సచివాలయం: వైయస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్పై ఈరోజు సాయంత్రం ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సీసీఎస్ విధానంలోని అంశాలు ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉన్నాయని, వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సీపీఎస్ను పరిశీలించి.. మళ్లీ పాత విధానాన్ని ప్రవేశపెడతామని సీఎం వైయస్ జగన్.. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, ఎన్నికల ప్రణాళికలోనూ చెప్పిన మాట వాస్తవమేనన్నారు.
ఎన్నికల ప్రణాళికలోని 100 శాతం హామీల్లో 95 శాతం హామీలు ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన 5 శాతం హామీల్లో సీపీఎస్ కూడా ఒకటన్నారు. సీపీఎస్ మీద పలుసార్లు చర్చలు జరిగాయని, మళ్లీ ఓపీఎస్ తీసుకురావడానికి రాష్ట్ర ఆర్థిక పరమైన ఇబ్బందులు, కేంద్ర ప్రభుత్వంతో ఇబ్బందులు ముడిపడి ఉన్నాయి కాబట్టి.. సీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని ఇవ్వాలని పలుమార్లు చర్చలు కూడా జరిపామని చెప్పారు. అందులో భాగంగా కేబినెట్ సబ్ కమిటీని కూడా సీఎం వైయస్ జగన్ నియమించారన్నారు. మంత్రుల కమిటీ సీపీఎస్ విధానంపై పలుమార్లు చర్చలు జరిపిందని గుర్తుచేశారు. ఇదే అంశంపై ఉద్యోగ సంఘాలతో ఈరోజు సాయంత్రం మీటింగ్ ఉందని, సమావేశంలో చర్చించిన అనంతరం అన్ని విషయాలను వివరిస్తామని చెప్పారు.