ధరలు పెరగడంతో సబ్సిడీకి ఉల్లి 

నాఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసి కిలో రూ.40కే అందిస్తున్నాం

వరదల పేరుతో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

తాడేపల్లి: వరదల వల్ల ఉల్లి ధరలు పెరగడంతో సబ్సిడీకి ఇవ్వాలని నిర్ణయించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వరదల పేరుతో ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్‌ సమీపంలోని రైతు బజార్‌ను మంత్రి కన్నబాబు సందర్శించారు. సబ్సిడీ ఉల్లిని వినియోగదారులకు అందజేశారు.  సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రైతుబజార్లలో కిలో ఉల్లి రూ.40కే అందిస్తున్నామన్నారు. ఉల్లి ధర పెరగడంతో నాఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసి రూ.40కే అందిస్తున్నామన్నారు. ఈ మేరకు మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..  ఉల్లి ధరలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించారన్నారని చెప్పారు. షాపుల వద్ద తప్పనిసరిగా ధరల పట్టిక పెట్టాలని సీఎం ఆదేశించారన్నారు. నిత్యావసరాల సరఫరాపై కలెక్టర్లు, ఎస్పీలు దృష్టిపెట్టాలని సూచించారు.

హైదరాబాద్‌లో కాపురం పెట్టి.. ఏపీపై పెత్తనం
వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు హైదరాబాద్‌లో కాపురం పెట్టి.. ఏపీపై పెత్తనం చలాయిస్తున్నారని మండిపడ్డారు. లోకేష్‌ తొలిసారి వరద ప్రాంతాల్లో పర్యటించినట్టున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి ఏ ఒక్కరికో నోటిఫై చేసింది కాదు.. అందరికీ హక్కు ఉంటుందన్నారు. అమరావతిలో పేదలు, దళితులకు ఇళ్ల స్థలాలు పొందే హక్కు ఉందన్నారు.  
 

Back to Top