బీసీల అభ్యున్నతికి చంద్రబాబు మోకాలడ్డు

స్థానిక ఎన్నికల రిజర్వేషన్‌ను అడ్డుకుంది బాబే

బిర్రు ప్రతాప్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదా..?

బీసీలను టీడీపీ ఓటు బ్యాంకుగా వాడుకుంది

బలహీనవర్గాల అభ్యున్నతి సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయం

పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ

తాడేపల్లి: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతిని చంద్రబాబు అడ్డుకున్నాడని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత తమ బతుకుల్లో మార్పులు వస్తాయని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆశతో ఎదురుచూశారని, ఇచ్చిన మాట ప్రకారం అనేక విధాలైన నిర్ణయాలతో ఈ వర్గాల జీవన శైలి, రాజకీయ ఎదుగుదలకు సీఎం శ్రీకారం చుట్టారన్నారు. అట్టడుగున ఉన్న బీసీలను రాజకీయంగా పైకి తీసుకువచ్చేందుకు 59 పైచిలుకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ తీసుకువస్తే దానికి చంద్రబాబు మోకాలొడ్డాడని మండిపడ్డారు. ఇన్నాళ్లూ బీసీలను కేవలం ఓటు బ్యాంకు కోసమే చంద్రబాబు వాడుకున్నాడని దుయ్యబట్టారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన ఏం మాట్లాడారంటే.. ‘స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ సామాజికవర్గాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న తీరు విడ్డూరంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఆది నుంచి బీసీ వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి, మనుగడకు నిరంతరం శ్రమించాను అనే గ్లోబెల్స్‌ ప్రచారానికి తెరతీశాడు. దానిలో స్థానిక సంస్థల ఎన్నికలను పరిగణలోకి తీసుకోవడం చంద్రబాబు నాయుడు ద్వంద్వ రాజకీయ ప్రమాణాలకు అద్దం పడుతుందనేదానిలో ఎలాంటి సందేహం లేదు. సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర జనాభాలో 50 శాతం పైచిలుకు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వారి బతుకుల్లో మార్పులు వస్తాయని ఎంతో ఆశతో ఎదురుచూశారు. అందుకు అనుగుణంగా సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వానికి అండగా నిలబడి 151 స్థానాల్లో గెలిపించారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఆశలు, నమ్మకం వమ్ము చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం అనేక విధాలైన నిర్ణయాల ద్వారా ఈ వర్గాల జీవన శైలి, రాజకీయ ఎదుగుదలకు శ్రీకారం చుట్టారు.

50 శాతం రిజర్వేషన్‌ మించకుండా ఎన్నికలకు వెళ్లాలని కోర్టు చెప్పిన తరువాత 59 శాతం రిజర్వేషన్‌తో ఎన్నికలకు వెళ్లాలి.. లేకపోతే నష్టం చేసినవాళ్లం అవుతామని అనవసర ప్రచారానికి తెరతీశారు. 59.85 శాతం కాదు.. 50 శాతం మేరకు ఎన్నికలు జరగాలని మొదట కోర్టుకు వెళ్లింది టీడీపీయే. సుప్రీం కోర్టు రాష్ట్ర హైకోర్టు పరిధికి పంపించడం.. హైకోర్టు 59.85 శాతం కాదు.. 50 శాతం మించకుండా ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించడం.. ఈ ప్రక్రియకు ప్రధాన కారకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు, బిర్రు ప్రతాప్‌రెడ్డి. ఇతన్ని రాష్ట్ర ప్రభుత్వం చేత ఎన్‌ఆర్‌జీఎస్‌ వర్క్స్‌కు సంబంధించిన కమిటీలో డైరెక్టర్‌గా నియమించింది టీడీపీ ప్రభుత్వమే. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి.

కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తూ.. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి పాటుపడాలని ప్రయత్నం చేస్తుంటే నాలుగుఐదు రోజుల నుంచి టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం చూస్తుంటే.. చంద్రబాబు వైఖరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి గొడ్డలి పెట్టు. బీసీ సామాజికవర్గాన్ని చంద్రబాబు ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు బీసీలను ఆకట్టుకోవడానికి ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు, తాడు మోకు ఇస్తామని స్వల్పకాలిక ప్రయోజనాలతో బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకే ప్రయత్నించాడు కానీ శాశ్వత ప్రయోజనాల కోసం ఏనాడూ కార్యక్రమాలు చేపట్టలేదు.
 
సీఎం వైయస్‌ జగన్‌ గతంలో ఎన్నడూ జరగని విధంగా.. భవిష్యత్తులో ఎవరూ చేయలేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే.. వారిలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాలకు చెందిన వారు. బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి కొద్దికాలంలోనే శాశ్వత బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించారు. ఇలాంటి ప్రయత్నం చంద్రబాబు ఏనాడైనా చేశాడా..? తన స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు బీసీలను వాడుకున్నాడు. నామినేటెడ్‌ పోస్టులు, వర్క్స్‌లో, చట్టసభల్లో 50 శాతానికి తక్కువ కాకుండా సమానమైన హక్కులు కల్పించారు’ అని గుర్తుచేశారు.

 

Back to Top