దేశవ్యాప్త నిబంధనలే ఏపీలో అమలు చేస్తున్నాం

వినాయక చవితి పండగపై టీడీపీ, బీజేపీ రాజకీయం

శవరాజకీయాలు చేయడం తుప్పు, పప్పులకు అలవాటైంది

సీఎం వైయస్‌ జగన్‌ అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తారు

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

విజయవాడ: వినాయక చవితి ఉత్సవాలపై కేంద్ర ప్రభుత్వ నిబంధనలే ఏపీలో అమలు చేస్తున్నామని, కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఇంట్లోనే వినాయక చవితి జరుపుకోవాలని సూచించడం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. వినాయక చవితి దేశం మొత్తం జరిగే పండగ అని, ఉత్సవాలకు అనుమతిస్తే కోవిడ్‌ వ్యాప్తి పెరుగుతుందని కేంద్రం కొన్ని నిబంధనలు తీసుకువచ్చిందన్నారు. ఆ నిబంధనల ప్రకారమే వినాయక చవితి జరుపుకోవాలని ప్రభుత్వం సూచించిందన్నారు. ఏపీలో అడ్రస్‌ లేని బీజేపీ.. దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తోందని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. 

మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. కాషాయరంగు, దేవుడి బొమ్మలను అడ్డం పెట్టుకొని విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. వినాయక చవితి పందిర్ల వద్ద ఉండే జనంలో 10 శాతం కూడా బీజేపీ దగ్గర ఉండరని, ఏపీలో బీజేపీ గురించి, సోము వీర్రాజు గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 

దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తే.. చంద్రబాబు, పప్పు లోకేష్‌ ఇద్దరూ శవాలను అడ్డంపెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్నారు. శవ రాజకీయాలు చేయడానికి తుప్పు, పప్పులకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక చవితి బహిరంగ ప్రదేశాల్లో జరుపుకోవాలని మాట్లాడుతున్న చంద్రబాబు.. థర్డ్‌ వేవ్‌ విజృంభిస్తే అప్పుడేం మాట్లాడతారు..? అని ప్రశ్నించారు. కోవిడ్‌ నిబంధనల ప్రకారం దేశ వ్యాప్తంగా వినాయక చవితిపై ఆంక్షలు ఉన్నాయని, ఏపీలో ఏదో ప్రత్యేకంగా ఉన్నట్లు కులాలు, మతాలు రాజకీయాలకు తీసుకువచ్చి నీచాతినీచంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, బీజేపీకి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు, వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వానికి అన్ని మతాలు, కులాలు, ప్రతి ఒక్కరి విశ్వాసాలపై గౌరవం ఉందన్నారు. కరోనా కష్టకాల సమయంలో ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఇంట్లోనే వినాయక చవితి జరుపుకోవాలని ప్రజలను కోరారు. 

Back to Top