2024 ఎన్నికల వాకౌట్‌కు చంద్రబాబు సిద్ధం

ఆర్‌ అండ్‌ బీ మంత్రి దాడిశెట్టి రాజా  

మోదీతో ఫలించని దత్తపుత్రుడి రాయబారం 

కొడుకుతో సింగపూర్‌ పారిపోవడం ఖాయం

తుని హత్యా రాజకీయాలకు ఆద్యుడే ‘యనమల’

నాటి దుర్మార్గాలే టీడీపీ నేతల్ని వెంటాడుతున్నాయి

టీడీపీలో హాఫ్‌ టికెట్‌గాడు లోకేష్‌

తుని: రాష్ట్రంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడుకు గ్రౌండ్‌ రియాల్టీ ముందుగానే అర్ధమైందని.. 2019 ఎన్నికల్లో మాదిరిగానే 2024లో ఇంకా ఘోరమైన పరాజయంతో ఓడిపోతాననే భయంతో ఉన్నాడని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ప్రజల నాడి తెలుసుకున్న చంద్రబాబు గతంలో అసెంబ్లీలో వాకౌట్‌ చేసినట్టుగానే 2024 ఎన్నికలకూ దూరం కాబోతున్నారని తేల్చి చెప్పారు. ఉత్తపుత్రుడ్ని పక్కన పెట్టుకుని దత్తపుత్రుడితో ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడించిన రాయబారం ఫలించలేదని, అందుకే తన పుత్రుడితో కలిసి చంద్రబాబు త్వరలో సింగపూర్‌కు పారిపోబోతున్నారని మంత్రి రాజా అన్నారు.

అయోమయంలో చంద్రబాబు:
    ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడమని పవన్‌కళ్యాణ్‌ను పంపించి చంద్రబాబు చేయించిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ప్రధాని మోదీ ఆయన్ను తిరస్కరించాడని తెలిసి.. చంద్రబాబు అయోమయంలో పడ్డారు. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ముందుగానే అర్ధమై.. గత స్థానిక సంస్థల ఎన్నికలను ఏవిధంగా వాకౌట్‌ చేశాడో.. అదే మాదిరిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నాడు. టీడీపీలో హాఫ్‌నిక్కర్‌ గాడు లోకేష్‌.. వాడు నాగురించి ప్రస్తావిస్తూ.. తునిలో ఏదో అరాచకాలు జరుగుతున్నాయని.. ఆ అరాచకాలపై పోరాడే వాళ్లపై దాడులు చేయిస్తున్నానని అంటున్నాడు.

హాఫ్‌ టికెట్‌.. వచ్చి చూడు:
    ‘ఒరే.. హాఫ్‌ టిక్కెట్‌గా.. నువ్వొకసారి తుని వచ్చి ఇక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ల మనసుల్లో ఏముందో.. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోరా..’ గత నలభై ఏళ్ల నుంచి నీ పార్టీ నాయకులు, యనమల రామకృష్ణ తాబేదార్లు చేసిన అరాచకాలకు బలయిన బాధితులు ఏ మూల నుంచి ఏం చేస్తారేమోనని భయపడిన నీ పార్టీ నేతలు, గత మూడున్నరేళ్లుగా రెండంచెల భద్రత పెట్టుకుని మగ్గిపోతున్నారు. ఎల్లప్పుడూ అధికారం మాదే అని విర్రవీగిన వారి కండకావరానికి, ఎవరైనా వచ్చి తమపై బదులు తీర్చుకుంటారేమోనని భయపడి చస్తున్నారు. ఈ విషయం నేను చెప్పడం కాదు.. మీ పార్టీ నేతల ఇళ్లల్లో మహిళలే ప్రెస్‌మీట్లు పెట్టి మరీ చెబుతున్నారు.

దాడులు చేసే సంస్కృతి మాది కాదు:
    వ్యక్తుల మీద దాడులు చేసే సంస్కృతి మాది కాదు. ఆ అలవాటు కూడా మాకు లేదు. గత 40 ఏళ్లుగా తునిని పట్టి పీడిస్తున్న వ్యక్తి యనమల రామకృష్ణ. ఆయనది నీచమైన సంస్కృతి. తునిలో టీడీపీ నేతల వల్ల ఇప్పటి వరకు సుమారు 40 హత్యలు జరిగాయి. ఆ హత్యల వివరాలన్నీ ఫొటోలతో సహా  హైదరాబాద్‌లో మీ ఇంటి (యనమల) ముందు ఫ్లెక్సీలు పెట్టమంటే పెడతాను. ఎందుకంటే, నువ్వు తునిలో ఉండవు కదా.. నువ్వూ, నీ తమ్ముడు మూలంగానే ఆ హత్యలు జరిగాయి. 

నియోజకవర్గ అభివృద్ధికి ఆర్గనైజేషన్‌:
    తునిలో ఒక ఆర్గనైజేషన్‌ నడుస్తుందని.. అరాచకాలు జరుగుతున్నాయని అంటున్నావు. ఎస్‌.. తునిలో ఒక ఆర్గనైజేషన్‌ నడుస్తున్న మాట వాస్తవమే.. నియోజకవర్గ ప్రజలకు మంచి చేయడానికి.. అభివృద్ధిపథంలో నడిపించడానికి ఈ ఆర్గనైజేషన్‌ నడుస్తుంది.

బాబు ముఖం మీద..:
    చంద్రబాబు ఈరోజు డ్వాక్రా సంఘాలను క్లెయిం చేసుకుంటున్నారు. ఏ పథకమైనా.. ప్రాంతమైనా బాగా అభివృద్ధిలోకొచ్చి క్లిక్‌ అయ్యిందంటే చాలు.. అది నా క్రెడిట్‌ అంటూ ఊదరగొట్టే బుద్ధే చంద్రబాబుది. సెల్‌ఫోన్, టీవీ, ఇంటర్‌నెట్‌ నేనే తెచ్చానంటారు. ప్రపంచంలో అన్నింటినీ క్లెయిం చేసుకునే వ్యక్తి చంద్రబాబు. మహా నాయకుడు స్వర్గీయ పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన డ్వాక్రా సంఘాలను ఈ రాష్ట్రంలో సర్వనాశనం చేసిందే చంద్రబాబు. 2014 ఎన్నికల్లో డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి.. వారిని నిట్టనిలువునా చంద్రబాబు ముంచితే.. దేవుడులాగా నిల్చారు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. ఆయనే కనుక వారికి అండగా నిలవకపోతే, ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాలు ఈరోజుకు నిలదొక్కుకుని ఉజ్వలంగా ఉండేవి కావు. ఈ విషయం ప్రజలకు తెలియదనుకుంటున్న చంద్రబాబు డ్వాక్రా సంఘాల్ని క్లెయిం చేసుకుంటున్నాడంటే.. ఆయన మాటలకు ఈ రాష్ట్ర ప్రజలు ఛీ..ఛా అనాలో.. ముఖం మీదే ఉమ్మేయాలో అర్ధం కాని పరిస్థితి ఉంది.

బాబు మాటలు విడ్డూరం:
    14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ప్రజల దగ్గరకెళ్లి ఏం చెప్పుకోవాలో.. ఎలా మాట్లాడాలో.. తెలియని స్థితిలో ఉన్నాడు. ఈ రాష్ట్రానికి ఆయన చేసిన మేలు, అభివృద్ధి, జన సంక్షేమం గురించి చెప్పుకోకుండా.. నేను ముసలాడినయ్యాను.. నాకు ఇవే చివరి ఎన్నికలంటూ అడుక్కోవడం విడ్డూరంగా ఉంది.
 

Back to Top