరీలు కలిపి 60 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నాయి. డెయిరీ ఇండస్ట్రీలో సంవత్సరానికి రూ.76,650 కోట్ల వ్యాపారం జరుగుతుంది. హెరిటేజ్ సుమారు 10 లక్షల లీటర్లను సేకరిస్తుంది. రోజుకు 10 లక్షల లీటర్లకు.. లీటర్కు రూ.34 లాభం చొప్పున 365 రోజులకు రూ.1,277 కోట్లు హెరిటేజ్ సంస్థ లాభాలు సంపాదిస్తుంది. ఇంత లాభం సంపాదిస్తున్న అంశంపై అసెంబ్లీలో చర్చ పెడితే బాధ, కోపంతో చంద్రబాబు వెళ్లిపోయారు.
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పాడి పరిశ్రమ సుమారు 6 శాతం జీడీపీలో భాగంగా ఉండి.. సంవత్సరానికి రూ.36,630 కోట్లను జీవీఐ కింద అర్జిస్తుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి అవకాశం ఉన్న అద్భుతమైన మెకానిజం ఈ డెయిరీ రంగం. మన రాష్ట్రంలో 40 లక్షల ఆవులు, 60 లక్షల గేదెలు ఉన్నాయి. పాల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ నాల్గవ స్థానంలోఉంది. మన రాష్ట్రంలో రోజుకి 412 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రైవేట్ డెయిరీ అన్నీ కలిపి 69 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నాయి. 123 లక్షల లీటర్ల పాలను ఇంటి అవసరాలకు వాడుకుంటున్నాం. 219 లక్షల లీటర్ల పాలు అనార్గనైజింగ్ సెక్టార్లో సేల్ అవుతుంది. సుమారు 27 లక్షల మంది మహిళలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు.
1971 వరకు డెయిరీ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ ఉండేది. 1974లో ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ను తీసుకువచ్చారు. 1995లో ఆంధ్రప్రదేశ్ మ్యూచ్వల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ వచ్చింది. ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే యాక్ట్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను కవర్ చేసే విజయ్ విశాఖ డెయిరీ 1999లో ఏపీ మ్యాక్స్ యాక్ట్ కింద కన్వర్ట్ అయ్యింది. ఎలాంటి నిబంధనలను పాటించకుండా అప్పుడున్న ప్రభుత్వాల సహకారంతో సొంత మనుషులను డెయిరీల్లో పెట్టుకొని మ్యాక్స్ యాక్ట్ కింద కన్వర్ట్ చేశారు. విశాఖ, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు డెయిరీలు మ్యాక్స్ యాక్ట్ పరిధిలోకి తెచ్చి చిత్తూరు డెయిరీని కోఆపరేటీవ్ సొసైటీ కిందే ఉంచారు. చిత్తూరు డెయిరీ చైర్మన్గా రాజసింహులు అనే చంద్రబాబు వ్యక్తి ఉండేవారు. ఆ డెయిరీని మ్యాక్స్ యాక్ట్ కిందకు మార్చితే పోటీ అవుతుందని కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కిందే ఉంచారు. చిత్తూరు డెయిరీ ఆ సమయంలోనే 3 లక్షల లీటర్ల పాలను సేకరించేది. 2003 సంవత్సరానికి వచ్చే సరికి డెయిరీని నడిపించలేం, నష్టపోతున్నామనే స్థితికి చిత్తూరు డెయిరీని తీసుకువచ్చారు. ఒక ప్లాన్ ప్రకారం రాష్ట్రంలోని డెయిరీలను నిర్వీర్యం చేశారు. హెరిటేజ్ సంస్థకు చిత్తూరు జిల్లా ప్రధానమైన పాల సేకరణ కేంద్రంగా చేశారు.
ఏపీ అమూల్ ప్రాజెక్టు ఏ ప్రైవేట్ డెయిరీకి పోటీ కాదు. సుమారుగా 200 లక్షల లీటర్ల పాలు అనార్గనైజింగ్ సెక్టార్లోకి వెళ్తున్నాయి. వాటిని ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి తీసుకురావాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది.
2017–18 సంవత్సరంలో 1,262 వందల గ్రామాల్లో పాల సేకరణ చేపట్టాం. 2018–19 సంవత్సరానికి 11 వందల గ్రామాలు అయ్యింది. 2019–20 వచ్చే సరికి 800 గ్రామాల్లోనే మనం పాల సేకరణ చేపట్టాం. యావరేజ్ పాల సేకరణ తీసుకుంటే.. 2017–18లో 225 లక్షల లీటర్లు, 2018–19లో 200 లీటర్లు, 2019–20 130 లీటర్లకు తగ్గింది.
ఏపీడీడీసీఎల్ ఆధ్వర్యంలో 141 బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు ఉంటే అందులో కేవలం 26 మాత్రమే పనిచేస్తున్నాయి. బిజినెస్ ఆపరేషన్ ప్రతి సంవత్సరం నష్టాల్లోకి వెళ్తుంది. 2014–15లో 66 లక్షల ప్రాఫిట్ వస్తే.. 2016–17లో 59 లక్షల ప్రాఫిట్, 2017–18లో కోటి రూపాయల నష్టం, 2018–19లో 2.63 కోట్ల నష్టం, 2019–20లో 3.5 కోట్ల నష్టం వాటిల్లింది. మంచి లక్ష్యాలతో మొదలైన ఏపీడీడీసీఎఫ్ ప్రభుత్వాలు డెయిరీలు చేయాలనే కుట్రకు నిర్వీర్యం అయ్యాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైయస్ జగన్ తన పాదయాత్రలో అనేక మంది పాడి రైతులతో నేరుగా మాట్లాడారు. 2019–20 బడ్జెట్ సమావేశాల్లోనే పాడి రైతులకు లీటర్కు రూ.4 అదనంగా ఇస్తామని చెప్పారు. ఏపీడీడీసీఎల్ నిర్వీర్యం అయిపోతుంది. గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మంచి ప్లాంట్లు లేవు.. ఇవేవీ లేకుండా రూ.4 అదనంగా ఎలా ఇస్తారని ఆశ్చర్యపోయాను.
ఒక నాయకుడికి దారి తెలియడమే కాదు, బాటలు వేయడమూ తెలిసి ఉండాలి. త్రోవ చూపించడం కూడా తెలిసి ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఆయనే మన ముఖ్యమంత్రి వైయస్ జగన్.
పాడి రైతులకు అదనపు ఆదాయం చేకూర్చేందుకు అమూల్తో ఒప్పందానికి ప్రధాన కారణం. రైతులకు అదనపు ఆదాయం, కోఆపరేటివ్ సొసైటీ కింద వచ్చే ఆదాయం కూడా రైతులకే పంచాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అమూల్ సంస్థ ఏ రాష్ట్రంతో కలిసి పనిచేయలేదు. ఇదీ వైయస్ జగన్పై ఉన్న నమ్మకం. రైతులను కోఆపరేటివ్ సొసైటీలో వాటాదారులుగా చేస్తానని చెప్పారు. మహిళా సాధికారతే లక్ష్యంగా, మహిళల అభివృద్ధే ధ్యేయంగా సీఎం వైయస్ జగన్ పనిచేస్తున్నారు. మహిళలకు అదనపు ఆదాయం చేకూర్చడానికి ఏపీ అమూల్ పనిచేస్తుంది.
రాష్ట్రంలో 10641 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఆర్బీకేలు ఉన్న గ్రామాల్లో 9,899 పాలు ఉత్పత్తి గ్రామాలు ఉన్నాయి. 9899 గ్రామాల్లో మహిళా కోఆపరేటివ్ డెయిరీ సొసైటీలను తయారు చేస్తున్నాం. కోఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయడానికి, మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం రూ.3వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ప్రభుత్వం అమూల్కు రూ.3 వేల కోట్లు ఉన్నారని అంటున్నారు. అమూల్కు ఇవ్వడం కాదు.. మహిళా కోఆపరేటివ్ డెయిరీ సొసైటీని బలోపేతం చేస్తున్నాం. గ్రామాల్లోని పాలను సేకరించి బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లో నిల్వ చేస్తారు. అక్కడ నుంచి మార్కెటింగ్, ట్రాన్స్పోర్టు జీసీఎంఎంఎఫ్ వారు వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా చూసుకుంటారు. తద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూరే పరిస్థితి వచ్చింది. పైలట్ ప్రాజెక్టు కింద ప్రకాశం, చిత్తూరు, వైయస్ఆర్ జిల్లాల్లో 400 గ్రామాల్లో ప్రారంభించాం.