సీఎం వైయ‌స్ జగన్ వినూత్న ఆలోచనే ‘వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు’

వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌కు మంత్రి కన్నబాబు శంకుస్థాపన

 కాకినాడ: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వినూత్న ఆలోచనే వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం ఆయన కాకినాడ రూరల్ వాకలపూడి రోడ్డు లో వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ జులై 8 వైయ‌స్సార్‌ జయంతి (రైతు దినోత్సవం) రోజున 61 ల్యాబ్‌లు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తామని తెలిపారు. వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లకు ఆక్వా ల్యాబ్‌లు అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. కల్తీ నివారణ కోసం ప్రతి జిల్లాలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రూ.15వేల కోట్లతో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. రైతుల యంత్రాల వినియోగం కోసం ఫామ్‌ మెకనైజ్డ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సామర్లకోట, శ్రీకాకుళం, కర్నూలులో ఫామ్‌ మెకనైజ్డ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.

Back to Top